ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు

sports |  Suryaa Desk  | Published : Wed, Jul 17, 2024, 12:24 PM

టీ20 వరల్డ్ కప్​ను టీమిండియా గెలుచుకోవడంతో కెప్టెన్ రోహిత్ శర్మ ఫుల్ హ్యాపీగా ఉన్నాడు. చిరకాల ప్రపంచ కప్ కల నెరవేరడంతో అతడి ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి.అయితే ఈ విజయం అంత సులువుగా రాలేదు. మెగాటోర్నీలో పాకిస్థాన్, ఆఫ్ఘానిస్థాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్​తో పాటు సౌతాఫ్రికా లాంటి బిగ్ టీమ్స్​ను చిత్తు చేసి కప్పును ఒడిసిపట్టింది భారత్. ముఖ్యంగా ప్రొటీస్​తో జరిగిన ఫైనల్​ మ్యాచ్ ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగింది. ఒక దశలో సఫారీలదే విజయమని అంతా అనుకున్నారు. ఆ జట్టు గెలవాలంటే 30 బంతుల్లో 30 పరుగులు చేయాలి. అప్పటికే భారీ షాట్లతో దూకుడు మీద ఉన్న హెన్రిచ్ క్లాసెన్​తో పాటు డేంజరస్ డేవిడ్ మిల్లర్ క్రీజులో ఉన్నారు. దీంతో భారత్ మరో కప్పు చేజార్చుకోవడం ఖాయమని అంతా భయపడ్డారు.


గెలుపు అసాధ్యం అనుకున్న మ్యాచ్​లో పేసర్లు జస్​ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా, అర్ష్​దీప్ సింగ్ అద్భుతం చేశారు. క్లాసెన్, మిల్లర్​ను పాండ్యా ఔట్ చేయగా.. బుమ్రా, అర్ష్​దీప్ మిగతా వారి పనిపట్టారు. పరుగులు నియంత్రించడమే గాక వికెట్లు కూడా తీస్తూ పోవడంతో అన్ని ఓవర్లు ముగిసేసరికి విజయానికి ఇంకో 7 పరుగుల దూరంలో సౌతాఫ్రికా ఆగిపోయింది. టీమిండియా సగర్వంగా కప్​ను అందుకుంది. ఈ ఫైనల్ మ్యాచ్​ గురించి కెప్టెన్ రోహిత్ శర్మ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. క్లాసెన్-మిల్లర్ క్రీజులో ఉన్నప్పుడు తాము పడిన టెన్షన్ గురించి పంచుకున్నాడు. ఆ టైమ్​లో తన మైండ్ బ్లాంక్ అయిందన్నాడు. బౌలర్లే జట్టును కాపాడారని చెప్పాడు. చేయాల్సిన దాని మీదే ఫోకస్ చేస్తూ ముందుకెళ్లడం వర్కౌట్ అయిందన్నాడు హిట్​మ్యాన్.


'అప్పుడు నా మైండ్ బ్లాంక్ అయింది. క్లాసెన్ రాక ముందు వరకు మ్యాచ్ బ్యాలెన్స్​డ్​గా ఉంది. కానీ అతడు 15వ ఓవర్​లో భారీ షాట్లు బాదడంతో ఒక్కసారిగా అంతా మారిపోయింది. ఆ టైమ్​లో నేను ఎక్కువగా ఆలోచించలేదు. ఏం చేయాలనే దాని మీదే ఫోకస్ చేశా. ప్లేయర్లంతా కూల్​గా ఉండటం, మా ప్లాన్స్​ను సరిగ్గా అమలు చేయడం ఎంతో ముఖ్యం. చివరి ఐదు ఓవర్లలో సౌతాఫ్రికా 30 రన్స్ చేయాల్సిన దశలో మేం ప్రెజర్​లో ఉన్నాం. కానీ మా బౌలర్లు ఆ దశలో బౌలింగ్ చేసిన తీరు చూస్తే మేం ఎంత ప్రశాంతంగా ఉన్నామో అర్థమవుతుంది. భయపడకుండా మా ప్రణాళికలను అమలు చేస్తూ పోయాం. అదే మాకు కలిసొచ్చింది' అని రోహిత్చెప్పుకొచ్చాడు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com