ట్రెండింగ్
Epaper    English    தமிழ்

10 సిక్స్‌లతో సెంచరీ, అదీ 6వ స్థానంలో వచ్చి,,,ఇషాన్‌ కిషన్‌ కమ్‌బ్యాక్‌ అదుర్స్‌

sports |  Suryaa Desk  | Published : Fri, Aug 16, 2024, 10:54 PM

సుదీర్ఘ విరామం తర్వాత ప్రొఫెషనల్‌ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన టీమిండియా యువ బ్యాటర్‌ ఇషాన్‌ కిషన్ సెంచరీతో చెలరేగాడు. తమిళనాడు వేదికగా జరుగుతున్న బుచ్చి బాబు టోర్నమెంట్‌లో ఝార్ఖండ్‌ తరఫున బరిలోకి దిగిన ఈ యువ బ్యాటర్.. 86 బంతుల్లోనే మూడంకెల స్కోరు అందుకున్నాడు. 92 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఏకంగా రెండు సిక్సర్లు కొట్టి సెంచరీ మార్కును చేరుకున్నాడు. మొత్తం మీద 107 బంతుల్లో 5 ఫోర్లు,10 సిక్సర్లతో 114 రన్స్‌ చేసి ఔట్‌ అయ్యాడు.


ఈ మ్యాచ్‌‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన మధ్యప్రదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 91.3 ఓవర్లలో 225 పరుగులకు ఆలౌటైంది. అనంతరం జార్ఖండ్‌ బ్యాటింగ్‌ ప్రారంభించింది. ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన ఈ 26 ఏళ్ల వికెట్‌ కీపర్.. తొలుత నిదానంగా బ్యాటింగ్ చేశాడు. 61 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్కు అందున్నాడు. ఆ తర్వాత టాప్‌ గేర్‌లోకి వచ్చేశాడు. 36 బంతుల వ్యవధిలోనే 9 సిక్సర్లు బాదాడు. దీంతో 86 బంతుల్లోనే సెంచరీ స్కోరు చేశాడు.


మొత్తంగా ఈ ఇన్నింగ్స్‌లో ఇషాన్‌ కిషన్ పది సిక్సర్లు బాదాడు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి జార్ఖండ్ 84 ఓవర్లలో 7 వికెట్లకు 277 పరుగులు చేసింది. ఐపీఎల్ 2024 సీజన్ తర్వాత ఇషాన్ కిషన్ ఆడుతున్న తొలి ప్రొఫెషనల్ క్రికెట్ మ్యాచ్ ఇదే కావడం గమనార్హం. ఓ దశలో టీమిండియా తరఫున అన్ని ఫార్మాట్‌లలో బరిలోకి దిగిన ఇషాన్ కిషన్.. గతేడాది దక్షిణాఫ్రికా పర్యటన మధ్యలో నుంచి భారత్‌కు తిరిగొచ్చేశాడు. మానసికంగా ఇబ్బంది పడుతున్నట్లు చెప్పి.. క్రికెట్‌ దూరమయ్యాడు. ఆ తర్వాత బీసీసీఐ దేశవాళీ క్రికెట్‌ ఆడమన్నా.. వినకపోవడంతో శ్రేయస్‌ అయ్యర్‌తో పాటు సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ను కోల్పోయాడు. దీంతో జట్టుకు దూరమయ్యాడు. టీ20 ప్రపంచకప్‌ 2024కు సైతం దూరమయ్యాడు.


ఐపీఎల్‌ 2024లో 14 మ్యాచ్‌లు ఆడిన ఇషాన్ కిషన్ 320 రన్స్‌ స్కోరు చేశాడు. టీమిండియా తరఫున చివరగా గతేడాది నవంబర్‌లో టీ20 మ్యాచ్‌ ఆడాడు. గతేడాది జులైలో వెస్టిండీస్‌తో టెస్టు మ్యాచ్‌ ఆడాడు. వచ్చే 5 నెలల్లో టీమిండియా 10 టెస్ట్ మ్యాచ్‌లు ఆడనున్న విషయం తెలిసిందే. దీంతో భారత జట్టులోకి రీఎంట్రీ ఇచ్చేందుకు ఇషాన్ కిషన్.. దేశవాళీ బాటపట్టాడు.


ప్రస్తుతం జరుగుతున్న బుచ్చి బాబు టోర్నీతో పాటు సెప్టెంబర్ 5 నుంచి ప్రారంభమయ్యే దులీప్ ట్రోఫీకి కూడా తాను అందుబాటులో ఉండనున్నట్లు బీసీసీఐకి ఇషాన్ కిషన్ వెల్లడించాడు. దులీప్‌ ట్రోఫీలో గ్రూప్‌-డి జట్టు తరఫున ఇషాన్ కిషన్ వికెట్‌ కీపర్‌గా బరిలో దిగనున్నాడు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com