ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వరద బాధితులకు రూ.600 విరాళం.. పవన్ కళ్యాణ్ రియాక్షన్ వైరల్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Sep 08, 2024, 10:18 PM

వరదలతో అతలాకుతలమైన విజయవాడకు విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. ప్రముఖుల నుంచి సామాన్యుల వరకూ తమకు చేతనైన స్థాయిలో విరాళాలు అందిస్తున్నారు. ఆపదలో ఉన్నవారికి అండగా నిలుస్తున్నారు. ఇక విరాళాల కోసం ఏపీ ప్రభుత్వం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటుచేసింది. విరాళాలు అందించేందుకు బ్యాంకు అకౌంట్ వివరాలను సైతం పౌరులతో పంచుకుంది. ఈ క్రమంలోనే.. వరద బాధితులకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభిమాని ఒకరు రూ.600 వరద సాయం అందించారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా వేదికగా వెల్లడించగా.. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది. ఇక ఈ ట్వీట్‌కు డిప్యూటీ సీఎంవో కార్యాలయం సైతం స్పందించడం విశేషం. అయితే పనిచేస్తే కానీ పూట గడవని స్థితిలో.. వరద బాధితులకు సాయంగా నిలవాలనే తపనతో ఆయన చేసిన సాయంపై నెటిజనం ప్రశంసలు కురిపిస్తున్నారు.


"ఈరోజు నేను పనికి వెళ్లి సంపాదించిన ఈ 600 రూపాయలను విజయవాడ వరద బాధితులకు కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయనిధికి పంపిస్తున్నాను. ఆదివారం పని ఉంది. ఆ డబ్బులు కూడా పంపిస్తాను. పవన్ కళ్యాణ్ గారు నాకు స్ఫూర్తి. కష్టాలన్నవి అందరికీ వస్తూ ఉంటాయి. ఆ కష్టం ఏంటన్నది కష్టపడిన వాడికి మాత్రమే తెలుస్తుంది" అంటూ గుడవర్తి సుబ్రమణ్యం అనే వ్యక్తి ట్వీట్ చేశాడు. ఇక ఈ ట్వీట్‌కు డిప్యూటీ సీఎంవో కార్యాలయం సైతం స్పందించింది. ఈ ట్వీట్‌కు రిప్లై ఇచ్చింది.


" రోజువారీ కష్టం చేసుకుంటూ సంపాదించిన మీ కష్టార్జితం నుంచి వరద బాధితులకు సహాయం అందించాలనుకున్న మీ ఆలోచన స్ఫూర్తిదాయకం. ఆపదలో ఉన్నవారికి మనస్ఫూర్తిగా ఇచ్చే ప్రతీ రూపాయి విలువైనది, అది చిన్నది అని సంకోచించే వారికి ఇది ఒక ప్రేరణ . నిస్వార్ధంగా ప్రజల కష్టాల కోసం ఆలోచించి ముఖ్యమంత్రి సహాయనిధికి అందించిన 600 రూపాయలు చాలా విలువైనవి. మీకు హృదయపూర్వక ధన్యవాదాలు" పవన్ కళ్యా్ణ్ తరుఫున డిప్యూటీ సీఎంవో ట్వీట్ చేసింది. మరోవైపు ఈ ట్వీట్లు వైరల్ కావటంతో నెటిజనం స్పందిస్తున్నారు.సాయం చేయాలనే ఉద్దేశం ఉండాలే కానీ.. చిన్నా, పెద్దా తేడాలేదంటున్నారు. ఆపద వచ్చినప్పుడు ఆదుకోవాలనే ఉద్దేశంతో చేసే ప్రతి చిన్న సాయం ఎంతో విలువైనదంటూ సుబ్రమణ్యాన్ని మెచ్చుకుంటున్నారు.


ఇక పవన్ కళ్యాణ్ సైతం వ్యక్తిగతంగా వరదలతో ఇబ్బందులు పడుతున్న తెలుగు రాష్ట్రాలకు విరాళం ప్రకటించారు. ఏపీ, తెలంగాణకు చెరో కోటి చొప్పున విరాళం ప్రకటించిన పవన్ కళ్యాణ్.. ఏపీలో వరదలతో దెబ్బతిన్న 400 గ్రామ పంచాయతీలకు సైతం లక్ష చొప్పున విరాళం ప్రకటించారు. ఈ నాలుగు కోట్లను రేపు సాయంత్రం పంచాయతీలకు అందించనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com