ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమరావతికి ఇచ్చే రూ.15000 కోట్లు సాయం కాదు..అప్పేనటా,,,స్పష్టంచేసిన జీవీఎల్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jul 30, 2024, 07:59 PM

కేంద్రం ఏపీకి ఇచ్చింది ఏమిటో తాాజాగా తేలిపోయింది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఏపీ రాజధాని అమరావతికి రూ.15000 కోట్లు ప్రత్యేక సాయం చేస్తామని ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే లోక్ సభ వేదికగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ ప్రకటన చేసిన తర్వాత.. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఈ 15 వేల కోట్లు కేంద్రం ఏపీకి రుణంగా ఇస్తోందా లేదా గ్రాంటుగా ఇస్తోందా అంటూ వైసీపీ శ్రేణుల నుంచి అందరిలోనూ అనుమానాలు వ్యక్తమయ్యాయి. వైసీపీ శ్రేణులు, ఆ పార్టీ అయితే ఇది అప్పేనని.. దీనికే చంద్రబాబు ఘనతగా చెప్పుకుంటున్నారంటూ విమర్శలు కూడా చేసింది. అయితే అదే రోజు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దీనిపై స్పందించారు. ప్రపంచబ్యాంకు ద్వారా ఏపీకి రూ.15000 కోట్లు ఇప్పిస్తామని చెప్పారు నిర్మలా సీతారామన్. రాజధాని నిర్మాణానికి ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు.


అయితే నిర్మలా సీతారామన్ ఈ ప్రకటన చేసినప్పటికీ.. ఏపీకి కేంద్రం ఇస్తామన్న ఈ రూ.15000 కోట్లు అప్పా లేదా రుణమా అనేది మాత్రం క్లారిటీ రాలేదు. అయితే బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు దీనిపై క్లారిటీ ఇచ్చారు. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్రం ఇస్తామన్న రూ.15000 కోట్లు అప్పేనని జీవీఎల్ తెలిపారు. అయితే ఈ అప్పును రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుందా లేదా.. కేంద్రం చెల్లిస్తుందా అనే దానిపై క్లారిటీ లేదని జీవీఎల్ నరసింహారావు చెప్పారు. విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడిన జీవీఎల్.. వీటితో పాటు అనేక అంశాల మీద స్పందించారు. ఇక ఈ 15 వేల కోట్ల అప్పును తీర్చేందుకు కనీసం 30 ఏళ్లు పడుతుందని అంచనా వేశారు.


మరోవైపు ఏపీకి ప్యాకేజీ లభిస్తే తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ మాత్రం కళ్లల్లో నిప్పులు పోసుకుంటోందని జీవీఎల్ నరసింహారావు ఆరోపించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలోనూ ఏపీ అవసరాలను కాంగ్రెస్ పార్టీ గుర్తించలేదని విమర్శించారు. ఏపీ నష్టపోవడానికి, రాజధాని లేని రాష్ట్రంగా ఉండటానికి కాంగ్రెస్ పార్టీనే కారణమని జీవీఎల్ మండిపడ్డారు. ఇక ప్రతిపక్ష హోదా కోసం వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ కోర్టును ఆశ్రయించడంపైనా జీవీఎల్ స్పందించారు. పదిశాతం సీట్లు రాకపోతే ప్రతిపక్ష హోదా సాధ్యం కాదన్న జీవీఎల్.. ప్రజా సమస్యలపై పోరాడాలనుకుంటే ప్రతిపక్ష హోదాతో అవసరం లేదన్నారు. కోర్టుకు ఎవరైనా వెళ్లవచ్చని అభిప్రాయపడ్డారు.


అలాగే తన మీద వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్న వారికి జీవీఎల్ నరసింహారావు వార్నింగ్ ఇచ్చారు. తనపై ఆధారాలు లేకుండా తప్పుడు ప్రచారాలు చేస్తే చట్టపరంగా చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఎవరి దగ్గరనైనా డబ్బులు తీసుకున్నట్లు నిరూపిస్తే క్షమాపణ చెప్పాలని. లేకుంటే తనపై ఆరోపణలు చేసివ వాళ్లు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com