ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శ్రుతిమించిన ర్యాగింగ్.. సీనియర్ విద్యార్థి నుంచి లైంగిక వేధింపులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Aug 13, 2024, 09:43 PM

ర్యాగింగ్ భూతం మరో నిండు ప్రాణం తీసింది. కన్నవాళ్ల కలలను చిదిమేస్తూ డాక్టర్ కావాల్సిన వాడు.. బలవన్మరణానికి పాల్పడి ఆ కన్నోళ్లకు తీరని వేదనను మిగిల్చాడు. ఈ విషాద ఘటన నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది. అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణానికి చెందిన ప్రదీప్ అనే యువకుడు.. నెల్లూరులోని నారాయణ మెడికల్ కాలేజీలో బీడీఎస్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. అయితే సోమవారం రాత్రి ప్రదీప్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. చనిపోవటానికి ముందు తన సోదరుడికి మెసేజ్ పెట్టిన ప్రదీప్.. అందులో తన బాధను చెప్పుకున్నాడు. ఇవన్నీ భరించలేకపోతున్నానంటూ ఆత్మహత్య చేసుకున్నాడు.


నెల్లూరు నారాయణ మెడికల్ కాలేజీలో సెకండియర్ చదువుతున్న ప్రదీప్‌ను.. అదే కాలేజీకి చెందిన ఎంబీబీఎస్ స్టూడెంట్ రాహుల్ వేధిస్తున్నట్లు తెలిసింది. కాలేజీలో జాయిన్ అయిన కొత్తల్లో వీరంతా ఒకే రూమ్‌లో ఉండేవారని ప్రదీప్ కుటుంబసభ్యులు చెప్తున్నారు. అయితే ఆ తర్వాత నుంచి రాహుల్‌తో పాటుగా అతని స్నేహితులు ప్రదీప్‌ను లైంగికంగా, మానసికంగా వేధిస్తూ వచ్చారని ప్రదీప్ సోదరుడు చెప్తున్నారు. ఇవన్నీ భరించలేక తన సోదరుడు తనకు సోమవారం రాత్రి మెసేజ్ పెట్టి.. కాలేజీ భవనం పై నుంచి దూకి చనిపోయాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బుధవారం ఊరికి వస్తానని చెప్పిన ప్రదీప్.. ఆ తర్వాత రాత్రి వేళ రాహుల్ తనను వేధిస్తున్నాడని.. ఆ వేధింపులు తట్టుకోవడం తనవల్ల కాదంటూ మెసేజ్ పెట్టినట్లు ప్రదీప్ సోదరుడు చెప్తున్నారు.


మెసేజ్ పెట్టిన తర్వాత కాలేజీ బిల్డింగ్ పైకి ఎక్కి.. అక్కడి నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు చెప్తున్నారు. ప్రదీప్‌ను వేధించిన రాహుల్ మీద, అతని స్నేహితుల మీద చర్యలు తీసుకోవాలని ప్రదీప్ కుటుంబసభ్యులు చెప్తున్నారు. మరోవైపు ప్రదీప్ ఆత్మహత్య విషయాన్ని విద్యార్థులు, కాలేజీ సిబ్బంది పోలీసులకు చేరవేశారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం పోస్టుమార్టమ్ కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మరోవైపు ఆస్పత్రి వద్ద ప్రదీప్ కుటుంబసభ్యుల ఆందోళనతో కాసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. తమ కొడుకు మరణానికి కారణమైన రాహుల్ ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com