ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కాలువలో మునిగి చనిపోయిన ఎద్దు,,,కన్నీటిపర్యంతమైన రైతు దంపతులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Aug 13, 2024, 09:21 PM

కన్న బిడ్డలా చూసుకుంటున్న ఎద్దు కళ్ల ముందే ప్రాణాలు కోల్పోవడం ఆ రైతును కలిచివేసింది. ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో.. తన ప్రాణాలను మాత్రమే కాపాడుకోగలిగాడు ఆ రైతు. బిడ్డలా చూసుకున్న వృషభ రాజం ఇక లేదనే చేదు నిజాన్ని జీర్ణించుకోలేక భార్యాభర్తలు కన్నీటి పర్యంతం అయ్యారు. కడప జిల్లాలో జరిగిన ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది.


కడప జిల్లా దువ్వూరు ఎస్సీ కాలనీకి చెందిన రైతు ఆశీర్వాదం వరి సాగు చేస్తున్నారు. ఆయన ఎడ్లబండిపై వరి వంగడాల బస్తాలను తీసుకెళుతుండగా.. మార్గమధ్యలో ఎడ్లు బెదిరాయి. బండి ఒక్కసారిగా కేసీ కాలువలోకి దూసుకెళ్లింది.. ఎద్దులతోపాటు రైతు నీటిలో మునిగారు. ఏమీ చేయలేని పరిస్థితుల్లో.. రైతు ఈదుకుంటూ గట్టుపైకి చేరుకున్నారు. కాలువలోని రెండు ఎడ్లలో ఒక దానికి ఉన్న పట్టెడ తెగి అదీ ఈదుతూ సురక్షితంగా బయటకు వచ్చింది. కానీ మరో ఎద్దు బండితో సహా కాలువలోనే మునిగి చనిపోయింది.


రైతు ఆశీర్వాదం స్థానికులకు సమాచారం ఇవ్వగా.. ట్రాక్టరు క్రేన్‌ సాయంతో దాని కళేబరాన్ని బయటకు తీశారు. వ్యవసాయంలో జీవనాధారంగా ఉన్న ఎద్దు కళ్లెదుటే చనిపోవడంతో ఆశీర్వాదంతో పాటూ భార్య కన్నీటి పర్యంతం అయ్యారు. కన్న బిడ్డలా చూసుకుంటున్న ఎద్దు ఇలా చనిపోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. ఎద్దు దగ్గరే కూర్చుని భార్యాభర్తలు కన్నీళ్లు పెట్టుకోవడం చూసి స్థానికులు చలించిపోయారు.


తెలంగాణలో కూడా రెండు ఎడ్లు ప్రమాదవశాత్తూ చనిపోయాయి. రంగారెడ్డి జిల్లా బంట్వారం మండలం మోత్కుపల్లిలో రైతు కావలి బాలయ్య పొలంలో వ్యవసాయం ముగించుకొని ఎద్దులను మేపుతున్నారు. ఆ సమయంలో ఎద్దు పాముకాటుకు గురికగా.. వెంటనే గమనించిన రైతు చికిత్స చేయించారు. కానీ ఎద్దు మాత్రం ప్రాణాలు కోల్పోయింది. ఈ ఎద్దు విలువ దాదాపు 60వేల వరకు ఉంటుందని.. తనను ప్రభుత్వం ఆదుకోవాలని రైతు బాలయ్య అంటున్నారు.


పెద్దేముల్‌ మండలం ఇందూరులో మరో ఘటనలో ఎద్దు చనిపోయింది. ఆత్కూర్‌‌కు ‌చెందిన బ్యాగారి యాదయ్య ఇందూరుకు చెందిన మాజీ సర్పంచ్‌ మొగులప్ప పొలంలో వ్యవసాయ పనుల కోసం వచ్చారు. యాదయ్య మొగులప్ప పొలంలో దుక్కి దున్నడం ముగిసిన తర్వాత ఎడ్లను మేత కోసం వదిలేశారు.. అయితే ఒక ఎద్దు మేత మేస్తూ సమీపంలోని విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్ వైపుగా వెళ్లింది.‌ ఆ ట్రాన్స్‌ఫార్మర్‌ ఎత్తు తక్కువగా ఉండడంతో ప్రమాదవశాత్తూ విద్యుత్‌ తీగ తగిలి ఎద్దు చనిపోయింది. ఆ ఎద్దు విలువ సుమారు రూ.80వేలు ఉంటుందని రైతు అంటున్నారు. తనను ప్రభుత్వం ఆదుకోవాలి అంటున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com