ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమ్మాయి పిలిచిందని పబ్‌కు వెళ్లాడు.. ఆ తర్వాత జేబు ఖాళీ

national |  Suryaa Desk  | Published : Sat, Aug 24, 2024, 09:39 PM

డేటింగ్‌ యాప్‌ మోసాలు పెరిగిపోతున్నా కొందరు మాత్రం కళ్లు తెరవడం లేదు. మరీ ముఖ్యంగా అబ్బాయిలు.. ఈ డేటింగ్ మోసాల బారిన పడి జేబులు గుల్ల చేసుకుంటున్నారు. అందమైన మహిళలను ఎరగా వేసి.. అబ్బాయిలను బోల్తా కొట్టించి కొందరు కొత్త రకం మోసాలకు తెర తీస్తున్నారు. ఇలాగే ఆన్‌లైన్‌లో అందమైన యువతిని చూసి ఫ్లాట్ అయిన ఓ యువకుడు.. ఆమె రమ్మని చెప్పగానే ఓ పబ్‌కు వెళ్లాడు. ఆ తర్వాత ఏకంగా రూ.61 వేల బిల్లు వేశారు. దీంతో చేసేదేమీ లేక ఆ బిల్లు కట్టి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన మహారాష్ట్ర రాజధాని ముంబై నగరంలో చోటు చేసుకుంది. అయితే ఆ అమ్మాయితో ఆ పబ్ యాజమాన్యం.. చాలా మందిని అలాగే ట్రాప్ చేసి.. ఇలాగే వేలకు వేలు కొట్టేసినట్లు విచారణలో తేలింది.


ముంబైలోని అంధేరీ వెస్ట్‌లో ఉన్న గాడ్‌ఫాదర్ క్లబ్ డేటింగ్ యాప్ పేరుతో అందమైన యువతులను వలవేసి యువకులను మోసం చేస్తున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయి. డేటింగ్ యాప్‌లో యువకులను ఆకర్షించి.. అమ్మాయిల ద్వారా వారిని క్లబ్‌కు తీసుకువచ్చి.. వారి జేబులు ఖాళీ చేస్తున్నారని పోలీసులు గుర్తించారు. జర్నలిస్ట్, సామాజిక కార్యకర్త అయిన దీపికా నారాయణ్ భరద్వాజ్ శుక్రవారం సోషల్ మీడియా ద్వారా ఈ డేటింగ్ యాప్ స్కామ్‌ను ఆధారాలతో సహా వెలుగులోకి తీసుకొచ్చారు. రకరకాల డేటింగ్ యాప్‌ల ద్వారా అందమైన అమ్మాయిలను.. ఎరగా వేసి.. వారితో యువకులకు వలవేస్తారు.


ఇక ఆ యువతులు.. ఆ హోటల్‌కు వెళ్దాం, ఈ పబ్‌కు వెళ్దాం అంటూ తీసుకెళ్తారు. ముందుగా వారికి నచ్చిన ఆహార పదార్థాలు, మద్యం, హుక్కా ఇలా అన్నీ ఖరీదైనవే ఆర్డర్ చేస్తారు. అన్ని ఆర్డర్‌లు టేబుల్‌పైకి వచ్చిన తర్వాత ఇప్పుడే వస్తానని చెప్పి.. ఆ యువతులు మధ్యలో జారుకుంటారు. దీంతో వాటన్నింటికీ బిల్లు అతడే కట్టాల్సి ఉంటుంది. అయితే ఆ బిల్లు సాధారణ ధరలతో కాకుండా భారీగా ఉంటాయి. అది చూసి యువకులు షాక్ అవుతున్నారు. డబ్బులు కట్టకపోతే బౌన్సర్లతో బెదిరింపులు, దాడులు చేయిస్తున్నారు. దీంతో భయం, అవమానంతో బయటికి చెప్పుకోలేక.. ఉన్న డబ్బులు మొత్తం వారికే ఇచ్చేసి కొందరు యువకులు బయటపడుతూ ఉంటారు.


నదిలో పడిన బస్సు ఘోర ప్రమాదం


ఇలా ముంబైలో జరిగిన ఇలాంటి ఘటనల్లో పలువురు బాధితులు రూ. 23,000 నుంచి ఏకంగా రూ.61, 743 వరకు బిల్లులు కట్టి బయటపడ్డారు. వీటికి సంబంధించిన బిల్లులతో జర్నలిస్ట్ దీపికా నారాయణ్ భరద్వాజ్.. సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. నిత్యం కొందరు అమ్మాయిలను ఎరగా వేసి.. అబ్బాయిలను మోసం చేస్తున్నట్లు గుర్తించారు. ఈ స్కామ్‌లో యువతులకు 20 శాతం నుంచి 30 శాతం వరకు నుంచి కమీషన్ తీసుకుంటున్నారని తెలుస్తోంది.


కేవలం ఈ గాడ్‌ఫాదర్ క్లబ్ మాత్రమే కాకుండా ముంబైలో పలు క్లబ్‌లు ఇలాంటి మోసాలకే పాల్పడుతున్నారని సమాచారం. ఈ బిల్లులు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆ క్లబ్‌పై పోలీసులు విచారణ చేపట్టారు. ఇక ఇలాంటి ఘటనలు ముంబైలోనే కాకుండా దేశంలోని ప్రధాన నగరాలైన ఢిల్లీ, గురుగ్రామ్, బెంగళూరు, హైదరాబాద్‌లలో నమోదయ్యాయి. ఈ ఏడాది జూన్‌లో ఢిల్లీలో రూ. 1.2 లక్షల బిల్లులను చెల్లించి ఓ సివిల్‌ సర్వీస్‌ అభ్యర్థి కూడా మోసపోయిన విషయం తెలిసిందే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com