ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పని ఒత్తిడితో యువతి మృతి.. అంత్యక్రియలకు కూడా హాజరు కాని ఉద్యోగులు

national |  Suryaa Desk  | Published : Fri, Sep 20, 2024, 10:41 PM

కార్పొరేట్ కంపెనీలు అంటేనే భారీగా జీతాలు ఉంటాయి. జీతాల కంటే ఎక్కువ పని కూడా ఉంటుంది. ఇచ్చిన సమయంలో పని పూర్తి చేయాలని ఒత్తిడి కూడా ఉంటుంది. ఇలా పని ఒత్తిడితో.. ఉద్యోగులు అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతుండటం మనం వింటూనే ఉంటాం. అయితే ఇచ్చిన టైంలో పని పూర్తి చేయలేక.. బాస్ నుంచి వచ్చే ఒత్తిడి తట్టుకోలేని చాలా మంది ఉద్యోగులు.. ఉద్యోగానికి రాజీనామా చేయడమో లేక రాత్రింబవళ్లు నిద్ర, ఆహారం లేకుండా పనిచేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ 26 ఏళ్ల సీఏ ఉద్యోగిని పని ఒత్తిడికి తాళలేక చనిపోవడం తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఆమె చనిపోయిన తర్వాత కనీసం చూడడానికి కూడా సదరు కంపెనీ నుంచి ఒక్క ఉద్యోగి కూడా రాకపోవడం గమనార్హం. ఈ ఘటన తీవ్ర దుమారానికి కారణం కావడంతో స్పందించిన కేంద్రం సీరియస్ అయింది.


ఎర్నెస్ట్ అండ్‌ యంగ్‌ ఇండియా పూణే బ్రాంచ్‌లో పనిచేసే కేరళకు చెందిన యువ ఛార్టర్డ్‌ అకౌంటెంట్‌ 26 ఏళ్ల అన్నా సెబాస్టియన్ పెరియాలి ఇటీవలె మృతి చెందారు. తన కుమార్తె.. ఎర్నెస్ట్ అండ్ యంగ్ ఇండియా కంపెనీలో పని ఒత్తిడి తట్టుకోలేక అనారోగ్యానికి గురై చనిపోయిందని ఆమె తల్లి అనితా అగస్టీన్ ఆరోపించారు. తన కుమార్తె చాలా రోజులు ఆఫీస్‌లోనే విపరీతంగా పని చేసేదని.. కొన్నిసార్లు నిద్ర పోయేందుకు టైం సరిపోయేది కాదని వాపోయారు. అర్ధరాత్రి వరకు, వీకెండ్స్ కూడా అన్నా సెబాస్టియన్ ఆఫీస్‌లోనే ఉండి పనిచేసేదని తెలిపారు. అదనపు భారం వేయడంతో.. పూర్తిగా అలసిపోయి ఇంటికి వచ్చి కనీసం దుస్తులు కూడా మార్చుకోకుండానే పడుకునేందని వెల్లడించారు. ఎర్నెస్ట్ అండ్‌ యంగ్‌ ఇండియా కంపెనీలో పని ఒత్తిడి కారణంగానే తన కుమార్తె చనిపోవడానికి కారణం అని అనిత తీవ్ర ఆరోపణలు చేశారు.


ఇక ఈ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఈ ఘటన సంచలనంగా మారడంతో కేంద్రం స్పందించింది. అన్నా సెబాస్టియన్‌ మరణాన్ని సీరియస్‌గా తీసుకున్న కేంద్ర కార్మిక శాఖ.. దీనిపై దర్యాప్తు చేపడుతుందని కేంద్ర సహాయమంత్రి శోభా వెల్లడించారు. దీంతో ఎట్టకేలకు ఈ వ్యవహారంపై ఎర్నెస్ట్ అండ్ యంగ్ ఇండియా కంపెనీ ఛైర్మన్ రాజీవ్ మెమానీ తోసిపుచ్చారు. అన్నా సెబాస్టియన్ మరణానికి పని ఒత్తిడే కారణం అని ఆమె తల్లి చేసిన ఆరోపణలను ఆయన కొట్టిపారేశారు. అన్నా సెబాస్టియన్ మరణానికి పని ఒత్తిడే కారణమంటే తాను నమ్మలేకపోతున్నానని పేర్కొన్నారు. అయితే తాజాగా లింక్డ్‌ఇన్‌ పోస్టులో మాత్రం తమ కంపెనీలో పనిభారంపై వస్తున్న ఆరోపణలపై రాజీవ్ మెమానీ స్పందించలేదు.


ఇక అన్నా సెబాస్టియన్‌ పెరియాలి అంత్యక్రియలకు కంపెనీ నుంచి ఉద్యోగులు ఎవరూ హాజరు కాకపోవడం విచారకరమని రాజీవ్‌ మెమానీ పేర్కొన్నారు. అయితే ఇది తమ పని సంస్కృతి కాదని ఆయన లింక్డ్ ఇన్‌లో ఒక పోస్టు పెట్టారు. సెబాస్టియన్ కుటుంబ సభ్యులతో మాట్లాడి ఆమె మృతికి సంతాపం తెలిపినట్లు చెప్పారు. ఆమె అంత్యక్రియల సమయంలో తమ కంపెనీ తరఫున ఎవరూ హాజరుకాకపోవడంపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. ఇలాంటి ఘటన గతంలో ఎన్నడూ ఇలా జరగలేదని.. భవిష్యత్తులో కూడా ఇలా జరగదని పేర్కొన్నారు.


అయితే రాజీవ్ మెమానీ చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు సోషల్‌ మీడియాలో తీవ్రంగా మండిపడుతున్నారు. ఎర్నెస్ట్ అండ్ యంగ్ ఇండియా కంపెనీలో పని ఒత్తిడి తీవ్రంగా ఉంటుందని పేర్కొంటూ అన్నా సెబాస్టియన్‌కు సంతాపం తెలిపారు. ఇక నెటిజన్లు మాత్రమే కాకుండా చాలా మంది ఇప్పుడు ఆ కంపెనీలో పనిచేస్తున్న వారు.. గతంలో పనిచేసి రాజీనామా చేసిన వారు కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆ కంపెనీ ఉద్యోగులపై తీవ్ర పనిభారం ఉంటుందని పేర్కొంటున్నారు. తాను ఆ సంస్థలో పనిచేసినపుడు రోజుకు 17-18 గంటలు పని చేయించారని.. దీనిపై హెచ్‌ఆర్‌ డిపార్ట్‌మెంట్‌కు ఫిర్యాదు చేస్తే.. క్లైయింట్ల డిమాండ్‌ కారణంగానే అలా పనిచేయించి ఉండవచ్చని సర్ది చెప్పినట్లు.. ఆ కంపెనీ మాజీ ఉద్యోగి ఒకరు తెలిపారు.


ఇలాంటి పరిస్థితిని టీమ్ మీటింగ్స్‌లలో లేవనెత్తితే తోటి ఉద్యోగులే హేళన చేసేవారని సదరు ఉద్యోగి వెల్లడించారు. తాను ఆఫ్రికాలో ఆన్‌సైట్‌లో పనిచేసే సమయంలో ఉదయం 9 నుంచి రాత్రి 7 గంటల వరకు పని చేయించేవారని.. వీకెండ్స్‌ కూడా వీకాఫ్ లేకుండా 2 నెలలు పనిచేసినట్లు తెలిపారు. పండగల వేళ మీటింగ్‌ షెడ్యూల్స్‌ వేసేవారని.. కరోనా మహమ్మారి సమయంలో కూడా ఉదయం 8.30 గంటలకే నాకు కాల్స్‌ వచ్చేవని.. అవి కొన్నిసార్లు అర్ధరాత్రి వరకు జరిగేవని గుర్తు చేసుకున్నారు. ఇలాంటి పని ఒత్తిడి తట్టుకోలేక.. మరో ఉద్యోగం చూసుకోకుండానే ఆ కంపెనీ నుంచి బయటికి వచ్చినట్లు పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com