ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రోజుకు 8 గంటలు, వారానికి 5 రోజులే పని.. పార్లమెంటులో చట్టం

national |  Suryaa Desk  | Published : Sun, Sep 22, 2024, 12:07 AM

తీవ్రమైన పని ఒత్తిడి కారణంగా పూణే ఎర్నెస్ట్ అండ్ యంగ్ ఇండియా కంపెనీలో పనిచేసే 26 ఏళ్ల ఛార్టర్డ్ అకౌంటెంట్ అన్నా సెబాస్టియన్‌ మృతి చెందడం ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీసింది. ఆమె మరణానికి కారణం కంపెనీలో తీవ్రమైన పని భారమేనని ఆమె తల్లి చేసిన ఆరోపణలు ప్రస్తుతం తీవ్ర సంచలనంగా మారాయి. కంపెనీల్లో ఉద్యోగులపై ఉండే పని ఒత్తిడి గురించి తీవ్ర చర్చ జరుగుతున్న వేళ.. కేంద్ర మాజీ మంత్రి, తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ సంస్థ అయినా ప్రైవేటు సంస్థ అయినా వారానికి 5 రోజులు మాత్రమే, రోజుకు 8 గంటలు మాత్రమే పని ఉండాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. దీనిపై పార్లమెంటులో చట్టం తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తామని పేర్కొన్నారు.


అన్నా సెబాస్టియన్ మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన శశిథరూర్.. ఈ విషయం తెలుసుకుని.. ఆమె ఇంటికి వెళ్లి అన్నా సెబాస్టియన్ తండ్రి పరామర్శించారు. ఎర్నెస్ట్‌ అండ్‌ యంగ్‌ ఇండియా కంపెనీలో రోజుకు 14 గంటల పాటు తీవ్రమైన ఒత్తిడి మధ్య అన్నా సెబాస్టియన్ 4 నెలల పాటు పనిచేసి.. చివరికి ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా అన్నా సెబాస్టియన్ తండ్రి చేసిన సూచన చాలా బాగుందని శశిథరూర్ వెల్లడించారు.


రోజుకు 8 గంటలు, వారానికి 5 రోజులకు మించి ఏ ప్రభుత్వ సంస్థ అయినా, ప్రైవేటు సంస్థ అయినా తమ ఉద్యోగులతో పని చేయించకూడదని ఆయన పేర్కొన్నారని వివరించారు. అంతేకాకుండా అన్ని పని ప్రదేశాల్లో ఫిక్స్‌డ్‌ క్యాలెండర్‌ ఉండాలని.. మానవ హక్కులను హరించకూడదని చెప్పారని తెలిపారు. సదరు సంస్థలు అమానవీయ చర్యలకు పాల్పడితే కఠినమైన శిక్షలు, జరిమానాలు విధించేలా చట్టం తీసుకురావాలని అన్నా సెబాస్టియన్ తండ్రి సూచించినట్లు చెప్పారు. ఇదే విషయాన్ని వచ్చే పార్లమెంట్‌ సమావేశాల్లో లేవనెత్తుతామని శశిథరూర్‌ ట్విటర్ వేదికగా తెలిపారు.


కేరళలోని కొచ్చికి చెందిన 26 ఏళ్ల అన్నా సెబాస్టియన్.. ఈ ఏడాది జులై 20వ తేదీన మృతి చెందారు. ఎర్నెస్ట్‌ అండ్‌ యంగ్‌ ఇండియా సర్వీసెస్‌ ప్రైవేట్ లిమిటెడ్‌ పూణే బ్రాంచ్‌లో పనిచేసిన అన్నా సెబాస్టియన్‌.. ఆఫీస్‌లో ఉండగానే తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో తోటి ఉద్యోగులు ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలోనే చికిత్స పొందుతూ అన్నా సెబాస్టియన్ మృతి చెందారు. అయితే ఆఫీస్‌లో తీవ్రమైన పని ఒత్తిడే ఆమె మృతికి కారణం అంటూ కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు అన్నా సెబాస్టియన్‌ తల్లి అనితా ఇటీవల ఈవై ఇండియా అధినేతకు రాసిన లేఖతో ఈ ఘటన బయటికి వచ్చింది. ప్రస్తుతం ఈ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతుండగా.. కేంద్రం స్పందించింది. దీనిపై స్పందించిన కేంద్ర కార్మిక శాఖ విచారణ జరుపుతామని హామీ ఇచ్చింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com