ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వేడి వేడి పప్పును భార్య ముఖంపై పోసిన భర్త

national |  Suryaa Desk  | Published : Sat, Aug 24, 2024, 09:40 PM

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రిని తన భార్య పదేపదే పొగడ్తలో ముంచెత్తడాన్ని తట్టుకోలేకపోయిన ఓ భర్త.. ఆగ్రహంతో ఊగిపోయాడు. ఆమెపై పొయ్యిమీద ఉడుకుతోన్న వేడి పప్పును పోసి క్రూరంగా ప్రవర్తించాడు. అనంతరం ఆమెకు మూడుసార్లు తలాక్ చెప్పి విడాకులు ఇచ్చాడు. విస్తుగొలిపే ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లోని బహ్రెయిచ్‌లో చోటుచేసుకుంది. బరూచ్‌ ఎస్పీ వృందా శుక్లా తెలిపిన వివరాల ప్రకారం.. బాధితురాలు మరియమ్ షరీషాకు అయోధ్యకు చెందిన అర్షద్‌తో గతేడాది డిసెంబరులో వివాహమైందని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం యోగి ఆదిత్యనాథ్‌ని ఆమె పదేపదే పొగుడుతూ ఉండటంతో అర్షద్‌కు నచ్చలేదు. అయోధ్య కోసం ఈ ఇద్దరూ ఎంతో శ్రమించారని మరియమ్ అన్నందుకు అతడికి చిర్రెత్తుకొచ్చింది.


దీంతో ఆమెను చిత్రహింసలకు గురిచేసి.. తలాక్ చెప్పాడని అన్నారు. భర్తతో పాటు అత్త కూడా ఆమె దాడి చేసి, తీవ్రంగా కొట్టారని ఫిర్యాదు చేసిందని చెప్పారు.. తనకు ఉరి వేసి చంపేందుకూ ప్రయత్నించారని బాధితులు పోలీసులకు చెప్పింది. భర్త, అత్తతో పాటు వారి ఇతర కుటుంబసభ్యులు తనను వేధించినట్టు ఆరోపించింది.


‘2023 డిసెంబరులో మాకు వివాహం జరిగింది... ఈ మధ్యే నేను కాస్త బయటకు వెళ్తున్నాను.. అయోధ్యలో వేసిన రహదారులు చూసి నాకు చాలా ఆశ్చర్యం వేసింది. చాలా అందంగా తీర్చి దిద్దారు.. అక్కడ అభివృద్ధి చాలా జరిగింది. ఆ వాతావరణం నాకెంతో నచ్చింది.. దీంతో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌, ప్రధాని నరేంద్ర మోదీలని పొగిడాను.. అప్పటి నుంచి నా భర్త తీరు మారిపోయింది.. మోదీ, యోగిలను పొగడటం అత్తింటివాళ్లకు నచ్చలేదు.. వెంటనే నన్ను పుట్టింటింకి పంపించేశాడు.. వేడి వేడి పప్పు నాపై విసిరేశాడు.. జులైలో ఈ ఘటన చోటుచేసుకోగా ఓ పెద్దావిడ జోక్యం చేసుకుని నచ్చజెప్పడంతో మళ్లీ కాపురానికి వచ్చాను.. అయినా నాకు విడాకులు ఇచ్చాడు’ అని బాధితురాలు వాపోయింది.


పెద్దలు వచ్చి చెప్పినా భర్త వినిపించుకోలేదని తెలిపింది. ఆగస్టు 5న యోగి ఆదిత్యనాథ్, మోదీని నోటికొచ్చినట్టు మాట్లాడుతూ మూడుసార్లు తలాక్ చెప్పి విడాకులు ఇచ్చాడని తెలిపింది. అదే రోజు రాత్రి తనను దారుణంగా కొట్టాడని ఆమె ఆరోపించింది. భర్త, అత్తతో పాటు ఆయన సోదరులు తనను కొట్టారని కన్నీటిపర్యంతమైంది. అంతేకాదు, గొంతునులిమి చంపే ప్రయత్నం చేశారని ఆవేదన వ్యక్తం చేసింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. పోలీసులు తన ఫిర్యాదును తొలుత తీసుకోడానికి నిరాకరించడంతో సీఎం యోగికి ఆగస్టు 18న గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com