ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మరో ట్విస్ట్,,,లైవ్‌లో శ్రీనివాస్‌కు ఫోన్ చేసిన మాధురి.. తేల్చేసిన దువ్వాడ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Sep 08, 2024, 08:40 PM

వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా టెక్కలిలోని దువ్వాడ శ్రీనివాస్ ఇంటిని దివ్వెల మాధురి స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఇంటి వద్దకు చేరుకున్న దువ్వాడ శ్రీనివాస్ సతీమణి దువ్వాడ వాణి.. నిరసనకు దిగారు. తమ ఇంట్లోకి దివ్వెల మాధురి ఎలా వెళ్తుందంటూ ఆందోళనకు దిగారు. దీంతో శనివారం టెక్కలిలోని దువ్వాడ శ్రీనివాస్ ఇంటి వద్ద హైడ్రామా నడిచింది. అయితే దువ్వాడ శ్రీనివాస్.. దివ్వెల మాధురి పేరిట ఇంటిని రిజిస్ట్రేషన్ చేశారంటూ వార్తలు కూడా వచ్చాయి. ఈ క్రమంలోనే ఇంటి వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు దివ్వెల మాధురి ఇవాళ విలేకర్ల సమావేశం నిర్వహించారు. దువ్వాడ శ్రీనివాస్‌కు ఫోన్ చేసి ఇంటి వివాదంపై క్లారిటీ ఇచ్చారు. ఫోన్‌లోనే ఇంటి రిజిస్ట్రేషన్ మీద దువ్వాడ శ్రీనివాస్ క్లారిటీ ఇచ్చారు.


మాధురికి తాను రూ.2 కోట్లు అప్పు ఉన్నానన్న దువ్వాడ శ్రీనివాస్.. ఇంటి నిర్మాణానికి, రాజకీయ అవసరాలు, ఇతర అవసరాల కోసం మాధురి వద్ద అప్పు చేసినట్లు తెలిపారు. అలాగే టెక్కలికి చెందిన చింతాడ పార్వతీశం అనే వ్యక్తికి కూడా 60 లక్షలు ఇవ్వాలని దువ్వాడ శ్రీనివాస్ చెప్పారు. ఇక రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక తన వ్యాపారాలు దెబ్బతిన్నాయన్న దువ్వాడ శ్రీనివాస్.. తన మనస్ఫూర్తిగా ఆస్తిని మాధురి పేరిట రిజిస్ట్రేషన్ చేసినట్లు ఫోన్‌లో వెల్లడించారు. దీని గురించి మరిన్ని వివరాలు ప్రెస్ మీట్ పెట్టి చెబుతానని దువ్వాడ శ్రీనివాస్ చెప్పారు.


ఈ నేపథ్యంలో విలేకర్ల సమావేశంలో దువ్వాడ వాణికి ఈ విషయంలో క్లారిటీ ఇచ్చారు దివ్వెల మాధురి. తన ఆస్తిలోకి తన అనుమతి లేకుండా ఎవరు రావడానికి అర్హత లేదని స్పష్టం చేశారు. ఇక దువ్వాడ శ్రీనివాస్ ఇంటిని కబ్జా చేసేందుకు వాణీ ప్రయత్నం చేశారని ఆరోపించారు. అలాగే ఆక్సిడెంట్ సమయంలో తన వాయిస్, దువ్వాడ శ్రీనివాస్ వాయిస్‌ను సృష్టించారని.. దువ్వాడ వాణినే వాయిస్ రికార్డు ప్లాన్ చేశారని ఆరోపించారు. అలాగే తనకూ, తన భర్తకు కొన్ని రోజులుగా విభేదాలు ఉన్నాయని దివ్వెల మాధురి చెప్పారు. తనపై హత్యాయత్నం జరిగిన విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. మరోవైపు టెక్కలిలోని తన ఇంటిని పార్టీ కార్యక్రమాలు నిర్వహించేందుకు దువ్వాడ శ్రీనివాస్‌కు అద్దెకు ఇస్తానని చెప్పారు.


మరోవైపు దువ్వాడ శ్రీనివాస్ ఇంటి వద్ద నెలరోజుల నుంచి ఆందోళన చేస్తున్న దువ్వాడ వాణి, ఆమె కుమార్తెలు రాత్రి సమయంలో ఖాళీచేసినట్లు తెలిసింది. దీంతో దివ్వెల మాధురి ఈ ఇంటిని స్వాధీనం చేసుకున్నారు. గొడవ సద్దుమణగడంతో ఇంటి వద్ద ఉన్న వారిని పోలీసులు ఖాళీ చేయించారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com