ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు విద్యార్థులకు అసెంబ్లీ సమావేశాలను చూసే అవకాశం కల్పించారు. రేపటి పౌరులైన విద్యార్థులు.. చట్టసభలు ఎలా పనిచేస్తాయనే దానిపై అవగాహన పెంచుకునేందుకు గానూ వారు అసెంబ్లీ సమావేశాలను ప్రత్యక్షంగా చూసేందుకు స్పీకర్ అయ్యన్నపాత్రుడు అవకాశం కల్పించారు. స్పీకర్ నిర్ణయం మేరకు ప్రతిరోజూ వందమంది విద్యార్థులను అసెంబ్లీ సమావేశాలు చూడటానికి అనుమతిస్తున్నారు. సోమవారం ( జులై 22) నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో సోమవారం నుంచి ప్రతిరోజూ వందమంది విద్యార్థులను సమావేశాలు చూడ్డానికి అనుమతిస్తున్నారు.
గడిచిన మూడు రోజులుగా వివిధ కాలేజీలకు చెందిన విద్యార్థులు ఏపీ అసెంబ్లీ సమావేశాలను ప్రత్యక్షంగా వీక్షించారు. గురువారం కూడా రాజమండ్రి ఆర్ట్స్ కాలేజ్ విద్యార్థినీ విద్యార్థులు వంద మంది.. అసెంబ్లీ సమావేశాలను వీక్షించారు. అనంతరం ఈ అనుభూతి కొత్తగా ఉందని విద్యార్థులు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. అసెంబ్లీ, పార్లమెంట్ సమావేశాలను టీవీల్లో చూడటం తప్ప.. ప్రత్యక్షంగా చూడలేదని.. తొలిసారిగా ఇలా చూడటం చాలా సంతోషంగా ఉందన్నారు. అలాగే ఈ అవకాశం కల్పించినందుకు స్పీకర్ అయ్యన్నపాత్రుడికి ధన్యవాదాలు తెలియజేశారు.
బీజేపీ శాసనసభాపక్ష నేతగా విష్ణుకుమార్ రాజు
మరోవైపు ఏపీ అసెంబ్లీలో భారతీయ జనతా పార్టీ శాసనసభాపక్ష నేతగా విష్ణుకుమార్ రాజు ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రకటించారు. బీజేపీ విప్గా జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డిని, బీజేపీ ఫ్లోర్ లీడర్గా విష్ణుకుమార్ రాజు పేర్లను ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి లేఖ ద్వారా పంపినట్లు అయ్యన్నపాత్రుడు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆ పదవులకు వారిద్దరి పేర్లను ప్రకటిస్తు్న్నట్లు చెప్పారు. మరోపు ఏపీఅసెంబ్లీలో ఆరుగురు ప్యానెల్ స్పీకర్ల పేర్లను కూడా అయ్యన్నపాత్రుడు ప్రకటించారు. ఎమ్మెల్యేలు వరదరాజులరెడ్డి, జ్యోతుల నెహ్రూ, కోళ్ల లలితకుమారి, దాసరి సుధ, పి. విష్ణుకుమార్ రాజు. మండలి బుద్ధప్రసాద్లను ప్యానెల్ స్పీకర్లుగా నియమించారు.