ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మలేషియాలో కుప్పం మహిళ గల్లంతు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Aug 24, 2024, 07:48 PM

మలేషియా రాజధాని కౌలాలంపూర్‌లో జరిగిన ఓ ప్రమాద ఘటనలో.. ఏపీ మహిళ గల్లంతైంది. ఫుట్‌పాత్ మీద నడుస్తున్న సమయంలో ఒక్కసారిగా ఫుట్‍పాత్ కుంగిపోయింది. దీంతో ఆ మహిళ డ్రైనేజీలో పడి గల్లంతైంది. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం అనిమిగానిపల్లెకు చెందిన 45 ఏళ్ల విజయలక్ష్మి కౌలాలంపూర్‌లో భర్త, కొడుకుతో కలిసి పూసల వ్యాపారం నిర్వహిస్తున్నారు. అయితే శుక్రవారం ఉదయం డాంగ్ వాంగీ ఏరియాలో ఫుట్‌పాత్ మీద నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో.. ఊహించని విధంగా ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా ఫుట్‌పాత్ కుంగిపోవటంతో .. విజయలక్ష్మి పది అడుగుల లోతున్న మ్యాన్‌హోల్‌లోకి పడిపోయి గల్లంతయ్యారు. అయితే చుట్టుపక్కల వారు గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ప్రస్తుతం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.


మరోవైపు ఈ ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆరా తీశారు. గాలింపు చర్యలు సరిగ్గా జరిగేలా చూడాలని ఏపీఎన్ఆర్టీ అధికారులను చంద్రబాబు ఆదేశించారు. అలాగే స్థానిక టీడీపీ నేతలకు కూడా విజయలక్ష్మి కుటుంబసభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పాలని సూచించారు. ఈ ఘటనపై ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌తో ఫోన్‌లో మాట్లాడిన చంద్రబాబు.. మహిళ కుటుంబానికి అండగా ఉండాలని సూచించారు. మరోవైపు సీఎం చంద్రబాబు నాయుడు సూచనలతో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, మునిరత్నం విజయలక్ష్మి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారికి అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. ఏపీఎన్‌ఆర్టీ అధికారుల సాయంతో గాలింపు చర్యలను పర్యవేక్షిస్తున్నారు.


మరోవైపు విజయలక్ష్మి ప్రమాదవశాత్తూ మ్యాన్‌హోల్‌లో పడటం స్థానికంగా ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది. ప్రస్తుతం ఈ వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోను చూసిన నెటిజనం ప్రమాదం ఎప్పుడు ఎటువైపు నుంచి ముంచుకువస్తుందో తెలియదని అభిప్రాయపడుతున్నారు. ఉపాధి కోసం విదేశాలకు వెళ్తే అనుకోని రీతిలో ప్రమాదం ముంచుకువచ్చిందని కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు ప్రమాద సమయంలో పక్కనే ఉన్న మరో వ్యక్తి కూడా మ్యాన్ హోల్‌లో పడాల్సింది. అయితే వెంటనే అప్రమత్తమైన అతను చేయి ఆపుకోవటంతో బతికిపోయాడు. విజయలక్ష్మి మాత్రం మ్యాన్‌హోల్‌లో గల్లంతయ్యారు. అయితే డ్రైనేజీ కాల్వలో ప్రవాహం అధికంగా ఉండటంతో విజయలక్ష్మి కొట్టుకుపోయారని.. గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు కౌలాలంపూర్ ఫైర్ అండ్ రెస్క్యూ అధికారులు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com