ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కటింగ్‌ చేసుకొని నీట్‌గా కన్పించాలి.. శ్రీలంక కోచ్‌ జయసూర్య

sports |  Suryaa Desk  | Published : Thu, Jul 25, 2024, 11:20 PM

భారత్‌-శ్రీలంక ద్వైపాక్షిక సిరీస్‌కు ముందు మాట్లాడిన శ్రీలంక క్రికెట్ జట్టు తాత్కాలిక కోచ్‌ సనత్‌ జయసూర్య.. ఆసక్తి కర విషయాలు వెల్లడించాడు. ప్రపంచంలోని అత్యుత్తమ క్రికెటర్లలో ఈ ఇద్దరూ తప్పకుండా ఉంటారని కితాబిచ్చాడు. శ్రీలంక భారత్‌ల మధ్య ఈ నెల 27నుంచి టీ20 సిరీస్‌ ప్రారంభం కానుంది. ఆ తర్వాత వన్డే సిరీస్‌ జరగనుంది. ఇప్పటికే భారత టీ20 జట్టు శ్రీలంక గడ్డపై అడుగుపెట్టింది. ఇక శ్రీలంక కూడా తమ టీ20 జట్టును ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆ జట్టు తాత్కాలిక కోచ్‌, శ్రీలంక దిగ్గజ క్రికెటర్‌ సనత్‌ జయసూర్య సిరీస్‌ గురించి మాట్లాడాడు.


 టీ20 ప్రపంచకప్‌ 2024 టైటిల్ సాధించిన తర్వాత టీమిండియా ప్లేయర్లు రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ, రవీంద్ర జడేజా వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన జయసూర్య.. ఈ ముగ్గురు అనుభవజ్ఞులైన ఆటగాళ్లు లేని అవకాశాన్ని శ్రీలంక టీమ్‌ సద్వినియోగం చేసుకోవాలని తమ జట్టు ఆటగాళ్లకు సూచించాడు. “రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ, రవీంద్ర జడేజాలు ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటగాళ్లు. వాళ్ల ప్రతిభ ఏంటో అందరికీ తెలుసు. ప్రస్తుతం వాళ్లు భారత టీ20 జట్టులో లేరు. దీన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. వీలైనంత ప్రయోజనం పొందాలి” అని శ్రీలంక జట్టు ఆటగాళ్లకు జయసూర్య సూచించాడు.


ఇదే సమయంలో శ్రీలంక ఆటగాళ్లకు క్రమశిక్షణ పాఠాలు చెప్పాడు. జట్టులోని ఆటగాళ్లంతా ప్రాపర్‌ హెయిర్‌కట్‌ చేయించుకోవాలని, నీట్‌గా ఉండాలని జయసూర్య సూచించాడు. క్రికెట్‌ను జెంటిల్మెన్‌ గేమ్‌గా కొనసాగించాలంటే ఆటగాళ్లలో క్రమశిక్షణ అవసరమని జయసూర్య స్పష్టం చేశాడు. తాను తాత్కాలిక కోచ్‌ మాత్రమేనని అయినా.. తన పదవీ కాలంలో ఆటగాళ్ల నుంచి క్రమశిక్షణను ఆశిస్తున్నట్లు పేర్కొన్నాడు. ఆటగాళ్లను క్రికెట్‌ అభిమానులు ప్రేమిస్తారని, అనుకరిస్తారని.. అన్నీ గమనిస్తారని చెప్పుకొచ్చాడు.


కాగా శ్రీలంక యువ క్రికెటర్లలో క్రమశిక్షణ పెంపొందించేందుకు సనత్‌ జయసూర్య చేస్తున్న ప్రయత్నాలను ఆ దేశ క్రీడల శాఖ మంత్రి ఫెర్నాండో సమర్థించాడు. దేశం తరఫున ఆడే ఆటగాళ్లకు క్రమశిక్షణ, నిరాడంబరత ఫెర్నాండో వ్యాఖ్యానించారు. కాగా లంక పర్యటనలో టీమిండియా మొదట మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్, ఆ తర్వాత మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడనుంది. జులై 27-30 వరకు టీ20 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఆగస్టు 2, 4, 7 తేదీల్లో వన్డే సిరీస్‌ జరుగుతుంది. సిల్వర్‌ వుడ్‌ రాజీనామాతో భారత్‌తో సిరీస్‌లతో పాటు సెప్టెంబర్‌ నెలలో శ్రీలంక చేపట్టబోయే ఇంగ్లాండ్‌ పర్యటనకు జయసూర్య తాత్కాలిక కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్నాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com