ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అన్న క్యాంటీన్లకు ,,,,కోటి రూపాయలు విరాళంగా ఇచ్చిన విజయవాడ సంస్థ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Aug 13, 2024, 09:41 PM

ఏపీలో ఆగస్ట్ 15 నుంచి ప్రారంభం కానున్న అన్న క్యాంటీన్లకు భారీ విరాళం అందింది. విజయవాడకు చెందిన శ్రీలక్ష్మీ వెంకటేశ్వర డెవలపర్స్ సంస్థ అన్న క్యాంటీన్ల నిర్వహణ కోసం కోటి రూపాయలను ప్రభుత్వానికి విరాళంగా అందించింది. సంస్థ అధినేత పెనుమత్స శ్రీనివాసరాజు.. సీఎం చంద్రబాబు నాయుడిని సచివాలయంలో కలిసి.. కోటి రూపాయల విరాళం తాలూకు చెక్ అందజేశారు. అనంతరం వచ్చే ఐదేళ్ల పాటు ఏటా కోటి రూపాయల చొప్పున అన్న క్యాంటీన్ల నిర్వహణ కోసం విరాళంగా అందిస్తానని ప్రకటించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరాజును సీఎం చంద్రబాబు అభినందించారు. పేదల ఆకలి తీర్చే అన్న క్యాంటీన్ల నిర్వహణ కోసం ప్రజలు కూడా స్వచ్ఛందంగా విరాళాలు ఇవ్వాలని సూచించారు.


మరోవైపు ఆగస్ట్ 15 నుంచి వంద అన్న క్యాంటీన్లను ఏపీ ప్రభుత్వం ప్రారంభించనుంది. తొలివిడతగా వంద క్యాంటీన్లను ప్రారంభించనున్న ప్రభుత్వం త్వరలోనే మిగతా వాటిని కూడా అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాల్లో ఉంది. అయితే విశాఖపట్నం ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఉత్తరాంధ్ర జిల్లాలు మినహా మిగతా చోట్ల అన్న క్యాంటీన్లను ప్రారంభించనున్నారు. ఎంపిక చేసిన 33 మున్సిపల్, కార్పొరేషన్‌లలో అన్న క్యాంటీన్లు అందుబాటులోకి తేనున్నారు. మరోవైపు ఆగస్ట్ 15వ తేదీ సీఎం చంద్రబాబు నాయుడు కృష్ణా జిల్లా గుడివాడలో అన్న క్యాంటీన్ ప్రారంభించనున్నారు. 16వ తేదీ మిగతా 99 అన్న క్యాంటీన్లను మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రారంభిస్తారు.


అన్న క్యాంటీన్ల నిర్వహణ బాధ్యతను అక్షయపాత్ర ఫౌండేషన్ చూస్తోంది. అయితే 2014 ఎన్నికల్లో విజయం అనంతరం టీడీపీ ప్రభుత్వం అన్న క్యాంటీన్లను ప్రారంభించింది. ఐదు రూపాయలకే పేదలు, కార్మికులు, కూలీలకు భోజనం అందించింది. మొత్తం 180 చోట్ల అన్న క్యాంటీన్లు ఏర్పాటుచేసి.. రూ.5 లకే 4.60 కోట్ల భోజనాలు అందించారు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్న క్యాంటీన్లు మూతపడ్డాయి. పలుచోట్ల వీటిని సచివాలయాలకు కేటాయించారు. అయితే ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వస్తే అన్న క్యాంటీన్లను తిరిగి తెరుస్తామని ప్రకటించిన టీడీపీ కూటమి.. ఇచ్చిన హామీ మేరకు అన్న క్యాంటీన్లను తిరిగి అందుబాటులోకి తెస్తోంది. పట్టణ ప్రాంతాల్లో 180 చోట్ల, గ్రామీణ ప్రాంతాల్లో 200 చోట్ల అన్న క్యాంటీన్లు ప్రారంభించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. వీటిలో తొలివిడతగా వంద చోట్ల అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com