ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉద్యోగం తిరస్కరించిన షూటర్‌ సరబ్‌జోత్ సింగ్

sports |  Suryaa Desk  | Published : Fri, Aug 16, 2024, 10:55 PM

పారిస్‌ 2024 ఒలింపిక్స్‌లో భారత్‌ ఆరు పతకాలు సాధించిన విషయం తెలిసిందే. ఇందులో మను భాకర్‌తో కలిసి సరబ్జోత్‌ సింగ్‌ షూటింగ్‌లో కాంస్యం సాధించాడు. 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ విభాగంలో మను భాకర్, సరబ్జోత్‌ సింగ్‌ల జోడీ దక్షిణ కొరియాతో పోటీపడి పతకాన్ని గెలుచుకుంది. అయితే ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన క్రీడాకారులకు వారి రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైజ్‌మనీతో పాటు ప్రభుత్వ ఉద్యోగాలను సైతం ఇస్తామని ప్రకటిస్తున్నాయి. ఇదే విధంగా మను భాకర్‌, సరబ్జోత్‌ సింగ్‌లకు సైతం ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని హరియాణా ప్రభుత్వం ప్రకటించింది.


  అయితే ఈ ఉద్యోగంపై సరబ్జోత్‌ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. సాధారణంగా ఎవరైనా ప్రభుత్వం ఉద్యోగం ఇస్తామంటే.. ఎగిరి గంతేస్తారు. లైఫ్‌ సెటిల్ట్‌ అని హ్యాపీగా ఫీల్‌ అవుతారు. కానీ సరబ్జోత్‌ సింగ్‌ మాత్రం హరియాణా ప్రభుత్వం ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగ ఆఫర్‌ను తిరస్కరించాడు. 22 ఏళ్ల సరబ్జోత్‌ సింగ్‌.. షూటింగ్‌పైనే ఎక్కువ ఫోకస్‌ చేయాలని అనుకుంటున్నట్లు తన మనసులోని మాటను వెల్లడించాడు. దీంతో ఉద్యోగం చేయలేనని తేల్చి చెప్పేశాడు.


“ప్రభుత్వం ఆఫర్‌ చేసింది మంచి ఉద్యోగమే. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఆ ఉద్యోగం చేయడం నాకు కుదరదు. ప్రస్తుతం షూటింగ్‌పై ఎక్కువ దృష్టిసారించాలని అనుకుంటున్నా. నా కుటుంబ సభ్యులు కూడా మంచి ఉద్యోగం చూసుకోమని కోరుతున్నారు. నా లక్ష్యాలకు అనుగుణంగా నేను తీసుకున్న కొన్ని నిర్ణయాలకు వ్యతిరేకంగా ప్రస్తుతం వెళ్లలేను. అందువల్ల ఇప్పుడు నేను ఉద్యోగం చేయలేను” అని సరబ్జోత్‌ సింగ్‌ వ్యాఖ్యానించాడు.


సరబ్జోత్‌ సింగ్ రైతు కుటుంబంలో జన్మించాడు. చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలను ఎదుర్కొని.. షూటింగ్‌లో రాణించాడు. తాను పాల్గొన్న తొలి ఒలింపిక్స్‌.. పారిస్‌ 2024లోనే కాంస్యం సాధించి సత్తా చాటాడు.


హర్యానా ప్రభుత్వం సరబ్‌కు ఆఫర్‌ చేసిన ఉద్యోగం ఇదే..


పారిస్ 2024 ఒలింపిక్స్‌లో కాంస్యం గెలిచిన 22 ఏళ్ల సరబ్జోత్‌ సింగ్‌కు హరియాణా ప్రభుత్వం క్రీడాశాఖలో డిప్యూటీ డైరెక్టర్‌ ఉద్యోగాన్ని ఇస్తామని ప్రకటించింది. దీన్నే అతడు తిరస్కరించాడు. కాగా మరో నాలుగేళ్ల తర్వాత ఒలింపిక్స్‌ జరగనున్నాయి. లాస్‌ ఏంజిల్స్ వేదికగా 2028 ఒలింపిక్స్‌ జరగనుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com