ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డైమండ్‌ లీగ్‌లో.. రెండో స్థానానికి పరిమితమైన బల్లెం వీరుడు నీరజ్‌

sports |  Suryaa Desk  | Published : Fri, Aug 23, 2024, 10:03 PM

పారిస్ 2024 ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన భారత జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా.. లుసానె డైమండ్‌ లీగ్‌లోనూ రెండో స్థానంలో నిలిచాడు. మునుపటి బెస్ట్‌తో 89.45ను అధిగమించాడు. ఈసారి 89.49 మీటర్లు బల్లెం విసిరాడు. అయితే తన కెరీర్ బెస్ట్ త్రోను నమోదు చేసినా నీరజ్ చోప్రాకు మాత్రం నిరాశే ఎదురైంది. గ్రెనెడా క్రీడాకారుడు అండర్సన్ పీటర్స్ 90.61 మీటర్ల త్రోతో.. లుసానె డైమండ్‌ లీగ్‌లో ఛాంపియన్‌గా నిలిచాడు. పారిస్ 2024 ఒలింపిక్స్ తర్వాత నీరజ్ చోప్రా బరిలోకి దిగిన తొలి పోటీలు ఇవే కావడం గమనార్హం.


కాగా లుసానె డైమండ్‌ లీగ్‌‌లో తొలి నాలుగు ప్రయత్నాల్లో నీరజ్ చోప్రా.. ఆశించిన మేర ప్రదర్శన చేయలేకపోయాడు. తొలి ప్రయత్నంలో 82.10 మీటర్లు బల్లెం విసిరిన 26 ఏళ్ల నీరజ్ చోప్రా.. ఆ తర్వాత వరుసగా 83.21 మీటర్లు, 83.13 మీటర్లు, 82.34 మీటర్ల చొప్పున త్రో విసిరాడు. దీంతో నాలుగో రౌండ్ పూర్తయ్యే సరికి నీరజ్ చోప్రా.. నాలుగో స్థానంలోనే నిలిచాడు. కానీ ఐదో ప్రయత్నంలో 85.58 మీటర్ల దూరం త్రో విసిరి పోటీలోకి వచ్చాడు. ఇక ఆరో ప్రయత్నంలో మాత్రం నీరజ్ మరింత మెరుగైన ప్రదర్శన చేశాడు. పారిస్ గేమ్స్‌లో 89.45 మీటర్ల త్రోతో కెరీర్ బెస్ట్‌ను నమోదు చేసిన చోప్రా.. ఈ సారి దాన్ని అధిగమించాడు.


లుసానె డైమండ్‌ లీగ్‌‌లో తన చివరిదైన ఆరో ప్రయత్నంలో నీరజ్ చోప్రా.. తన సీజన్ బెస్ట్ త్రో 89.49 మీటర్లు నమోదు చేశాడు. తృటిలో 90 మీటర్ల మార్కుకు దూరమయ్యాడు. అయితే కెరీర్ బెస్ట్ త్రోను నమోదు చేసినా.. నీరజ్ చోప్రాకు నిరాశ తప్పలేదు. రెండు సార్లు ప్రపంచ ఛాంపియన్, పారిస్ 2024లో కాంస్య పతకం సాధించిన గ్రెనెడాకు చెందిన అండర్సన్ పీటర్స్. నీరజ్‌ను అధిగమించాడు. తన చివరి ప్రయత్నంలో ఏకంగా 90.61 మీటర్ల దూరం బల్లెంను విసిరాడు. దీంతో లుసానె డైమండ్‌ లీగ్‌‌లో ఛాంపియన్‌గా అవతరించాడు. జర్మనీకి చెందిన జూలియన్ వెబర్ 87.08 మీటర్ల త్రోతో.. మూడో స్థానంలో నిలిచాడు.


కాగా టోక్యో 2020 ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన నీరజ్ చోప్రా.. ఒక్కసారిగా ఫేమస్ అయిపోయాడు. ఈసారి కూడా గోల్డ్ మెడల్ సాధించడమే లక్ష్యంగా పారిస్ గేమ్స్‌లోకి అడుగుపెట్టాడు. అయితే నీరజ్ తన కెరీర్ బెస్ట్ త్రో విసిరినా.. స్వర్ణం మాత్రం సాధించలేకపోయాడు. పాకిస్థాన్‌కు చెందిన జావెలిన్ త్రోయర్ అర్షద్ నదీమ్ పారిస్ ఒలింపిక్స్‌లో రికార్డు త్రో విసిరాడు. ఏకంగా 92.97 మీటర్లు జావెలిన్‌ విసిరి ఒలింపిక్ రికార్డును బద్దలు కొట్టాడు. దీంతో స్వర్ణ పతకాన్ని కొల్లగొట్టాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com