ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇస్లామాబాద్‌కు రావాలని మోదీకి పాక్‌ ఆహ్వానం

national |  Suryaa Desk  | Published : Sun, Aug 25, 2024, 08:04 PM

భారత్ పాకిస్తాన్ మధ్య ప్రస్తుతం.. తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొంది. గత కొన్నేళ్ల నుంచి రెండు దేశాలు.. ఒకరిపై ఒకరు అంతర్జాతీయ వేదికలపై మాటల యుద్ధాలు చేసుకుంటూనే ఉన్నాయి. పాకిస్తాన్ చేసిన నిరాధార ఆరోపణలను ఎప్పటికప్పుడు అంతర్జాతీయ వేదికలపై భారత ప్రతినిధులు ఖండిస్తూ గట్టిగా కౌంటర్ ఇస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా పాకిస్తాన్.. భారత ప్రధాని నరేంద్ర మోదీని.. తమ దేశానికి ఆహ్వానించడం గమనార్హం. ఈ ఏడాది షాంఘై సహకార సంస్థకు సంబంధించి కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ - సీహెచ్‌జీ సమావేశానికి పాకిస్తాన్ ఆతిథ్యం ఇస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ సమావేశానికి హాజరు కావాలని ప్రధాని మోదీకి పాక్ విజ్ఞప్తి చేసింది.


ఈ ఏడాది అక్టోబర్‌లో ఇస్లామాబాద్‌ వేదికగా ఈ కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి నరేంద్ర మోదీతో పాటు ఇతర దేశాల నేతలను పాక్ ఆహ్వానించింది. అయితే ఈ సదస్సు గత ఏడాది ఉజ్బెకిస్థాన్‌లోని సమర్కండ్‌ నగరంలో నిర్వహించారు. ఈ సదస్సుకు ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ సహా అగ్రదేశాల అధినేతలు అందరూ హాజరయ్యారు. అయితే పాక్‌తో సమస్యాత్మక సంబంధాల నేపథ్యంలో ఇస్లామాబాద్ వెళ్లడానికి నరేంద్ర మోదీ సిద్ధంగా లేరని సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది.


అయితే ప్రధాని మోదీ పాకిస్తాన్‌కు వెళ్లకుండా గతంలో లాగే భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌ను అక్కడికి పంపించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇటీవల జమ్మూ కాశ్మీర్‌లో జరుగుతున్న వరుస ఉగ్రదాడుల నేపథ్యంలో మన విదేశాంగ మంత్రికి పాకిస్తాన్‌లో భద్రత కల్పించడంపైనా నిఘా వర్గాలు తీవ్ర అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో జై శంకర్ అయినా పర్యటిస్తారా అనేది అనుమానంగా ఉంది. గతేడాది బిష్కెక్‌లో జరిగిన సీహెచ్‌జీ సమావేశంలో జైశంకర్‌ పాల్గొన్నారు. పాకిస్తాన్‌లో చివరిసారిగా 2015లో అప్పటి భారత విదేశాంగమంత్రి సుష్మా స్వరాజ్‌ పర్యటించారు.


 రష్యా, చైనా నేతృత్వంలోని ఈ కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్‌లో భారత్‌, పాకిస్తాన్ సభ్య దేశాలుగా ఉన్నాయి. ఇది ప్రాంతీయ భద్రత, మధ్య ఆసియా దేశాలతో సహకారం వంటి అంశాలను నిరంతరం పర్యవేక్షిస్తూ ఉంటుంది. ప్రస్తుతం సీహెచ్‌జీకి అధ్యక్షత వహిస్తున్న పాక్‌.. అక్టోబర్‌ 15, 16వ తేదీల్లో దేశాధినేతల శిఖరాగ్ర సదస్సును ఏర్పాటు చేయనుంది. ఈ సమావేశంలో నాయకులు స్వయంగా పాకిస్తాన్ వెళ్లి పాల్గొనలేని పరిస్థితులు ఉంటే వర్చువల్‌ విధానంలో హాజరు కావచ్చా లేదా అనే విషయాన్ని ఇప్పటివరకు పాక్ వెల్లడించలేదు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com