ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చంద్రబాబు ఫ్యామిలీ స్టాక్ .. తొలిసారి వెయ్యి కోట్ల ఆదాయం

business |  Suryaa Desk  | Published : Wed, Jul 24, 2024, 10:18 PM

ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఇటీవల ఎన్నికల్లో ఘనవిజయం సాధించగా ఆయన స్థాపించిన హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్.. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి త్రైమాసికం (ఏప్రిల్- జూన్) ఫలితాల్ని వెల్లడించింది. గతంలో కంటే ఈసారి ఆకర్షణీయ స్థాయిలో ఫలితాలు నమోదు చేయడం విశేషం. సమీక్షా త్రైమాసికంలో ఆదాయం 11.8 శాతం పెరిగి రూ. 1019.59 కోట్లుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో చూస్తే ఇది రూ. 913.31 కోట్లుగా ఉంది. ఈ త్రైమాసికంలో నికర లాభం ఏకంగా 249.04 శాతం పెరిగి రూ. 58.43 కోట్లుగా వచ్చింది. అంతకుముందు ఇదే సమయంలో లాభం రూ. 16.74 కోట్లుగా ఉండేది. ఇక సంస్థ ఏదైనా త్రైమాసికంలో ఆదాయం రూ. 1000 కోట్లకుపైగా నమోదు చేయడం ఇదే తొలిసారి కావడం విశేషం.


విలువ ఆధారిత ప్రొడక్ట్స్ విభాగంలో 19.9 శాతం మేర వృద్ధి నమోదైంది. ఇక పాల సేకరణ 6.66 శాతం, పాల అమ్మకాలు 4.26 శాతం పెరిగినట్లు తెలిపింది కంపెనీ. దీని సబ్సిడరీ కంపెనీ అయిన హెరిటేజ్ న్యూట్రివెట్ లిమిటెడ్ ఆదాయం 29 శాతం పెరిగి రూ. 42.2 కోట్లకు చేరింది. హెరిటేజ్ ఫుడ్స్ ఫలితాలపై సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, చంద్రబాబు నాయుడు కోడలు నారా బ్రాహ్మణి స్పందించారు. గత కొంతకాలంగా చేపట్టిన చర్యలు తమకు సత్ఫలితాలు ఇస్తున్నాయని.. రాబోయే రోజుల్లో కూడా ఇదే రీతిన మెరుగైన పనితీరు ప్రదర్శిస్తామని అన్నారు. ఇంకా పాల సేకరణ, ఉత్పత్తి సహా పంపిణీ వ్యవస్థల్ని బలోపేతం చేసినందుకే మంచి ఫలితాలు వస్తున్నాయని వివరించారు. ఇదే క్రమంలో రానున్న పండగల సీజన్‌కు అన్ని రకాలుగా సిద్ధమవుతున్నట్లు స్పష్టం చేశారు.


హెరిటేజ్ ఫుడ్స్ కంపెనీని 1992, జూన్ 5న ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్థాపించారు. అధ్యక్షుడిగా ఎం. సాంబశివరావు ఉన్నారు. హైదరాబాద్‌లో సంస్థ ప్రధాన కార్యాలయం ఉంది. ఇది దక్షిణ భారతదేశంలోని ప్రైవేట్ రంగానికి చెందిన అతిపెద్ద డెయిరీ సంస్థల్లో ఒకటిగా ఉంది. చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి వైస్ ఛైర్‌పర్సన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు.


ప్రస్తుతం హెరిటేజ్ కంపెనీ పాలు సహా ఇతర పాల ఉత్పత్తులు.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటుగా కర్ణాటక, కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, ఒడిశా, ఎన్‌సీఆర్ ఢిల్లీ, హరియాణా, రాజస్థాన్, ఉత్తరాఖండ్, ఉత్తర్‌ప్రదేశ్‌లకు కూడా వెళ్తున్నాయి. కంపెనీకి 3 వేలకుపైగా ఉద్యోగులు ఉన్నారు. పాలు, పెరుగు, ఐస్‌క్రీమ్, స్వీట్లు, బటర్ మిల్క్, ఫ్లేవర్డ్ మిల్క్, స్కిమ్ మిల్క్ పౌడర్ వంటి ప్రొడక్ట్స్ తయారు చేస్తుంది.


ఇక హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ 1994లో పబ్లిక్ లిస్టింగ్ కంపెనీగా అవతరించింది. అప్పుడు ఏకంగా 54 రెట్ల మేర సబ్‌స్క్రిప్షన్ జరిగింది. బడ్జెట్ రోజున జులై 23న ఫలితాలు రాగా.. అదే రోజు స్టాక్ 5 శాతం అప్పర్ సర్క్యూట్ కొట్టింది. ఇవాళ కూడా దూసుకెళ్తోంది. ప్రస్తుతం వార్త రాసే సమయంలో 4 శాతం పెరిగి రూ. 598 వద్ద ఉంది. మార్కెట్ విలువ రూ. 5.58 వేల కోట్లుగా ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com