ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కొడుకు, మనవడితో కలిసి ఉన్న,,,,మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి ఫోటో వైరల్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Sep 08, 2024, 07:36 PM

తెలుగు రాష్ట్రాల రాజకీయాల గురించి కనీస అవగాహన ఉన్నవారికి జేసీ బ్రదర్స్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తాడిపత్రి అంటే జేసీ ఫ్యామిలీగా.. జేసీ అంటే తాడిపత్రిగా జేసీ కుటుంబం రాజకీయంగా ఓ వెలుగు వెలిగింది. మరీ ముఖ్యంగా జేసీ బ్రదర్స్‌లో పెద్దవాడైన జేసీ దివాకర్ రెడ్డి.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. కాంగ్రెస్ తరుఫున వరుసగా ఎమ్మెల్యేగా గెలుపొందుతూ.. మంత్రిగానూ పనిచేశారు. అయితే జేసీ దివాకర్‌రెడ్డికి సంబంధించిన ఓ తాజా ఫోటో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. జేసీ దివాకర్ రెడ్డి సోదరుడు.. తాడిపత్రి మున్సిపాలిటీ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఈ ఫోటోను ఎక్స్ వేదికగా పంచుకున్నారు. కుమారుడు జేసీ పవన్ కుమార్ రెడ్డి, మనవడితో కలిసి దివాకర్ రెడ్డి ఉన్న ఈ ఫోటో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. దీనిని చూసిన నెటిజనం.. జేసీ ఏంటి ఇలా మారిపోయారంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.


  వైట్ అండ్ వైట్ డ్రెస్సులో.. నల్లటి గ్లాసెస్ ధరించి గంభీరంగా కనిపించే జేసీ దివాకర్ రెడ్డి.. ప్రస్తుతం నడవడానికి కూడా ఇబ్బంది పడుతున్నట్లు తెలిసింది. మరోవైపు జేసీకి వయసు పెరగటంతో పాటుగా జ్ఞాపక శక్తి కూడా తగ్గినట్లు సన్నిహితులు చెప్తున్నారు. ఏదేమైనా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన జేసీ దివాకర్ రెడ్డి.. ఇలా మారిపోయారేంటీ అంటూ చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు 1985 నుంచి తాడిపత్రి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరుఫున ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు జేసీ దివాకర్ రెడ్డి. మంత్రిగానూ పనిచేశారు. అయితే రాష్ట్ర విభజన తర్వాత 2014 ఎన్నికలకు ముందు జేసీ ఫ్యామిలీ టీడీపీలో చేరింది. 2014 ఎన్నికల్లో జేసీ దివాకర్ రెడ్డి అనంతపురం ఎంపీగా టీడీపీ నుంచి పోటీచేసి గెలుపొందగా.. జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి ఎమ్మెల్యేగా గెలుపొందారు.


ఇక 2019 ఎన్నికల్లో జేసీ ఫ్యామిలీ నుంచి వారి వారసులు బరిలోకి దిగారు. తాడిపత్రి అసెంబ్లీ నుంచి జేసీ ప్రభాకర్ రెడ్డి తనయుడు జేసీ అస్మిత్ రెడ్డి.. అనంతపురం ఎంపీ స్థానం నుంచి జేసీ దివాకర్ రెడ్డి తనయుడు జేసీ పవన్ కుమార్ రెడ్డి పోటీ చేశారు. అయితే వైఎస్ జగన్ హవాలో ఇద్దరూ ఓటమి పాలయ్యారు. ఇక 2024 ఎన్నికల్లో టీడీపీ అధిష్టానం కుటుంబంలో ఒకరికే టికెట్ అనే విధానానికి కట్టుబడటంతో.. తాడిపత్రి నుంచి జేసీ అస్మిత్ రెడ్డికి మాత్రమే అవకాశం దక్కింది. ఈ ఎన్నికల్లో జేసీ అస్మిత్ రెడ్డి.. కేతిరెడ్డి పెద్దారెడ్డిపై విజయం సాధించారు. మరోవైపు పోటీ చేసేందుకు అవకాశం దక్కని జేసీ దివాకర్ రెడ్డి తనయుడు జేసీ పవన్ రెడ్డికి నామినేటెడ్ పదవి దక్కుతుందనే ప్రచారం జరుగుతోంది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com