ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఒక్క 2020 లోనే 11.9 లక్షల కొవిడ్ మరణాలు?

national |  Suryaa Desk  | Published : Sun, Jul 21, 2024, 11:15 PM

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాల్లో లక్షలాది మందిని ఈ వైరస్ బలి తీసుకోగా.. కోట్లాదిమంది కొవిడ్ సోకి అవస్థలు పడ్డారు. అయితే భారత్‌లో కూడా ఈ కొవిడ్ వైరస్ విజృంభించినప్పటికీ ప్రాణ నష్టం అంతగా లేదని ప్రభుత్వ అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అయితే భారత్‌లో కరోనా మృతుల సంఖ్యపై అప్పుడప్పుడూ విమర్శలు వెల్లువెత్తుతూనే ఉంటాయి. నిజానికి కొవిడ్ సోకి మరణించిన వారి సంఖ్యను ప్రభుత్వం తక్కువ చేసి చూపిందని.. ఎన్నో అధ్యయనాలు ఇప్పటికే ఆరోపించాయి. ఈ క్రమంలోనే తాజాగా మరో అధ్యయనం.. భారత్ కరోనా మృతుల లెక్కలు తప్పు అని తేల్చింది. ఒక్క 2020 ఏడాదిలోనే భారత ప్రభుత్వం చెప్పిన లెక్కల కంటే అధికంగా 11.9 లక్షల మంది ప్రాణాలు కోల్పోయినట్లు తాజా అధ్యయనం వెల్లడించింది. అయితే ఈ అధ్యయనాన్ని కేంద్రం కొట్టిపారేసింది.


కొవిడ్‌ వైరస్ ఉద్ధృతి అధికంగా ఉన్న 2020లో భారత్‌లో 11.9 లక్షల మంది అధికంగా చనిపోయినట్లు తాజాగా ఒక అంతర్జాతీయ అధ్యయనం వెల్లడించింది. ఆక్స్‌ఫర్డ్‌ సహా పలు విశ్వవిద్యాలయాలకు చెందిన పరిశోధకులు ఈ అధ్యయనం నిర్వహించారు. అంతకుముందు ఏడాది 2019తో పోలిస్తే ఇది 17 శాతం అధికం అని తెలిపింది. అయితే భారత ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసిన కరోనా మృతుల సంఖ్య కంటే ఇది 8 రెట్లు ఎక్కువ అని ఈ అధ్యయనం పేర్కొంది. ఇక ప్రపంచ ఆరోగ్య సంస్థ -డబ్యూహెచ్‌వో వేసిన అంచనాల కన్నా 1.5 రెట్లు అధికమని పేర్కొంది.


 ఈ అధ్యయనం నిర్వహించిన పరిశోధకులు.. భారత్‌లోని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌-5 నుంచి 7.65 లక్షల మందికి సంబంధించిన డేటాను సేకరించి.. విశ్లేషణ చేశారు. దీని ఆధారంగా 2019 నుంచి 2020 మధ్యలో భారత్‌లో స్త్రీ-పురుష, సామాజిక బృందాల వారీగా సగటు ఆయుర్దాయంలో వచ్చిన మార్పులను వారు అంచనా వేశారు. అయితే ఈ అధ్యయనాన్ని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ తీవ్రంగా ఖండించింది. ఆ అధ్యయనం చేసిన అంచనాలు పూర్తిగా తప్పుదోవ పట్టించేవిగా ఉన్నాయని మండిపడింది. తప్పుల తడకగా పరిశోధకులు చేసిన అధ్యయనం ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని కొట్టిపారేసింది. ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌లో సర్వేలో ప్రస్తావించిన సమాచారంలో నుంచి కొన్ని కుటుంబాలకు సంబంధించిన మరణాల రేటును మొత్తం దేశానికి వర్తింపజేయలేమని కేంద్రం స్పష్టం చేసింది. దేశంలోని సివిల్‌ రిజిస్ట్రేషన్‌ సిస్టమ్‌ -సీఆర్‌ఎస్‌ అత్యంత నమ్మదగినది అని.. దాని ప్రకారం 2019తో పోలిస్తే 2020లో మరణాలు 4.74 లక్షలు పెరిగాయని వెల్లడించింది. అయితే ఈ అధికంగా నమోదైన మృతులకు కారణం కరోనా మహమ్మారి అని చెప్పలేమని తేల్చి చెప్పింది. వారికి ఇతరత్రా ఆరోగ్య సమస్యలు కూడా ఉంటాయని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com