ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుమల వెళ్లే ఆ రైలు 6 రోజులు రద్దు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jul 30, 2024, 07:44 PM

తిరుమల ఎక్స్‌ప్రెస్ రైలును భారతీయ రైల్వే రద్దు చేసింది. ఆరు రోజుల పాటు తిరుమల ఎక్స్‌ప్రెస్ రైలును రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. విజయవాడ డివిజన్‌లోని మూడో లైన్‌లో జరుగుతున్న పనుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇదే సమయంలో మరి కొన్ని రైళ్లను కూడా దారి మళ్లించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఇలా దారి మళ్లించిన రైళ్లు విజయవాడ రైల్వే స్టేషన్‌లో ఆగవని వెల్లడించారు. తిరుమల ఎక్స్‌ప్రెస్ రెలు ప్రతి రోజూ విశాఖపట్నం నుంచి బయల్దేరి తిరుపతి మీదుగా కడపకు వెళ్తుంది.


17488 రైలు నంబరుతో నడిచే తిరుమల ఎక్స్‌ప్రెస్ రైలు సర్వీసు ప్రతి రోజూ మధ్యాహ్నం రెండు గంటలకు విశాఖపట్నం నుంచి బయల్దేరుతుంది. దువ్వాడ, అనకాపల్లి, ఎలమంచిలి, నర్సీపట్నం, తుని, అన్నవరం, పిఠాపురం, సామర్లకోట, అనపర్తి, ద్వారంపూడి, రాజమండ్రి, నిడదవోలు, తాడేపల్లి గూడెం, భీమడోలు, ఏలూరు, నూజివీడు, విజయవాడ జంక్షన్, తెనాలి, నిడుబొర్లు, బాపట్ల, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు, వెంకటగిరి, శ్రీకాళహస్తి, తిరుపతి, రేణిగుంట, కోడూరు, రాజంపేట, నందలూరు మీదుగా మరుసటి రోజు ఉదయం ఏడున్నరకు కడపకు చేరుకుంటుంది. అయితే మూడో లైన్‌లో జరుగుతున్న పనుల కారణంగా ఈ రైలును ఆగస్ట్ 5 నుంచి ఆగస్ట్ 10 వరకూ ఆరు రోజుల పాటు రద్దు చేశారు.


అలాగే 17487 నంబరుతో కడప నుంచి విశాఖకు వెళ్లే సర్వీసును కూడా ఆగస్ట్ 6 నుంచి ఆగస్ట్ 11 వరకు రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ విషయాన్ని ప్రయాణికులు గమనించాలని సూచించారు. అలాగే ఈ మార్గంలో ఇప్పటికే ఆయా రోజుల్లో రిజర్వేషన్లు చేసుకున్న ప్రయాణికులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుంది. ఇక తిరుమల ఎక్స్‌ప్రెస్ రైలు రద్దుతో పాటుగా మరో ఏడు రైళ్లను దారి మళ్లించారు. వైజాగ్- హైదరాబాద్ మధ్య నడితే గోదావరి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, వైజాగ్- ఢిల్లీ మధ్య తిరిగే ఎక్స్‌ప్రెస్ సర్వీసులు తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ రైల్వే స్టేషన్‌లలో అందుబాటులో ఉండవని తెలిపారు.


అలాగే లోకమాన్య తిలక్ ఎక్స్‌ప్రెస్, వైజాగ్ -హజ్రత్ నిజాముద్దీన్ మధ్యన నడిచే స్వర్ణజయంతి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, వైజాగ్- సికింద్రాబాద్ గరీబ్‌రాథ్ ఎక్స్‌ప్రెస్, విశాఖపట్నం- గాంధీధామ్ మధ్యన నడిచే వీక్సీ సూపర్ ఫాస్ట్ రైలు, విశాఖపట్నం-సాయినగర్ షిరిడీ ఎక్స్‌ప్రెస్ విజయవాడ రైల్వే స్టేషన్లలో ఆగవని తెలిపారు.ఈ విషయాన్ని రైల్వే ప్రయాణికులు గమనించాలని రైల్వే శాఖ తెలిపింది. ముందుగా ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకుని ఉంటే.. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com