ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తన మాజీ జట్టుకు కోచ్‌గా ,,,రీఎంట్రీ ఇవ్వనున్న ద్రవిడ్

sports |  Suryaa Desk  | Published : Tue, Jul 23, 2024, 10:35 PM

టీ20 ప్రపంచకప్‌ 2024తో టీమిండియా హెడ్‌కోచ్‌గా తన ప్రస్థానాన్ని ముగించిన రాహుల్ ద్రవిడ్‌.. మళ్లీ కోచ్‌గా మారనున్నాడా? అందుకోసం ఇప్పటికే ఐపీఎల్‌ ఫ్రాంఛైజీతో చర్చలు జరుపుతున్నాడా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. టీమిండియాకు టీ20 ప్రపంచకప్‌ టైటిల్‌ అందించిన, తమ జట్టు మాజీ ప్లేయర్‌, మాజీ మెంటార్‌ను కోచ్‌గా తెచ్చుకోవాలని రాజస్థాన్‌ రాయల్స్‌ భావిస్తోందని తెలుస్తోంది. ఇందుకోసం ఇప్పటికే చర్చలు సైతం ప్రారంభం అయినట్లు సమాచారం. కోచ్‌ పదవిపై ఇప్పటికే రాజ‌స్థాన్ రాయల్స్‌ యాజ‌మాన్యం రాహుల్‌ ద్రవిడ్‌తో చ‌ర్చ‌లు జ‌రిపిన‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. ద్ర‌విడ్ కూడా రాజస్థాన్‌ ఇచ్చిన ఆఫర్‌కు అంగీకరించినట్లు తెలుస్తోంది.


గతంలోనూ ద్రవిడ్‌ రాజస్థాన్ రాయల్స్‌తో కలిసి పని చేశాడు. 2011, 2012, 2013 సీజన్‌లలో మిస్టర్‌ డిపెండబుల్‌ ఆ జట్టు తరఫునే ఆడాడు. కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు. 2013లో అతడి సారథ్యంలోనే రాజస్థాన్ రాయల్స్ జట్టు ఛాంపియన్స్‌ లీగ్‌ టీ20 ఫైనల్‌, ఐపీఎల్‌ ప్లేఆఫ్స్‌ ఆడింది. 2012లో అంతర్జాతీయ క్రికెట్‌ కెరీర్‌కు గుడ్‌బై చెప్పిన ద్రవిడ్.. 2013లో ఐపీఎల్‌ నుంచి కూడా తప్పుకున్నాడు.


ఆ తర్వాత రెండు సీజన్ల పాటు అంటే ఐపీఎల్‌ 2014. 2015 సీజ‌న్ల‌లో రాజ‌స్థాన్ మెంటార్‌గా కూడా అతడు సేవ‌లు అందించాడు. ఆ తర్వాత ఢిల్లీ డేర్‌డెవిల్స్‌, అండర్‌-19, ఇండియా-ఏ కోచ్‌గా కూడా ఉన్నాడు. జాతీయ క్రికెట్‌ అకాడమీ ఛైర్మన్‌గా కూడా వ్యవహరించాడు. 2021లో టీమిండియా హెడ్‌ కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడు. ఇటీవల ఆ పదవి నుంచి తప్పుకున్న ద్రవిడ్.. మళ్లీ రాజస్థాన్‌ రాయల్స్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.


ఇక ప్రస్తుతం రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌కు కుమార సంగక్కర డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌తో పాటు కోచ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. ఒకవేళ ద్రవిడ్‌ను హెడ్‌కోచ్‌గా తీసుకుంటే 2021 నుంచి రాజస్థాన్‌ రాయల్స్‌ ప్రధాన కోచ్‌గా ఉన్న శ్రీలంక మాజీ కెప్టెన్‌ కుమార సంగక్కర ఫ్రాంఛైజీ డైరెక్టర్‌ ఆఫ్‌ క్రికెట్‌గా కొనసాగే అవకాశం ఉంది.


వాస్తవానికి టీమిండియా హెడ్‌కోచ్‌ బాధ్యతల నుంచి వైదొలిగిన తర్వాత రాహుల్‌ ద్రవిడ్‌ను మెంటార్‌గా లేదా కోచ్‌గా తీసుకోవడానికి చాలా ఫ్రాంచైజీలు ఆసక్తి చూపించాయి. ఐపీఎల్‌ 2024లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ మెంటార్‌గా వ్యవహరించిన గౌతమ్‌ గంభీర్‌ టీమ్‌ఇండియా కోచ్‌గా నియమితుడైన విషయం తెలిసిందే. దీంతో గంభీర్‌ ప్లేసును రాహుల్‌ ద్రవిడ్‌తో భర్తీ చేస్తారనే వార్తలు వచ్చాయి. కానీ అనూహ్యంగా రాజస్థాన్ రాయల్స్ ద్రవిడ్‌తో సంప్రదింపులు జరుపుతోంది.


జాతీయ జట్టుకు హెడ్‌కోచ్‌గా ఉండాలంటే.. ఏడాది మొత్తం వారికోసమే కేటాయించాల్సి ఉంటుంది. అప్పుడు కుటుంబానికి దూరంగా ఉండాల్సి వస్తుంది. అదే ఐపీఎల్‌ అయితే మూడు నెలలు ఫ్రాంఛైజీ కోసం పనిచేస్తే సరిపోతుంది. ఖాళీగా ఉండటం ఎందుకని రాహుల్ ద్రవిడ్‌ కూడా రాజస్థాన్ రాయల్స్ హెడ్‌కోచ్‌ పోస్టు ఆఫర్‌కు ఓకే చెప్పాలని భావిస్తున్నట్లు సమాచారం.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com