ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లడ్డూ అపవిత్రం వివాదం.. శ్రీవారి ఆలయంలో రేపు శాంతి హోమం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Sep 22, 2024, 10:05 PM

తిరుమల లడ్డూ అపవిత్రమైందన్న వార్తల మధ్య టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది.తిరుమలలో శాంతి హోమం నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు టీటీడీ ఆగమ సలహా మండలి నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా సోమవారం ఉదయం ఆరు గంటల నుంచి 10 గంటల వరకూ శాంతి హోమం నిర్వహించనున్నారు. శ్రీవారి ఆలయంలోని బంగారు బావి పక్కన ఉన్న యాగశాలలో శాంతి హోమం నిర్వహిస్తారు.శాంతి హోమంలో భాగంగా వాస్తు హోమం, పంచగవ్య ప్రోక్షణ, గో పాలు, పెరుగు, పంచితంతో ఆరాధన చేయనున్నారు. ఈ యాగంలో ఎనిమిది మంది అర్చకులు, ముగ్గురు ఆగమ సలహాదారులు పాల్గొంటారు. ఈ విషయాన్ని టీటీడీ ఈవో జె.శ్యామలరావు వెల్లడించారు.


తిరుపతి లడ్డూ అపవిత్రం విషయమై ఆదివారం విలేకర్లతో మాట్లాడిన శ్యామలరావు.. కీలక వివరాలు వెల్లడించారు. తిరుమలలో కల్తీ నెయ్యి విషయం భక్తులను ఆందోళన కలిగించిందని అన్నారు.భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని అభిప్రాయపడ్డారు. అయితే ప్రస్తుతం ఆవు నెయ్యి తీసుకునే విధానంలో మార్పు తెచ్చామన్న టీటీడీ ఈవో.. నందిని, ఆల్ఫా సంస్థల నుంచి స్వచ్ఛమైన ఆవు నెయ్యిని కొనుగోలు చేస్తున్నామని వెల్లడించారు. కేజీ నెయ్యి రూ.475 లకు కొంటున్నామని చెప్పారు. ప్రస్తుతం లడ్డూ తయారీకి సరఫరా అవుతున్న నెయ్యిని కూడా ఎన్‌డీబీబీకి పంపామన్న శ్యామలరావు.. రిపోర్టు సైతం స్వచ్ఛమైన నెయ్యిగా నిర్ధారించిందన్నారు. ఎనేబియల్ ల్యాబ్స్‌కు నెయ్యిని ఎప్పటికప్పుడు టెస్టింగ్ కు పంపిస్తున్నామని తెలిపారు.


మరోవైపు తిరుమల లడ్డూ నాణ్యతకు సంబంధించి 18 మందితో సెన్సరీ ప్యానల్ ఏర్పాటు చేసినట్లు టీటీడీ ఈవో వెల్లడించారు. సీఎఫ్‌టీఆర్‌ఐలో వీరంతా శిక్షణ తీసుకున్నారన్న ఈవో.. టీటీడీ ద్వారా కూడా మూడు నెలల పాటు శిక్షణ ఇచ్చామన్నారు. వీరంతా లడ్డూ సువాసన, రుచి బాగుందని రేటింగ్ ఇచ్చారన్నారు.


మరోవైపు తిరుమలలో FSSAI ల్యాబ్ ఏర్పాటుకు కేంద్రం ముందుకు వచ్చిందనీ.. డిసెంబర్ నెలలో ఈ ల్యాబ్ ఏర్పాటు పూర్తవుతుందన్నారు. ఏటా నిర్వహించిన ప్రకారమే ఈ ఏడాది కూడా ఆగస్టులో పవిత్రోత్సవాలు నిర్వహించామని.. దీంతో దోషాలు తొలగిపోయాయని అన్నారు. అయితే ప్రస్తుతం భక్తుల్లో నెలకొన్న ఆందోళన నేపథ్యంలో ఆగమ సలహాదారుల నిర్ణయం మేరకు ఒక రోజు శాంతి హోమం నిర్వహిస్తున్నట్లు టీటీడీ ఈవో వెల్లడించారు. రేపు ఉదయం ఆరు నుంచి పది గంటల వరకూ శాంతి యాగం జరుగుతుందని.. మూడు హోమ గుండాలు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com