ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జస్ట్ 40 రోజుల్లోనే ఆ..రు..సార్లు స్నానం చేశాడు.. అయినా విడాకులు కోరితే ఎలా..?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Sep 16, 2024, 10:47 PM

పెళ్లయిన కొత్తలో భార్యాభర్తలు ఎంతో అన్యోన్యంగా ఉంటారు కదా. ఒకర్ని విడిచి ఒకరు ఉండలేనట్టుగా ఉంటారు. ఎడబాటును ఏమాత్రం తట్టుకోలేరు. కానీ ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ యువతి మాత్రం వింత కారణంతో పెళ్లయిన 40 రోజులకే విడాకులు కోరుతోంది. ఈ మురికి మొగుడుతో కాపురం చేయడం తన వల్ల కాదని తెగేసి చెబుతోంది. ఇంతకూ కారణం ఏంటంటే.. సదరు భర్త గారికి స్నానం చేయడం అంటే ఏమాత్రం నచ్చదట.


 దీంతో ఆయన ఒంట్లో నుంచి వచ్చే సువాసనలను భరించలేక.. ఆయన పక్కన పడుకోలేక ఆమె విడాకులు కోరుతోంది. నెలకు ఒకట్రెండు సార్లు మాత్రమే స్నానం చేసే ఆ మహానుభావుడితో జీవితాంతం కలిసి ఉండటం తన వల్ల కాదని ఆమె చెబుతోంది. స్నానం చేయకపోతే నచ్చజెప్పాలి గానీ.. విడాకులు తీసుకుంటారా అని అనుకుంటున్నారా? ఇప్పుడు నచ్చజెప్పే ప్రక్రియే నడుస్తోంది. కానీ ఆమె మాత్రం ఈ మొగుడితో కాపురం బహుత్ కష్ట్ హై అంటోంది.


ఎందుకంటే పెళ్లయిన 40 రోజుల వ్యవధిలో భార్య పోరు పెట్టగా పెట్టగా.. ఇక భరించలేక ఆరుసార్లు స్నానం చేశాడట. ఇక ఇంతకు మించి స్నానం చేయడం తన వల్ల కాదని.. ఇంత కంటే పరిశుభ్రంగా ఉండలేనని చెప్పేశాడు. దీంతో ఆ భార్యమణి విడాకుల కోసం ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించింది.


‘ఏంటయ్యా... నువ్వు రోజూ స్నానం చేయవని నీ భార్య చెబుతోంది. ఆమె చెప్పేది నిజమేనా?’ అని ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్ అధికారులు అడిగితే.. నిజమేనని ఒప్పుకున్నాడు. తాను రోజూ స్నానం చేయనని.. వారానికోసారి పవిత్ర గంగా జలాన్ని ఒంటి మీద జల్లుకుంటానని చెప్పాడు. కానీ పెళ్లయ్యాక భార్య బలవంతం మీద 40 రోజుల్లో ఆరుసార్లు స్నానం చేశానని చెప్పాడు. అతగాడు చెప్పిన మాటలకు ఆ అధికారులు కూడా కంగుతిన్నారు.


సదరు భర్త గారు సరిగా స్నానం చేయకపోవడం, అతడి ఒంట్లో నుంచి అమోఘమైన సువాసనలు వస్తుండటంతో.. భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. స్నానం చేయని మొగుడితో నా వల్ల కాదని చెప్పి ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. మురికి మొగుడితో కాపురం నావల్ల కాదని ఆమె తెగేసి చెప్పింది. భార్య తరఫువారు అతడిపై వరకట్నం వేధింపుల కేసు కూడా పెట్టారు. పోలీసులు జోక్యం చేసుకొని సర్ది చెప్పబోతే.. అప్పటికి స్నానం చేసేందుకు ఓకే చెప్పాడు. కానీ భార్య మాత్రం అత్తారింటికి వెళ్లేందుకు.. అతడితో కలిసి కాపురం చేసేందుకు ససేమీరా ఒప్పుకోవడం లేదు. వివాదాన్ని పరిష్కరించుకోవడం కోసం.. దంపతులిద్దరూ సెప్టెంబర్ 22న మరోసారి కౌన్సెలింగ్ సెంటర్‌కు వెళ్లనున్నారు.


వింత కారణాలతో దంపతులు విడాకులు కోరడం ఇది తొలిసారేం కాదు. ఆగ్రాకు చెందిన ఓ మహిళ కుర్‌కురేలకు బాగా అడిక్ట్ అయ్యింది. ఓ రోజు ఆమె భర్త కుర్‌కురే ప్యాకెట్ తేవడం మర్చిపోయాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో విడాకులు కావాలని ఆ భార్య పట్టుబట్టింది.


మరో ఘటనలో.. తన భార్యకు మ్యాగీ చేయడం తప్పితే ఇంకేం రాదనే కారణంతో కర్ణాటకలోని బళ్లారికి చెందిన ఓ వ్యక్తి విడాకులు కోరాడు. తన భార్య మూడు పూటలా మ్యాగీనే వండుతోందని.. అది తప్పితే ఆమెకు వంట రాదని ఆరోపించాడు. ఈ దంపతులిద్దరూ పరస్పర అంగీకారంతో విడిపోయారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com