ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సీఎం మీటింగ్‌లో దొంగలు.. చూస్తుండగానే చేపలన్నీ చోరీ, వీడియోలు వైరల్

national |  Suryaa Desk  | Published : Sun, Sep 22, 2024, 12:07 AM

బీహార్‌ అంటే ఠక్కున గుర్తుకొచ్చేది చిత్ర విచిత్రమైన దొంగతనాలు. రాత్రికి రాత్రే రైల్వే ట్రాక్ ఎత్తుకుపోవడం.. బ్రిడ్జిని ఎత్తుకెళ్లడం, రోడ్డును తవ్వి కంకర చోరీ చేయడం లాంటి ఎన్నో, ఎన్నెన్నో దొంగతనాలను ఇప్పటివరకు మనం చూశాం. కానీ తాజాగా అత్యంత భద్రత మధ్య ఉన్న ముఖ్యమంత్రి హాజరైన కార్యక్రమంలోనే అక్కడి జనం తమ చేతి వాటం చూపించారు. పోలీసులు, సెక్యూరిటీ ఉన్నారనే విషయాన్ని కూడా పట్టించుకోకుండా చేతికి అందినకాడికి దోచుకుని పోయారు. ఇంతకీ వారు దోచుకున్నది ఏంటో తెలుసా.. చేపలు. ముఖ్యమంత్రి సమావేశంలో ఏర్పాటు చేసిన ఓ ఎగ్జిబిషన్‌కు హాజరైన బీహార్ వాసులు.. అక్కడ ఉన్న చేపలను ఎత్తుకెళ్లడంలో బిజీ అయ్యారు. అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో అధికారులు కూడా ఏం చేయలేకపోయారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.


బీహార్‌లోని సహర్సా జిల్లాలో శుక్రవారం ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌ పర్యటించారు. ఈ సందర్భంగా పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇందులో భాగంగానే అమర్‌పూర్‌లో బీహార్ మత్స్యశాఖ అధికారులు ఏర్పాటు చేసిన ఓ ఎగ్జిబిషన్‌ను కూడా సీఎం నితీష్ కుమార్ పరిశీలించారు. ఈ ఎగ్జిబిషన్‌లో భాగంగా బయోఫ్లోక్‌ ట్యాంక్‌లో మత్స్యశాఖ అధికారులు భారీగా చేపలను ప్రదర్శనకు ఉంచారు. అయితే ఆ కార్యక్రమానికి హాజరైన స్థానికులు.. చేపలను లూటీ చేశారు. దీంతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా తీవ్ర గందరోగళ పరిస్థితులు తలెత్తాయి. జనం చేపలు ఎత్తుకెళ్తున్న దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి.


అయితే ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి నితీష్ కుమార్ హాజరై.. అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత స్థానికులు చేపలను ఎత్తుకెళ్లే పనిలో పడ్డారు. పైగా తాము సీఎంను చూడడానికి గానీ, ఈ కార్యక్రమంలో హాజరు కావాలని గానీ రాలేదని.. అక్కడ ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌లోని చేపల కోసమే ప్రత్యేకంగా వచ్చినట్లు స్థానికులు చెప్పడం గమనార్హం. అయితే స్థానికులు చేపలు ఎత్తుకెళ్తున్నా.. అక్కడే ఉన్న మత్స్యశాఖ అధికారులు గానీ, పోలీసులు గానీ ఆపే ప్రయత్నాలు చేసినా అవి స్పందించలేదు. ఇలా జనాలు చేపలు ఎత్తుకెళ్లడం వల్ల తమకు సుమారు రూ.45 వేల నష్టం వాటిల్లినట్లు సహర్సా జిల్లా మత్స్య శాఖ అధికారి సుబోధ్‌ కుమార్‌ వెల్లడించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com