పాకిస్థాన్లో నివసిస్తున్న హిందూ జనాభా సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ ఇస్లామిక్ దేశంలో మైనారిటీలుగా ఉన్న హిందువులు గత ఏడాది నిర్వహించిన జన గణన ప్రకారం దేశంలోనే అతిపెద్ద మైనారిటీ వర్గంగా నిలిచారు. పాకిస్తాన్లో 2017 లో హిందువుల జనాభా 35 లక్షలు ఉండేది. కానీ 2023 నాటికి ఆ సంఖ్య 38 లక్షలకు పెరిగింది. అయితే పాక్ మొత్తం జనాభాతో పోలిస్తే 2017 నుంచి 2023 వరకు.. హిందువుల జనాభా తగ్గిందని లెక్కలు పేర్కొంటున్నాయి. మొత్తం జనాభాలో హిందువుల జనాభా శాతం 1.73 నుంచి 1.61కు తగ్గిందని పాక్ అధికారులు వెల్లడించారు.
పాకిస్తాన్లో హిందువులతోపాటు మిగిలిన మైనారిటీల జనాభా కూడా వేగంగా పెరుగుతున్నట్లు పాక్ అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఇదే సమయంలో పాక్లో క్రిస్టియన్ల సంఖ్య కూడా భారీగా పెరిగినట్లు అక్కడి ప్రభుత్వ లెక్కల ద్వారా స్పష్టం అవుతోంది. గతంలో 2017 లో పాక్లో క్రిస్టియన్ల సంఖ్య 26 లక్షలు ఉండగా.. ఆ సంఖ్య 2023 నాటికి 33 లక్షలకు పెరిగింది. గత ఏడాది పాకిస్తాన్లో నిర్వహించిన 7వ జనాభా, గృహ గణన వివరాలను పాకిస్థాన్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ ఇటీవల విడుదల చేసింది. ఆ వివరాలను పాక్ అధికార పత్రిక డాన్ తాజాగా వెల్లడించింది.
పాకిస్థాన్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ రిలీజ్ చేసిన వివరాల ప్రకారం.. 2023 నాటికి ఆ దేశ మొత్తం జనాభా 24 కోట్లు అని తేలింది. ఆ దేశంలో ముస్లింల జనాభా 2017 తో పోలిస్తే 2023 వరకు తగ్గినట్లు తెలుస్తోంది. 2017 లో పాకిస్తాన్ మొత్తం జనాభాలో 96.47 శాతం ముస్లింల జనాభా ఉండగా.. దానితో పోలిస్తే 2023 లో ఆ సంఖ్య 96.35 శాతానికి స్వల్పంగా తగ్గిందని ప్రభుత్వ లెక్కలు పేర్కొన్నాయి. ఇక పాకిస్తాన్లో ఉన్న మైనారిటీల జనాభా 2017 తో పోలిస్తే 2023 లో పెరిగినట్లు అధికారులు వెల్లడించారు. అయితే పాక్ మొత్తం జనాభాతో పోలిస్తే వారి శాతం అతి స్వల్పమని తెలిపారు.