ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దక్షిణ కొరియా అధ్యక్ష భవనంపైకి చెత్త బెలూన్లు,,,అమెరికాతో కయ్యానికి కాలుదువ్వుతోన్న కిమ్ జోంగ్ ఉన్

international |  Suryaa Desk  | Published : Wed, Jul 24, 2024, 10:10 PM

దక్షిణ కొరియాతో నిరంతరం కయ్యానికి కాలుదువ్వే ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్.. గత కొద్ది రోజుల నుంచి చెత్తను బెలూన్లతో దాయాది దేశంపైకి పంపుతూ కయ్యానికి కాలుదువ్వుతున్నారు. ఇదిలావుంటే కొరియా ద్వీప కల్పం.. 1945లో ఉత్తర కొరియా, దక్షిణ కొరియా అనే రెండు దేశాలుగా విడిపోయిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఈ రెండు దేశాల మధ్య వైరం కొనసాగుతోంది. రష్యాకు అనుకూలంగా ఉండే ఉత్తర కొరియాలో నియంతృత్వం కొనసాగుతుండగా.. ప్రజాస్వామ్య దేశమైన దక్షిణ కొరియా అమెరికా మద్దతుతో అభివృద్ధిలో దూసుకెళ్తోంది. ఇప్పటికీ రెండు కొరియాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి.


అయితే దేశం విడిపోయినా.. తామంతా ఒకటేననే భావన కొరియనల్లో ఉంది. అందుకే దక్షిణ కొరియా వాసులు.. నియంత పాలనలో అనేక ఆంక్షలను ఎదుర్కొంటున్న ఉత్తర కొరియన్లలో చైతన్యం నింపే ప్రయత్నం చేస్తుంటారు. సరిహద్దుల్లో ఉత్తర కొరియా సైనికులు డేగ కళ్లత కాపలా కాస్తుంటారు. కాబట్టి సౌత్ కొరియన్లు తెలివిగా బెలూన్ల సాయంతో కొరియన్ పాప్ సాంగ్స్, సందేశాలను పంపిస్తుంటారు. ఈ బెలూన్లు కొన్ని ఉత్తర కొరియా సైన్యానికి చిక్కడంతో విషయం కిమ్‌ దాకా వెళ్లింది.


సౌత్ కొరియాకు బుద్ధి చెప్పడం కోసం నార్త్ కొరియా కూడా బెలూన్ల దాడిని ప్రారంభించింది. అయితే సౌత్ కొరియన్లలా పాప్ సాంగ్స్, రెచ్చగొట్టే సందేశాలు పంపించడం కాకుండా.. చిత్తు కాగితాలు, సిగరెట్ పీకలు, చిరిగిపోయిన దుస్తులు మొదలు పశువుల పెంటను సైతం ఇలా బెలూన్లకు కట్టి పంపించడం మొదలుపెట్టింది.


ఉత్తర, దక్షిణ కొరియాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గమనే పరిస్థితి. దక్షిణ కొరియాతో నిరంతరం కయ్యానికి కాలుదువ్వే ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్.. గత కొద్ది రోజుల నుంచి చెత్తను బెలూన్లతో దాయాది దేశంపైకి పంపుతున్నారు. తాజాగా, దక్షిణ కొరియా అధ్యక్ష కార్యాలయంపైనే ఈ బెలూన్లను జారవిడవటం గమనార్హం. దీని వల్ల ఎలాంటి నష్టం వాటిల్లలేదని, వీటి రాక గురించి దక్షిణ కొరియా సైన్యం ముందే పసిగట్టిందని స్థానిక మీడియా కథనాలు పేర్కొన్నారు. దక్షిణ కొరియా అధ్యక్ష కార్యాలయం యాంగ్‌సన్ ప్రాంగణంలో బుధవారం చెత్తతో ఉన్న బెలూన్లు వచ్చిపడ్డాయి. అయితే, ముందుజాగ్రత్త చర్యగా పీపీఈ కిట్లు ధరించిన సిబ్బంది ఆ చెత్తను తొలగించారు.


సియోల్ ఉత్తరం వైపు బెలూన్లు ఎగురుతున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని దక్షిణ కొరియా జాయింట్ చీఫ్స్‌ ఆఫ్ స్టాఫ్ హెచ్చరికలు చేసింది. అమెరికా, దక్షిణ కొరియాల మధ్య బలమైన సంబంధాలు.. ఉత్తర కొరియాను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇరు దేశాల మైత్రిపై గుర్రుగా ఉన్న కిమ్.. బెలూన్లతో గత కొద్దికాలంగా కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు. అలాగే దక్షిణ కొరియా తమ భూభాగంలో కరపత్రాలు పంపుతున్నందుకు ప్రతీకారంగా సియోల్‌లోకి ‘చెత్త’ బెలూన్లను పంపుతోంది.


వాడి పడేసిన ప్లాస్టిక్‌ బాటిళ్లు, బ్యాటరీలు, పాడైన షూలు, కాగితాలతో కూడిన చెత్త. కొన్ని బెలూన్లలో మురుగుమట్టి, జంతు మలవిసర్జన కూడా ఉండటం గమనార్హం. 2016లోనూ ఇలా కిమ్‌ సర్కారు బెలూన్లను పంపగా.. వాటి కారణంగా దక్షిణ కొరియా కొన్ని కార్లు, ఆస్తులకు నష్టం వాటిల్లింది.


గత మే నెల నుంచి ఇప్పటి దాకా పదిసార్లు నార్త్ కొరియా ఇలా బెలూన్లతో పొరుగు దేశం మీద దాడి చేసింది. ఇప్పటి వరకూ ఏకంగా 2 వేల బెలూన్లను పొరుగు దేశం మీదకు వదిలింది. జూన్ నెలలో నార్త్ కొరియా పంపిన బెలూన్ల కారణంగా సియోల్ ఎయిర్‌పోర్టును మూసివేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఏకంగా సియోల్‌లోని సౌత్ కొరియా అధ్యక్ష భవనం మీదికి చెత్త నింపిన బెలూన్లను పంపించింది. ఈ బెలూన్లు సహా.. ఇప్పటి దాకా నార్త్ కొరియా బెలూన్లను పరిశీలించిన సౌత్ కొరియా సైన్యం వాటిల్లో చెత్త తప్పితే.. ఎలాంటి హానికర పదార్థాలు లేవని తేల్చింది.


సౌత్ కొరియా రాజధాని సియోల్ నగరం ఉత్తర కొరియా బోర్డర్‌కు కేవలం 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దీంతో కిమ్ అండ్ కో ఏకంగా అధ్యక్ష భవనాన్ని టార్గెట్ చేసుకుంది. ఇంతకూ ఈ చెత్త బెలూన్ల గోలేంటని అనుకుంటున్నారా..? ‘చూశావా యూన్.. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉన్న నీ నివాసంలోకి కూడా బెలూన్లను పంపించాం. ఇప్పటికైతే వాటిల్లో చెత్త మాత్రమే ఉంది. భవిష్యత్తులో ఏముంటుందో చెప్పలేం’ అని కిమ్ జోంగ్ ఉన్ సౌత్ కొరియా అధ్యక్షుణ్ని పరోక్షంగా హెచ్చరించినట్టే. మీ వైపు నుంచి బెలూన్లను పంపించడం ఆపకపోతే.. మా వైపు నుంచి బెలూన్లను పంపించడం ఆపబోం అని వార్నింగ్ ఇచ్చినట్టే..!






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com