ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పారిస్ ఒలింపిక్స్‌ 2024... ఐర్లాండ్‌ను ఓడించిన భారత హాకీ టీమ్

sports |  Suryaa Desk  | Published : Tue, Jul 30, 2024, 07:53 PM

పారిస్ ఒలింపిక్స్‌ 2024లో భారత హాకీ టీమ్ రెండో విజయాన్ని నమోదు చేసింది. పూల్-బీలో భాగంగా మంగళవారం జరిగిన మ్యాచ్‌లో భారత్ 2-0తో ఐర్లాండ్‌ను చిత్తు చేసింది.కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్(11వ నిమిషం, 19వ నిమిషం) రెండు గోల్స్‌తో భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు.సోమవారం మాజీ ఛాంపియన్ అర్జెంటీనాతో తృటిలో ఓటమిని తప్పించుకున్న భారత్.. ఐర్లాండ్‌తో మాత్రం పూర్తి ఆధిపత్యం చెలాయించింది. మ్యాచ్ ఆరంభం నుంచే ప్రత్యర్థి గోల్ పోస్ట్‌పై ఎదురు దాడికి దిగింది. ముఖ్యంగా ఐర్లాండ్ ఫీల్డ్ పొజిషన్స్‌ను ఇండియా అడ్వాంటేజ్‌గా మార్చుకుంది. గ్యాప్స్‌ను ఉపయోగించుకుంటూ వరుస క్వార్టర్స్‌లో గోల్స్ మోత మోగించింది.


ఫస్ట్ క్వార్టర్ 11వ నిమిషంలో హర్మన్‌ప్రీత్ సింగ్ పెనాల్టీ స్ట్రోక్‌తో భారత్ ఖాతా తెరిచాడు. గుజ్రాంత్ సింగ్ అద్భుతంగా బంతిని మన్‌దీప్ సింగ్‌కు పాస్ ఇవ్వగా.. ప్రత్యర్థి ఆటగాడు కాస్త కఠినంగా వ్యవహరించాడు. దాంతో భారత్‌కు పెనాల్టీ స్ట్రోక్ దక్కగా..హర్మన్‌ప్రీత్ సింగ్ ఎలాంటి తప్పిదం చేయకుండా గోల్ పోస్ట్‌లోకి పంపాడు.


 


రెండో క్వార్టర్స్‌లో లభించిన పెనాల్టీ కార్నర్‌ను భారత్ చేజార్చుకుంది. 19వ నిమిషంలో పెనాల్టీ కార్నర్‌ను హర్మన్‌ప్రీత్ గోల్‌గా మలిచి భారత్ ఆధిక్యాన్ని 2-0తో డబుల్ చేశాడు. అనంతరం ఇరు జట్లు హోరా హోరీగా తలపడ్డాయి. దాంతో ఫస్టాఫ్ ముగిసే సరికి భారత్ 2-0తో లీడ్‌లో నిలిచింది. ఆ తర్వాత ఐర్లాండ్ బంతిని తమ నియంత్రణలో ఉంచుకోని భారత గోల్ పోస్ట్‌పైకి దాడి చేసింది.


 


హర్మన్‌ప్రీత్ కౌర్‌కు రిఫరీ గ్రీన్ కార్డ్ చూపించడంతో అతను మైదానం వీడాడు. ఇది భారత్‌ను కాస్త గందరగోళానికి గురి చేసింది. కానీ ఐర్లాండ్ గోల్స్ సాధించలేకపోయింది. చివరి రెండు క్వార్టర్స్‌లో ఇరు జట్లు తమకు లభించిన పెనాల్టీ కార్నర్‌లను వృథా చేసుకున్నాయి. చివరి వరకు ఆధిక్యాన్ని కొనసాగించిన భారత్.. విజయలాంఛనాన్ని పూర్తి చేసింది.


 


ఈ గెలుపుతో భారత్ క్వార్టర్ ఫైనల్ అవకాశాలను మెరుగుపరుచుకుంది. పూల్-బీలో మొత్తం 6 జట్లు ఉండగా.. టాప్-4లో నిలిచిన జట్లు క్వార్టర్ ఫైనల్ చేరుతాయి. మూడు మ్యాచ్‌ల్లో రెండు విజయాలు, ఓ డ్రాతో భారత్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. ఆస్ట్రేలియా, బెల్జియం తర్వాతి స్థానాలు ఉన్నాయి. చివరి రెండు మ్యాచ్‌ల్లో భారత్ ఒక్క మ్యాచ్ గెలిచినా.. క్వార్టర్స్‌కు అర్హత సాధిస్తోంది. భారత్ తమ తదుపరి మ్యాచ్‌లో బెల్జియంతో తలపడనుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com