రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రస్తుతం కూరగాయల ధరలు కొండెక్కి కూర్చుకున్నాయి. మరీ ముఖ్యంగా బయట మార్కెట్లో కిలో టమాటా 80 నుంచి 100 వరకూ పలుకుతోంది. దీంతో టమాటాను ఎలా కొనాల్రా దేవుడా అంటూ సగటు మధ్యతరగతి జీవి ఆలోచించాల్సిన పరిస్థితి వస్తోంది. దీంతో ప్రజలకు ఉపశమనం కల్పించేందుకు ప్రభుత్వం పలు రైతుబజార్లలో సబ్సిడీ ధరకు టమాటాలను అందుబాటులో ఉంచింది. ఈ క్రమంలోనే విశాఖపట్నంలో టమాటాల కోసం స్థానికులు తెల్లవారుజామునే రైతుబజార్లకు క్యూకట్టారు. విశాఖపట్నంలోని రైతు బజార్ల వద్ద ఉదయం ఆరింటి నుంచే జనం బారులు తీరారు.
టమాటా రేట్లు భారీగా పెరిగిన నేపథ్యంలో కిలో టమాటా రూ.48 లకే అందిస్తోంది మార్కెటింగ్ శాఖ. విశాఖపట్నంలోని 13 రైతు బజార్లలోనూ సబ్సిడీపై టమాటాలను విక్రయిస్తున్నారు. దీంతో రైతుబజార్లలోని సబ్సిడీ టమాటా కౌంటర్ల వద్ద జనం క్యూ కట్టారు. ఉదయం ఆరింటి నుంచే కౌంటర్ల వద్ద కోలాహలం మొదలైంది. సబ్సిడీ రేట్ల మీద ఒక్కొక్కరికి రెండు కిలోల చొప్పున అధికారులు టమాటాలను విక్రయిస్తున్నారు. బహిరంగ మార్కెట్లో టమాటా రేట్లు తగ్గేవరకు ప్రత్యేక కౌంటర్ల ద్వారా మార్కెటింగ్ శాఖ ద్వారా సబ్సిడీ మీద టమాటాలు విక్రయించనున్నట్లు అధికారులు తెలిపారు.
మరోవైపు గత వారం, పదిరోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కొంతమేర పంట నష్టం జరిగింది. అలాగే వానల కారణంగా పంటకోత, మార్కెట్లకు తరలింపులోని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో బహిరంగ మార్కెట్లో టమాటాకు డిమాండ్ పెరిగింది. అయితే డిమాండ్కు అనుగుణంగా సరఫరా, ఉత్పత్తి లేకపోవటంతో టమాటా ధర కొండెక్కి కూర్చుంది. మరికొన్ని రోజులు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉన్నట్లు మార్కెటింగ్ శాఖ అధికారులు చెప్తున్నారు. మరోవైపు ప్రజలు కూడా సబ్సిడీ విధానాన్ని మరికొన్ని రోజులు కొనసాగించాలని కోరుతున్నారు. అలాగే ధరలు తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.