ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాష్ట్రంలో అసలు శాంతిభద్రతలు ఉన్నాయా..?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Oct 23, 2024, 08:13 PM

 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దారుణమైన పరిస్థితులు కనపడుతున్నాయని ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ఆడవారికి భద్రత లేదని, అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నా ప్రభుత్వం, అధికార పార్టీ నేతలు పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు. వైఎస్ఆర్ జిల్లా బద్వేల్‌లో 16 ఏళ్ల బాలికపై ఓ కామాంధుడు అత్యాచారం చేసి పెట్రోల్ పోసి తగలబెట్టాడని జగన్ మండిపడ్డారు. శ్రీకాకుళం జిల్లా పలాసాలో ఇద్దరి బాలికలకు పుట్టిన రోజు పార్టీ అని చెప్పి మత్తు మందు కలిపిన కూల్ డ్రింక్స్‌ ఇచ్చి అత్యాచారం చేశారని ధ్వజమెత్తారు. బర్త్ డే పార్టీ పేరుతో కొంతమంది బరితెగించి దారుణానికి పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు.


స్థానిక ఎమ్మెల్యే, మంత్రులు నిందితులను తప్పించే ప్రయత్నం చేస్తున్నారని వైసీపీ అధినేత జగన్ ఆరోపించారు.పిఠాపురం నియోజకవర్గంలోనూ టీడీపీ కార్పొరేటర్ భర్త 16 ఏళ్ల యువతికి మత్తుమందు ఇచ్చి ఆటోలో నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడని జగన్ ఆరోపించారు. చెత్త కాగితాలు ఏరుకునే వారు ఆ బాలిక ప్రాణాలు కాపాడారని ఆయన అన్నారు. నిందితుడు మంత్రులు లోకేశ్, అచ్చెన్నాయుడుతో ఫొటోలు దిగాడంటూ వాటిని మీడియాకు చూపించారు. సొంత నియోజకవర్గంలో ఘటన జరిగితే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కనీసం బాధితురాలి ఇంటికి వెళ్లి పరామర్శించలేదని జగన్ మండిపడ్డారు. అలాగే హిందూపురంలో దసరా పండగ రోజున అత్తాకోడళ్లపై గ్యాంగ్ రేప్ చేశారని, నిందితులను మూడ్రోజుల వరకూ పోలీసులు అరెస్టు చేయలేదని ఫ్యాన్ పార్టీ అధినేత జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే బాలకృష్ణ కనీసం బాధితులను పరామర్శించలేదని మాజీ సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఆడవారికి భద్రత కరవైందని తీవ్రంగా స్పందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com