ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మరోసారి ఛలో ఢిల్లీకి రైతులు.. సమస్యను పరిష్కరించాలని కేంద్రానికి సుప్రీంకోర్టు హితవు

national |  Suryaa Desk  | Published : Wed, Jul 24, 2024, 09:43 PM

పంటలకు మద్దతు ధర సహా తమ డిమాండ్ల పరిష్కారం కోసం ఛలో ఢిల్లీకి మరోసారి అన్నదాతలు సిద్ధమవుతున్నారు. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని పార్లమెంట్‌లో కలిసిన రైతు సంఘాల నాయకులు.. ఆందోళనలు చేపడతామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. సమస్యల పరిష్కారం కోసం ఆందోళన చేస్తున్న రైతులు, ప్రభుత్వానికి మధ్య విశ్వాసం లోపించినట్లు గమనించామని పేర్కొంది. వారి డిమాండ్ల పరిష్కారం కోసం ప్రభుత్వాలు కొన్ని చర్యలు తీసుకోవాలని అభిప్రాయపడింది. శంభూ సరిహద్దు వద్ద పరిస్థితుల హరియాణా ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.


 హరియాణ ప్రభుత్వం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేసింది.‘‘అన్నదాతల డిమాండ్లను నెరవేర్చేందుకు మీరు (కేంద్ర ప్రభుత్వం) కొన్ని చర్యలు చేపట్టాలి.. లేదంటే వారు ఢిల్లీకి ఎందుకు రావాలనుకుంటారు? ఇక్కడి నుంచి మీరు మంత్రులను పంపిస్తున్నారు సరే... కానీ, మీపై వారికి విశ్వాసం లోపించినట్లు కన్పిస్తోంది.. స్థానిక సమస్యలను విస్మరించి స్వప్రయోజనాల గురించి మాత్రమే మీరు చర్చిస్తున్నారని రైతులు భావిస్తున్నారు.. ఇలాంటి పరిస్థితుల్లో కర్షకులు, ప్రభుత్వం మధ్య విశ్వాసం కలిగించే ఓ తటస్థ అంపైర్‌ అవసరం... అలాంటి వ్యక్తిని మీరు ఎందుకు పంపడం లేదు?’’ అని కేంద్రాన్ని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భూయన్‌ల ధర్మాసనం ప్రశ్నించింది.


అంతేకాదు, రైతుల డిమాండ్ల పరిష్కారం కోసం ఓ స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేయాలని సూచించిన ధర్మాసనం.. ఇందులో సభ్యులుగా నియమించేవారి వివరాలను అందజేయాలని పంజాబ్‌, హరియాణా ప్రభుత్వాలను ఆదేశించింది. వారం రోజుల్లోగా దీనిపై నిర్ణయం తీసుకోవాలని, అప్పటిదాకా శంభూ సరిహద్దుల్లో యథాతథ స్థితిని కొనసాగించాలని ధర్మాసనం స్పష్టం చేసింది. సరిహద్దులోని బారికేడ్లను తొలగించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని రెండు రాష్ట్రాలను ఆదేశించింది.


తమ డిమాండ్ల పరిష్కారం కోసం అన్నదాతలు ఆందోళన చేపట్టడంతో హరియాణా అంబాలాకు సమీపంలోని శంభూ సరిహద్దు వద్ద ఏర్పాటుచేసిన బారికేడ్లను వారంలోగా తొలగించాలని ఇటీవల పంజాబ్‌-హరియాణా హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. ఈ ఉత్తర్వులను హరియాణా ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్‌ చేయడంతో... విచారణ జరిపి రాష్ట్ర ప్రభుత్వం తీరుపై అసహనం వ్యక్తం చేసింది.


ట్రాక్టర్లు, జేసీబీలు ప్రయాణంపై ఎందుకు నిషేధం విధించారని ప్రశ్నించగా.. వాటిని వర్చువల్ వార్ ట్యాంకులుగా మార్చారని సమాధానం ఇచ్చారు. అలాగే, సాయుధ వాహనాలకు సంబంధించి మా వద్ద ఆధారాలు ఉన్నాయని తెలిపారు. పంజాబ్ ప్రభుత్వం అటార్నీ జనరల్ గుర్మీందర్ సింగ్ వాదనలు వినిపిస్తూ.. హైవే దిగ్భంధంతో రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థను భారీగా ప్రభావితం చేసిందని అన్నారు. దీంతో ‘జాతీయ రహదారిని ఒక రాష్ట్రం ఎలా దిగ్బంధిస్తుంది? ట్రాఫిక్‌ను నియంత్రించడం దాని బాధ్యత.. హైవేను తెరవండి.. కానీ, రాకపోకలను నియంత్రించండి’ అని ధర్మాసనం పేర్కొంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com