ఏపీలో స్కూల్ విద్యార్థులు, తల్లిదండ్రులకు మంత్రి నారా లోకేష్ గుడ్న్యూస్ చెప్పారు. నవంబర్లో విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మెగా సమావేశాన్ని నిర్వహించాలని ఆదేశించారు. మంత్రి అధికారులతో సమీక్ష చేశారు.. వారికి పలు కీలక సూచనలు చేశారు. అంతేకాదు సైన్స్ ఫేర్, క్రీడా పోటీలను అక్టోబరు, నవంబరు, డిసెంబరు నెలల్లో నిర్వహించాలని.. విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యాలు పెంపొందించేందుకు అవసరమైన కిట్లు అందించాలని అధికారులకు కీలక సూచనలు చేశారు. పాఠశాలల్లో ఏ స్థాయిలో ప్రశ్నపత్రాలు లీకైనా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ప్రభుత్వ బడుల్లో ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియ కొనసాగుతోందన్నారు మంత్రి. స్కూళ్లలో ఆయాలు, రాత్రి వాచ్మెన్లకు పెండింగ్లో ఉన్న జీతాలు చెల్లించడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే అనకాపల్లి అనాథ ఆశ్రమంలో కలుషిత ఆహారం తిని ముగ్గురు విద్యార్థులు మృతిచెందిన ఘటనను గుర్తు చేసిన మంత్రి.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నిరంతరం తనిఖీలు చేపట్టాలన్నారు.
మరోవైపు యువతకు ఉపాధి కల్పించేందుకే నైపుణ్య గణన నిర్వహిస్తున్నట్లు మంత్రి చెప్పారు. పరిశ్రమల యజమానులు, జాబ్ పోర్టల్స్ నిర్వాహకులతో మాట్లాడి మెరుగైన నైపుణ్య గణనకు సలహాలు తీసుకోవాలని అధికారులకుసూచించారు. ఈ నైపుణ్య గణన పూర్తి చేసిన తర్వాత యువతకు నైపుణ్యాలు అందించేందుకు చర్యలు తీసుకోవాలి అన్నారు. ప్రధానంగా సర్వే ద్వారా వివరాలతో యువత విద్యార్హతలు, ఉపాధి, నైపుణ్యాలను క్రోడికరించి ప్రభుత్వమే ఒక ప్రత్యేక రెస్యూమ్ తయారుచేస్తుందని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో నైపుణ్యం కలిగిన యువత సమాచారాన్ని ప్రముఖ కంపెనీలకు అందుబాటులో ఉండేలా చూస్తామన్నారు. అప్పుడు ఆయా కంపెనీలకు అవసరమైన నైపుణ్యమున్న యువతను నేరుగా ఎంపిక చేసుకునే విధానం అందుబాటులోకి వస్తుంది అన్నారు.
ముందుగా మంగళగిరి నియోజకవర్గంలో ప్రయోగాత్మకంగా నైపుణ్య గణన చేపట్టాలని మంత్రి అధికారులకు సూచించారు. స్కిల్ సెన్సెస్ సర్వేతో యువతకు ఉద్యోగాల కల్పిస్తామని.. రాష్ట్రంలో ఉన్న పరిశ్రమల పెద్దలు, జాబ్ పోర్టల్స్ నిర్వాహకులతో మాట్లాడి మెరుగైన నైపుణ్య గణనకు సలహాలు తీసుకోవాలని మంత్రి అధికారులకు సూచనలు చేశారు. ప్రధానంగా రాష్ట్రంలో పరిశ్రమలకు అవసరమైన నైపుణ్య శిక్షణ, యువతకు ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా నైపుణ్య గణన చేస్తామన్నారు. ఆయా పరిశ్రమలకు కావాల్సిన నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు.