ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శ్రీవారి ప్రసాదంగా లడ్డూకు వందల ఏళ్ల చరిత్ర

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Sep 20, 2024, 07:17 PM

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడు కొలువైన తిరుమలను నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటూ ఉంటారు. శ్రీవారి ముగ్ధ మనోహర రూపాన్ని చూసి తరిస్తూ ఉంటారు. దర్శనం అనంతరం శ్రీవారి ప్రసాదాన్ని స్వీకరించి.. ఆ దేవదేవుణ్ని మరోసారి దర్శించుకున్నంత అనుభూతికి లోనవుతూ ఉంటారు. తిరుమల శ్రీవారి లడ్డూకు భక్తులు అంత ప్రాధాన్యం ఇస్తారు. ఇంట్లో శ్రీవారి లడ్డూ ఉంటే ఎంతో పుణ్యమని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. తిరుమల లడ్డూకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల మనసులో అంతటి ప్రత్యేక స్థానం ఉంది. అంతటి పవిత్రమైన తిరుమల శ్రీవారి లడ్డూపై గత కొన్ని రోజులుగా వివిధ అంశాలు తెరపైకి వస్తున్నాయి.


తిరుపతి లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు వాడారంటూ సాక్షాత్తూ సీఎం చంద్రబాబు నాయుడు ఆరోపణలు చేయడం దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఈ క్రమంలోనే తిరుమలలో లడ్డూను ఎప్పటి నుంచి తయారు చేస్తున్నారు.. శ్రీవారి భక్తులకు ఎప్పటి నుంచి ప్రసాదంగా అందిస్తున్నారనే విషయాలను ఓసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.


తిరుపతి లడ్డూకు 300 ఏళ్ల చరిత్ర


తిరుమల శ్రీవారి ప్రసాదంగా లడ్డూ పంపిణీ సుమారుగా 300 ఏళ్ల కిందటే ప్రారంభమైంది. 1715 ఆగస్టు 2న తొలిసారిగా లడ్డూను తిరుమల ప్రసాదంగా భక్తులకు అందించారని తెలుస్తోంది. 2010 వరకూ రోజుకు లక్ష వరకూ లడ్డూలను తయారు చేసేవారు. ఆ తర్వాత భక్తుల రద్దీ పెరిగింది. పెరిగిన రద్దీకి అనుగుణంగా ప్రస్తుతం రోజుకు 3.20 లక్షల లడ్డూలు తయారుచేస్తున్నారు. ఇక తిరుమల శ్రీవారి లడ్డూకు 2014లో జీఐ గుర్తింపు కూడా లభించడం విశేషం. తిరుమల శ్రీవారి లడ్డూకు పేటెంట్, ట్రేడ్ మార్క్ కూడా ఉంది.


లడ్డూ కంటే ముందు తిరుమలలో బూందీ ప్రసాదం


లడ్డూ కంటే ముందు శ్రీవారి ప్రసాదంగా బూందీని అందించేవారని తెలుస్తోంది. క్రీ. శ 1803లో బూందీగా ప్రారంభమైన తిరుమల ప్రసాదం.. కాలక్రమంలో 1940 నాటికి లడ్డూగా మారినట్లు మరికొంత మంది పండితులు చెప్తున్నారు. దీంతో 1940ని ప్రామాణికంగా తీసుకుంటే లడ్డూ వయసు వందేళ్లలోపే అవుతుంది. ఇక పల్లవుల కాలం నుంచే ప్రసాదాలు పంపిణీ చేసినట్లు చారిత్రక ఆధారాలు చెప్తున్నాయి. అయితే విజయనగర సామ్రాజ్యంలోని రెండో దేవరాయలు కాలం నుంచి ప్రసాదాల సంఖ్య పెంచినట్లు చరిత్రకారులు చెప్తున్నారు.


గూగుల్ ట్రెండ్స్‌లో తిరుపతి లడ్డూ


తిరుపతి లడ్డూ తయారీ కోసం ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వులు కల్తీ అయ్యాయనే వార్తల నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించిన వార్తల కోసం ఎక్కువ మంది సెర్చ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తిరుపతి లడ్డూ గూగుల్ ట్రెండ్స్‌లో నిలిచింది. తిరుపతి లడ్డూ నాణ్యత, నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డు కాప్ ల్యాబ్ టెస్టు రిపోర్టుకు సంబంధించిన వార్తల కోసం ఎక్కువ మంది సెర్చ్ చేస్తున్నారు. కర్ణాటక, పుదుచ్చేరి, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో తిరుపతి లడ్డూ వార్తల కోసం ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com