ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పారిస్‌లో కొద్దిలో పతకం మిస్‌ అయిన వారు వీళ్లే.. ఏడు పతకాలను తృటిలో చేజార్చుకున్న భారత క్రీడాకారులు

sports |  Suryaa Desk  | Published : Sun, Aug 11, 2024, 09:38 PM

పారిస్‌ 2024 ఒలింపిక్స్‌ను భారత్‌ ఆరు పతకాలతో ముగించింది. ఈ ఎడిషన్‌ విశ్వక్రీడల్లో భారత్ నుంచి 117 మంది అథ్లెట్లు పాల్గొన్నారు. గత టోక్యో ఒలింపిక్స్‌లో 124 మంది అథ్లెట్లు బరిలో నిలవగా.. అందులో మొత్తంగా భారత్‌ ఏడు పతకాలు సాధించింది. ఈసారి రెండంకెల సంఖ్యలో పతకాలే లక్ష్యంగా భారత్‌ పారిస్‌లో అడుగుపెట్టినా.. క్రితం సారి కంటే తక్కువ సంఖ్యలోనే మెడల్స్‌ సాధించింది. అయితే భారత సాధించిన పతకాల కంటే కూడా తృటిలో చేజార్చుకున్న వాటి సంఖ్యే ఎక్కువగా ఉంది. భారత్‌ ఏకంగా ఏడు ఈవెంట్‌లలో నాలుగో స్థానంలో నిలిచింది. అందులో కాస్త మెరుగ్గా ప్రదర్శన చేసినా.. భారత్‌ ఖాతలో మరో 7 పతకాలు వచ్చేవే. కానీ దురదృష్టవశాత్తు అలా జరగలేదు.


మహేశ్వరి చౌహాన్‌, అనంత్‌జీత్‌సింగ్‌:


పారిస్‌ ఒలింపిక్స్‌లో అంచనాలు లేకుండా బరిలోకి దిగిన భారత యువ షూటర్లు మహేశ్వరి చౌహాన్‌, అనంత్‌జీత్‌సింగ్‌ మెరుగైన ప్రదర్శన చేశారు. స్కీట్‌ మిక్స్‌డ్‌టీమ్‌ ఈవెంట్‌ కాంస్య పతక పోరులో ఈ జోడీ.. 43-44తో నిలిచింది. కేవలం ఒక్క పాయింట్‌ తేడాతో కాంస్యం సాధించే ఛాన్స్‌ కోల్పోయింది.


1 కిలో తేడాతో మిస్‌ చేసుకున్న మీరాబాయి:


టోక్యో 2020 ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన భారత మహిళా వెయిట్‌ లిఫ్టర్‌ మీరాబాయి చానుకు ఈసారి దురదృష్టం వెంటాడింది. మహిళల 49 కిలోల కేటగిరీలో పోటీకి దిగిన ఆమె.. 199 కిలోలు ఎత్తి.. నాలుగో ప్లేసులో నిలిచింది. తనకంటే ముందున్న థాయ్‌లండ్‌ వెయిట్‌ లిఫ్టర్‌ ఆమె కన్నా ఒక కిలో మాత్రమే ఎక్కువగా ఎత్తింది.


ఆర్చరీలో తొలి పతకం మిస్‌:


బొమ్మదేవర ధీరజ్‌, అంకిత భకత్‌కు ఆర్చరీలో పతకాన్ని కొద్దిలో మిస్‌ చేసుకున్నారు. రికర్వ్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌లో సెమీస్‌కు చేరిన తొలి భారత జోడీగా వీరిద్దరూ రికార్డు సృష్టించారు. కానీ కాంస్య పతక పోరులో 6-2 తేడాతో ఓడి కంచుకు అడుగు దూరంలో నిలిచిపోయారు.


1.4 పాయింట్‌ తేడాతో బ్రాంజ్‌ దూరం:


పురుషుల 10మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ ఫైనల్లో భారత యువ షూటర్‌ అర్జున్‌ బబుత కూడా పతకం సాధించినంత పని చేశాడు. కానీ హోరాహోరీగా సాగిన పోరులో చివరకు 1.4 పాయింట్‌ తేడాతో కాంస్యాన్ని మిస్‌ చేసుకున్నాడు. దీంతో తాను పాల్గొన్న తొలి ఒలింపిక్స్‌లోనే పతకం తేవాలన్న ఆశలు నీరుగారిపోయాయి.


లక్ష్యసేన్‌కు హార్ట్‌బ్రేక్‌:


భారత యువ షట్లర్‌ లక్ష్యసేన్‌.. పారిస్‌ ఒలింపిక్స్‌లో సత్తాచాటాడు. ఓటమి అనేదే లేకుండా సెమీఫైనల్‌ వరకూ చేరాడు. అంచనాలకు మించి రాణించి.. తనకంటే మెరుగైన ర్యాంకు ఉన్న ప్లేయర్లను మట్టికరిపించాడు. కానీ సెమీస్‌ చేరాక వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడి నాలుగో స్థానంలో నిలిచాడు.


మను భాకర్‌ హ్యాట్రిక్‌ మిస్‌:


పారిస్‌ ఒలింపిక్స్‌లో భారత్‌కు తొలి రెండు పతకాలు అందించిన షూటర్‌ మను భాకర్.. హ్యాట్రిక్ పతకాన్ని కొద్దిలో మిస్‌ చేసుకుంది. 25 మీటర్ల పిస్టల్‌ ఈవెంట్‌లో భాకర్‌ నాలుగో స్థానంలో నిలిచింది. దీంతో ఒకే ఒలింపిక్స్‌లో హ్యాట్రిక్‌ మెడల్‌ సాధించే సువర్ణావకాశాన్ని కోల్పోయింది.


రితికాకు కలిసిరాని అదృష్టం:


మహిళల 76 కిలోల రెజ్లింగ్‌లో పాల్గొన్న రితికా హుడా సంచలన ప్రదర్శనతో క్వార్టర్స్‌ వరకూ చేరింది. ఒలింపిక్స్‌లో తొలిసారి బరిలో నిలిచిన రెజ్లర్.. మెరుగైన ప్రదర్శన చేసింది. క్వార్టర్స్‌ బౌట్‌లో ప్రపంచ నెంబర్‌ వన్‌ ర్యాంకర్‌ కిర్గిస్థాన్‌కు చెందిన ఐపెరీ మెడెట్‌ కైజీతో 1-1తో రితికా ఓడిపోయింది. పాయింట్లు సమానంగా ఉన్నప్పటికీ చివరి పాయింట్‌ సాధించిన కైజీని విజేతగా ప్రకటించారు. దీంతో మరో పతకాన్ని భారత్ కోల్పోయింది.


వినేష్‌కు పతకం వచ్చేనా..?


కాగా మహిళల 50 కేజీల ఫ్రీస్టైల్‌ విభాగంలో పాల్గొన్న భారత రెజ్లర్‌ వినేష్ ఫొగాట్‌ ఫైనల్‌కు బరువు ఎక్కువగా ఉందనే కారణంతో అనర్హతకు గురైంది. ఈ నిర్ణయాన్ని ఆమె కోర్ట్‌ ఆఫ్‌ ఆర్బిట్రేషన్‌ ఫర్‌ స్పోర్ట్స్‌ లో సవాల్‌ చేసింది. దీనిపై ఆగస్టు 13న తీర్పు రానుంది. ఒకవేళ వినేష్‌కు అనుకూలంగా తీర్పు వస్తే ఆమె ఖాతాలో రజత పతకం చేరనుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com