ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుమల లడ్డూ వివాదంపై సిట్ ఏర్పాటు.. చంద్రబాబు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Sep 22, 2024, 10:07 PM

తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకంపై సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఉండవల్లిలోని తన నివాసంలో విలేకర్ల సమావేశం నిర్వహించిన చంద్రబాబు నాయుడు.. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మీద విరుచుకుపడ్డారు. వైసీపీ హయాంలో శ్రీవారి ప్రసాదాన్ని అపవిత్రం చేశారన్న చంద్రబాబు.. భక్తుల మనోభావాలకు గత పాలకులు విలువ ఇవ్వలేదన్నారు. వైసీపీ రివర్స్ టెండరింగ్ విధానం ద్వారా లడ్డూ నాణ్యత దెబ్బతిందని ఆరోపించారు. ప్రసాదాన్ని అపవిత్రం చేసి కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీశారని విమర్శించారు. రాజకీయ ప్రయోజనాల కోసం టీటీడీని వాడుకున్నారన్న చంద్రబాబు.. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చివేశారని ఆరోపించారు.


ప్రపంచవ్యాప్తంగా తిరుమల అంటే ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉందన్న చంద్రబాబు నాయుడు.. తనకూ వ్యక్తిగతంగా తిరుమల శ్రీవారంటే ఎంతో నమ్మకమని చెప్పుకొచ్చారు. వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏడు కొండలను రెండు కొండలు అంటే తాను పెద్ద పోరాటం చేశానని చెప్పుకొచ్చారు. గత పాలకులు ఎవరూ తిరుమల పవిత్రత విషయంలో జోక్యం చేసుకోలేదని చంద్రబాబు అన్నారు. అయితే వైసీపీ హయాంలో తిరుమల పవిత్రతను దెబ్బతీశారన్న చంద్రబాబు.. తిరుపతి లడ్డూలో జంతువుల కొవ్వు వినియోగించారని ఆరోపించారు. వీఐపీ టికెట్లను ఇష్టానుసారం అమ్ముకున్నారని విమర్శించారు. అన్య మతస్థులను టీటీడీ ఛైర్మన్‌గా నియమించారని ఆరోపించారు. ఇక తిరుమల వెంకన్న చాలా శక్తివంతమైన దేవుడన్న చంద్రబాబు.. ఎప్పటికప్పుడు అకౌంట్ సెటిల్ చేస్తారంటూ వ్యాఖ్యానించారు.


వైసీపీ రివర్స్ టెండరింగ్ విధానాల కారణంగానే తిరుమల లడ్డూ నాణ్యత తగ్గిందన్న ముఖ్యమంత్రి.. ఈ విధానం కారణంగా ప్రధాన సంస్థలు టెండర్ ప్రక్రియలో పాల్గొనలేకపోయాయని చెప్పారు. తిరుమల లడ్డూకు జీఐ గుర్తింపు ఉన్న విషయాన్ని కూడా గుర్తుచేశారు. తిరుమల లడ్డూను కాపీ కొడదామని చాలా మంది ప్రయత్నించారన్న చంద్రబాబు.. శ్రీవారి మహత్యం కారణంగా తిరుపతి లడ్డూను ఎవరూ కాపీ కొట్టలేకపోయారన్నారు. అయితే వైసీపీ విధానాల కారణంగా తిరుమల లడ్డూ నాణ్యత తగ్గిందన్న సీఎం.. తాము అధికారంలోకి వచ్చాక తిరుమలలో ప్రక్షాళన చేస్తున్నట్లు చెప్పారు. ఈ బాధ్యతను టీటీడీ ఈవో శ్యామలరావు అప్పగించినట్లు వివరించారు. అయితే ఇంత అపచారం చేసిన వైఎస్ జగన్.. ఏ మాత్రం పశ్చాత్తాపం లేకుండా తిరిగి ఎదురుదాడి చేస్తున్నారని.. ప్రధానికి కూడా లేఖ రాశారని.. ఎంత ధైర్యముంటే ఇలా చేస్తారంటూ చంద్రబాబు విమర్శించారు.


మరోవైపు తిరుమల లడ్డూ అపవిత్రానికి కారణాలపై సిట్ ఏర్పాటు చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఐజీ స్థాయి అధికారి నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేస్తామని.. నివేదిక అందిన తర్వాత కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఆగమ శాస్త్రం తెలిసిన వారితో కమిటీ వేస్తామని తెలిపారు. గత పాలకులు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్న చంద్రబాబు.. అధికార దుర్వినియోగంపైనా సిట్ విచారణ జరుపుతుందన్నారు. అవసరమైతే ప్రత్యేక చట్టం తెస్తామని తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com