ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పారిస్ ఒలింపిక్స్ లో ఆరు పతకాలతో ముగిసిన భారత్ ప్రస్థానం

sports |  Suryaa Desk  | Published : Sun, Aug 11, 2024, 09:37 PM

ఈసారి రెండంకెల పతకాలు కొల్లగొట్టడమే లక్ష్యంగా పారిస్‌ 2024 ఒలింపిక్స్‌లోకి అడుగుపెట్టిన భారత్‌కు నిరాశజనక ఫలితాలు ఎదురయ్యాయి. టోక్యో 2020 ఒలింపిక్స్‌లో సాధించిన ఏడు పతకాలను మించి కైవసం చేసుకోవాలనే పట్టుదలతో భారత బృందం బయలుదేరింది. కానీ కచ్చితంగా పతకాలు సాధిస్తారనుకుని ఆశలు పెట్టుకున్న అథ్లెట్లు నిరాశపరిచారు. దానికి తోడు అదృష్టం కూడా కలిసి రాకపోవండతో అరడజనుకు పైగా పతకాలు తృటిలో చేజారాయి. దీంతో భారత్ పారిస్ 2024 ఒలింపిక్స్‌లో ఆరు పతకాలతోనే సరిపెట్టుకుంది. అందులో ఒకటి రజతం కాగా.. మిగతా ఐదు కాంస్యాలు. పారిస్ ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించకుండానే భారత్ వెనుదిరగాల్సి వచ్చింది.


 నిరాశపరిచిన స్టార్లు..


ఈ ఒలింపిక్స్‌లో పతకాల పరంగా చూస్తే.. నిరాశ కలిగిస్తోంది. కానీ ప్రదర్శన మాత్రం ఏమంత తీసికట్టుగా లేదు. పతకాలు అనుకున్నన్ని సాధించలేకపోయినా.. ప్రదర్శన మాత్రం గతం కంటే మిన్నగా ఉందని చెప్పొచ్చు. ఏడు ఈవెంట్‌లలో భారత అథ్లెట్లు నాలుగో స్థానంలో నిలిచి తృటిలో పతకాలు సాధించే అవకాశాలను కోల్పోయారు. గత ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన పీవీ సింధు, మీరాబాయి చాను, లవ్లీనా బోర్గెహెయిన్ వంటి వారు ఈసారి పతక వేటలో వెనుకబడ్డారు. ఈసారి కచ్చితంగా పతకాలు సాధిస్తారని అనుకున్న లక్ష్యసేన్, బాక్సర్ నిఖత్ జరీన్‌లు కూడా నిరాశపరిచారు.


సత్తా చాటిన షూటర్లు..


పారిస్ ఒలింపిక్స్‌లో కాస్త కలిసొచ్చిన అంశం ఏదైనా ఉందంటే.. అది షూటింగ్. ఈసారి భారత్ సాధించిన తొలి మూడు పతకాలు షూటింగ్‌లో వచ్చినవే. అందులో రెండు కాంస్యాలను 22 ఏళ్ల మను భాకర్ కొల్లగొట్టింది. ఓ దశలో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్‌ ఈవెంట్‌లో రజతం గెలిచేలా కన్పించిన మను భాకర్.. చివరకు కాంస్యంతో సరిపెట్టుకుంది. 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్‌లో నాలుగో స్థానంలో నిలిచి.. తృటిలో పతకాన్ని కోల్పోయింది. ఆర్చరీలో ధీరజ్-అంకిత, షూటింగ్‌లో అనంత్ జీత్- మహేశ్వరీ, బాక్సింగ్‌లో నిశాంత్ దేవ్, లవ్లీనా బోర్గెహెయిన్, బ్యాడ్మింటన్‌లో లక్ష్యసేన్, సాత్విక్-చిరాగ్‌లు స్వల్ప తేడాలో పతకాన్ని మిస్ చేసుకున్నారు.


నీరజ్ రజతం.. ఫోగట్ తీర్పు వాయిదా:


ఇక గత ఒలింపిక్స్‌లో పసిడి గెలిచిన నీరజ్ చోప్రా.. ఈసారి రజతానికి పరిమితమయ్యాడు. తన కెరీర్ బెస్ట్ త్రోను విసిరినా.. పాకిస్థాన్‌కు చెందిన అర్షద్ నదీమ్ అసాధారణ త్రో కారణంగా నీరజ్ రెండో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. రెజ్లర్ వినేష్ ఫొగాట్ సైతం ఫైనల్ చేరి పతకం ఖాయం చేసింది. కానీ నిర్ణీత బరువు కంటే 100 గ్రాముల అదనంగా ఉండటంతో ఆమెపై అనర్హత వేటు పడింది. దీన్ని సవాల్ చేస్తూ కోర్ట్‌ ఆఫ్‌ ఆర్బిట్రేషన్‌ ఫర్‌ స్పోర్ట్స్‌ (CAS)ను ఫోగట్ ఆశ్రయించింది. ఈ కోర్టు తీర్పు ఈనెల 13న వెలువడనుంది. ఒకవేళ ఆమెకు అనుకూలంగా తీర్పు వస్తే భారత్ ఖాతాలో మరో రజత పతకం చేరనుంది. అదే జరిగితే టోక్యో 2020 ఒలింపిక్స్‌లో సాధించిన ఏడు పతకాల సంఖ్యను భారత్ అందుకుంటుంది.


ఏది ఏమైనా పారిస్‌లో పతకాల విషయంలో భారత్ వెనకబడ్డా.. ప్రదర్శనలో మాత్రం మెరుగైంది. వచ్చే నాలుగేళ్లు ఆటగాళ్లను సరైన పంథాలో సిద్ధం చేస్తే.. 2028లో జరగనున్న లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్‌లో రెండంకెల మార్క్‌ను చేరుకోవడం అంత కష్టమేమీ కాదు.


ఒలింపిక్స్ 2024‌ - పతకాలు గెలిచిన భారత అథ్లెట్లు వీరే..


1. మను భాకర్ - 10 మీ. ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో కాంస్యం


2. మను భాకర్, సరబ్జోత్ సింగ్ - 10 మీ. ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో కాంస్యం


3. స్వప్నిల్ కుశాలే - 50 మీటర్ల రైఫిల్ ఈవెంట్‌లో కాంస్యం


4. నీరజ్ చోప్రా - జావెలిన్ త్రోలో రజతం


5. అమన్ షెరావత్ - రెజ్లింగ్‌లో కాంస్యం


6. హాకీలో కాంస్యం







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com