ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పోలీస్ వ్యాన్‌లో వినాయకుడి విగ్రహం.. మండిపడిన ప్రధాని మోదీ, పోలీసుల క్లారిటీ

national |  Suryaa Desk  | Published : Mon, Sep 16, 2024, 11:09 PM

దేశవ్యాప్తంగా ప్రస్తుతం గణేష్ నిమజ్జనాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. డీజేలు, డప్పు చప్పుళ్లు, ఊరేగింపులతో కన్నుల పండువగా సాగుతున్నాయి. అయితే ఈ గణేష్ నిమజ్జనాల్లో ఎలాంటి అపశృతి చోటు చేసుకోకుండా భారీగా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. అయినా అక్కడక్కడ కొన్ని సంఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే ఇటీవల కర్ణాటక రాజధాని బెంగళూరులో జరిగిన ఓ సంఘటన పెను సంచలనంగా మారింది. నిమజ్జనానికి వెళ్తున్న గణేషుడి విగ్రహాన్ని అడ్డగించిన పోలీసులు.. ఆ విగ్రహాన్ని తీసుకెళ్లి పోలీస్ వాహనంలో ఉంచారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ఆన్‌లైన్‌లో తెగ చక్కర్లు కొట్టాయి. ఇది కాస్తా కర్ణాటకలో తీవ్ర రాజకీయ దుమారానికి కారణం అయింది. ఇక ఈ వ్యవహారంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా స్పందించడంతో.. దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే బెంగళూరు పోలీసులు ఒక వివరణ ఇచ్చారు.


బెంగళూరులోని నాగమంగలలో ఇటీవల జరుగుతున్న ఘర్షణల కారణంగా నగరవ్యాప్తంగా హిందూ సంఘాలు నిరసనలకు పిలుపునిచ్చాయి. అయితే ఈ ఆందోళనలకు అనుమతి లేకపోవడంతో భారీగా పోలీసులు అక్కడికి చేరుకున్నారు. నిరసన చేస్తున్న వారిని ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకుని.. సంబంధిత పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ క్రమంలోనే ఆందోళన కారుల వద్ద ఉన్న వినాయకుడి విగ్రహాన్ని కూడా తీసుకెళ్లిన పోలీసులు.. తమ వాహనంలో ఉంచారు. దీనికి సంబంధించిన వీడియోలు తెగ వైరల్ కావడంతో హిందూ సంఘాలు, కర్ణాటకలో ప్రతిపక్ష పార్టీ అయిన బీజేపీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది.


 ఈ ఘటన కర్ణాటకలో తీవ్ర మాటల యుద్ధానికి కారణం అయింది. శాంతియుతంగా నిరసన చేస్తున్న వారి నుంచి గణేష్ విగ్రహాన్ని పోలీసులు తీసుకెళ్లి.. వాహనంలోకి ఎక్కించారని బీజేపీ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. టెర్రరిస్ట్‌లు, మావోయిస్ట్‌లు, నేరస్థులు, అవినీతి చేసినవారు.. కర్ణాటకలో స్వేచ్ఛగా తిరుగుతుంటే సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం.. గణేషుడిని పోలీసు వాహనంలోకి ఎక్కించిందని కమలం పార్టీ నేతలు విమర్శలు గుప్పించారు. ఇక ఈ వ్యవహారంపై స్పందించిన ప్రధాని నరేంద్ర మోదీ.. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్న కర్ణాటక రాష్ట్రంలో వినాయకుడిని జైలులో పెట్టారంటూ.. హర్యానా ఎన్నికల ప్రచారంలో తీవ్రంగా మండిపడ్డారు.


ఇక ఈ వ్యవహారం కాస్తా తీవ్ర విమర్శలు, రాజకీయ దుమారం రేపుతుండటంతో ఎట్టకేలకు బెంగళూరు పోలీసులు స్పందించారు. ఆందోళన చేసేందుకు కోర్టు అనుమతి ఇవ్వకున్నా.. కోర్టు ఆదేశాలను ధిక్కరించి మరీ ఆందోళనకారులు నిరసనలకు ప్రయత్నించారని మండిపడ్డారు. దీంతో వారిని కట్టడి చేసేందుకు అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా వారి వద్ద ఉన్న వినాయకుడి విగ్రహాన్ని తీసుకెళ్లి పోలీస్ వ్యాన్‌లో ఉంచినట్లు చెప్పారు. అనంతరం అధికారుల సమక్షంలో సంప్రదాయబద్ధంగా వినాయకుడి విగ్రహాన్ని నీటిలో నిమజ్జనం చేసినట్లు బెంగళూరు పోలీసులు స్పష్టం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com