ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వరుసగా రెండో విజయం,,,మహిళల ఆసియా కప్‌లో కొనసాగుతున్న భారత్‌ హవా

international |  Suryaa Desk  | Published : Sun, Jul 21, 2024, 11:23 PM

బారత్ మహిళా క్రికెట్ టీం తన సత్తా చాటుతోంది. శ్రీలంక వేదికగా జరుగుతున్న మహిళల ఆసియా కప్‌లో భారత జట్టు వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. ఆదివారం యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 78 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన హర్మన్‌ ప్రీత్‌ కౌర్ నేతృత్వంలోని భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 201/5 పరుగులు చేసింది. అనంతరం యూఏఈని 123/7కు కట్టడి చేసింది.


 ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన యూఏఈ.. భారత్‌కు బ్యాటింగ్ అప్పగించింది. భారత బ్యాటర్లలో కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ 47 బంతుల్లో 66 రన్స్‌, వికెట్ కీపర్‌ రిచా ఘోష్‌ 29 బంతుల్లో 64 పరుగులతో విరుచుకుపడ్డారు. ఓపెనర్ షెఫాలీ వర్మ కూడా 18 బంతుల్లో 37 రన్స్ చేసింది. ఇన్నింగ్స్ మొత్తం యూఏఈ బౌలర్లపై భారత మహిళా బ్యాటర్లు ఆధిపత్యం చెలాయించారు. ఫలితంగా మహిళల టీ20 క్రికెట్‌లో టీమిండియా తొలిసారి 200 పరుగుల మార్కును దాటింది. నిర్ణీత 20 ఓవర్లలో 201/5 పరుగులు చేసింది.


అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన యూఏఈ ఏ దశలోనూ గెలిచేలా కన్పించలేదు. భారత బౌలర్ల ధాటికి ఆ జట్టు బ్యాటర్లు దాసోహమయ్యారు. కెప్టెన్ ఇషా రోహిత్ ఓజా (38), కవిషా (40) పరుగులు చేసి జట్టు స్కోరును వంద పరుగుల మార్కును దాటించారు. మిగతా బ్యాటర్లు తేలిపోవడంతో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 123/7కు పరిమితమైంది. భారత బౌలర్లలో దీప్తి శర్మ 2 వికెట్ తీయగా.. రేణుక సింగ్‌, తనుజా కన్వర్‌, పూజా వస్త్రాకర్‌, రాధా యాదవ్‌ తలా ఓ వికెట్‌ పడగొట్టారు.


ఈ టోర్నీలో గ్రూప్‌-ఏలో బరిలోకి దిగిన భారత్ ఆడిన రెండు మ్యాచుల్లోనూ గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. తొలి మ్యాచ్‌లో భారత్‌ పాకిస్థాన్‌ మహిళల జట్టును ఓడించిన విషయం తెలిసిందే. భారత్ తన తర్వాతి మ్యాచ్‌లో జులై 23న నేపాల్‌తో తలపడనుంది. ప్రస్తుతం గ్రూప్‌-ఏలో భారత్‌ టేబుల్‌ టాపర్‌గా కొనసాగుతుంది. నేపాల్‌, పాకిస్థాన్‌, యూఏఈలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. గ్రూప్‌-బిలో శ్రీలంక, థాయ్‌లాండ్‌, బంగ్లాదేశ్‌, మలేషియా జట్లు తలపడుతున్నాయి. ఈ గ్రూప్‌లో థాయ్‌లాండ్‌ టేబుల్‌ టాపర్‌గా ఉంది. ఆ తర్వాత శ్రీలంక, బంగ్లాదేశ్‌, మలేషియా జట్లు ఉన్నాయి. టోర్నీలోని మ్యాచ్‌లన్నీ శ్రీలంకలోని డంబుల్లా వేదికగా జరుగుతున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com