ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వందే భారత్ స్లీపర్ రైలు వచ్చేస్తోంది

national |  Suryaa Desk  | Published : Sun, Aug 25, 2024, 08:05 PM

2019 లో అందుబాటులోకి వచ్చిన వందే భారత్ రైలు.. భారతీయ రైల్వేల చరిత్రలో సంచలనంగా మారింది. అత్యాధునిక సదుపాయాలతోపాటు వేగవంతమైన ప్రయాణంతో రైల్వే ప్రయాణికులకు బాగా దగ్గరైంది. ఇదే సమయంలో సాధారణ రైళ్లతో పోల్చితే ఈ వందే భారత్ రైళ్లలో ఛార్జీలు ఎక్కువే అయినప్పటికీ.. ప్రయాణికులు ఎగబడుతున్నారు. అయితే ఇందులో ఇప్పటివరకు కేవలం కూర్చొని మాత్రమే ప్రయాణం చేసే వీలు ఉండగా.. స్లీపర్ రైలు కోసం రైల్వే ప్రయాణికులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. ఈ ఎదురుచూపులకు త్వరలోనే శుభం కార్డు పడనుంది. ఎందుకంటే ప్రస్తుతం వందే భారత్ స్లీపర్ రైలు తయారీ జరుగుతోందని.. ఈ ఏడాది డిసెంబర్ నాటికి పట్టాలపై వందే భారత్ స్లీపర్ రైలు పరుగులు పెడుతుందని రైల్వే శాఖ వర్గాలు తాజాగా వెల్లడించాయి.


మొదటి వందే భారత్ స్లీపర్ రైలును ఈ ఏడాది చివరి నాటికి అందుబాటులోకి తీసుకువచ్చేందుకు రైల్వే శాఖ అన్ని చర్యలు చేపట్టింది. ఇప్పటివరకు వందే భారత్, వందే భారత్ మెట్రో రైళ్లు సేవలు అందిస్తుండగా.. ఈ సిరీస్‌లో వందే భారత్ స్లీపర్ రైలు మూడో ఎడిషన్. అయితే ఈ మొదటి వందే భారత్ స్లీపర్ రైలును గుజరాత్‌లో నడపాలని రైల్వే అధికారులు భావిస్తున్నారు. అయితే దీనిపై అధికారికంగా ఇంకా స్పష్టత రాలేదు. ఈ వందే భారత్ స్లీపర్ రైలును 2 నెలల పాటు పరీక్షించనున్నట్లు రైల్వే శాఖ వర్గాలు వెల్లడించాయి. ఇక ఈ వందే భారత్ తొలి స్లీపర్ రైలు బెంగళూరులోని భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ -బీఇఎంఎల్ ప్లాంట్ నుంచి సెప్టెంబర్ 20వ తేదీ నాటి కల్లా బయలుదేరుతుందని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ -ఐపీఎఫ్ చెన్నై జనరల్ మేనేజర్ యూ. సుబ్బారావు తాజాగా మీడియాకు వెల్లడించారు.


దాని తర్వాత వందే భారత్ స్లీపర్ రైలు ట్రయల్ రన్ జరగనుందని చెప్పారు. వాయువ్య రైల్వే జోన్‌లో హైస్పీడ్ రైలు ట్రయల్‌ను నిర్వహించనున్నట్లు తెలిపారు. 2023 మేలో చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ.. 16 కోచ్‌ల వందే భారత్ స్లీపర్ రైలు 10 సెట్‌ల రేక్‌ల రూపకల్పన, తయారీకి భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్‌కు ఆర్డర్ ఇచ్చిందని సుబ్బారావు వెల్లడించారు. ఈ వందే భారత్ స్లీపర్ రైలు గరిష్టంగా గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుందని చెప్పారు. ఇది యూరోపియన్ ప్రమాణాలకు అనుగుణంగా ఉంటుందని.. డిసెంబర్ 2024 నాటికి అన్ని టెస్టింగ్, ట్రయల్ రన్‌ల తర్వాత అందుబాటులోకి వస్తుందని సుబ్బారావు వివరించారు.


ఈ వందే భారత్ స్లీపర్‌ రైలులో స్టెయిన్‌లెస్ స్టీల్ కార్ బాడీ.. ప్రయాణీకులకు మెరుగైన రక్షణ సదుపాయాలు.. జీఎఫ్‌ఆర్‌పీ ఇంటీరియర్ ప్యానెల్‌లు.. ఏరోడైనమిక్ డిజైన్.. మాడ్యులర్ ప్యాంట్రీ.. ఫైర్ సేఫ్టీ కంప్లైయెన్స్.. డిసేబుల్డ్ ప్యాసింజర్‌ల సౌకర్యాలు.. ఆటోమేటిక్ డోర్లు.. సెన్సార్ ఆధారిత ఇంటర్‌కమ్యూనికేషన్.. ఫైర్ బారియర్ డోర్లు ఉన్నాయి. యూఎస్‌బీ ఛార్జింగ్‌తో కూడిన ఎర్గోనామిక్ టాయిలెట్ సిస్టమ్.. ఇంటిగ్రేటెడ్ రీడింగ్ లైట్ కూడా ఈ వందే భారత్ స్లీపర్ రైలు ప్రత్యేకతలు.


ఈ వందే భారత్ స్లీపర్ రైలులో.. భారతీయ రైల్వే తన ప్రయాణీకులకు యూరప్‌లోని నైట్‌జెట్ స్లీపర్ రైళ్ల మాదిరిగానే రాత్రి ప్రయాణాల్లో ప్రపంచ స్థాయి ప్రయాణ అనుభూతిని అందించాలని యోచిస్తోంది. రాత్రిపూట లైట్లు ఆపినప్పుడు వాష్‌రూమ్‌కు ప్రయాణికులను మార్గనిర్దేశం చేసేందుకు మెట్ల దిగువన ఎల్ఈడీ స్ట్రిప్స్ ఉంటాయి. అంతే కాకుండా రైలు సహాయకులకు ప్రత్యేక బెర్త్‌లు కూడా ఉంటాయి. 16 కోచ్‌లు కలిగిన ఈ వందే భారత్ స్లీపర్ రైలులో మొత్తం 823 బెర్త్‌లు ఉంటాయి. ఇందులో పదకొండు 3AC కోచ్‌లు (611 బెర్త్‌లు).. నాలుగు 2AC కోచ్‌లు (188 బెర్త్‌లు).. ఒక 1ఏసీ కోచ్ (24 బెర్త్‌లు) ఉంటాయి. పోలాండ్‌కు చెందిన యూరోపియన్ రైలు కన్సల్టెంట్, EC ఇంజనీరింగ్ నుంచి డిజైన్ ఇన్‌పుట్‌లతో ఈ రైలును బీఈఎంఎల్.. హైదరాబాద్‌కు చెందిన మేధా సర్వో డ్రైవ్స్ లిమిటెడ్ తయారు చేస్తున్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com