ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పెట్టుబడులే టార్గెట్‌గా చంద్రబాబు అడుగులు.. జేఎస్‌డబ్ల్యూ ఛైర్మన్ జిందాల్‌తో చర్చలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jul 15, 2024, 10:41 PM

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకువచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. పెట్టుబడుల ఆకర్షణే ధ్యేయంగా వ్యాపారవేత్తలు, సంస్థల ప్రతినిధులతో చంద్రబాబు భేటీ అవుతున్నారు. ఈ క్రమంలోనే జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ ఛైర్మన్ సజ్జన్ జిందాల్‌ సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఏపీలో పెట్టుబడులపై జిందాల్‌తో చంద్రబాబు చర్చించారు. ఏపీలో పెట్టుబడులకు మంచి అవకాశాలు ఉన్నాయని, ఆ దిశగా ప్రతిపాదనలతో రావాలని సజ్జన్ జిందాల్‌కు చంద్రబాబు సూచించారు. పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చే కంపెనీలకు ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని చంద్రబాబు భరోసా ఇచ్చారు.


సజ్జన్ జిందాల్‌లో భేటీ విషయమై చంద్రబాబు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు కొత్త అవకాశాలు కల్పించేందుకు మీకు సహకరించేందుకు, పనిచేసేందుకు ఎదురుచూస్తున్నానంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు. మరోవైపు సీఎం చంద్రబాబుతో అద్భుతమైన సమావేశం జరిగిందంటూ ట్వీట్ చేసిన సజ్జన్ జిందాల్.. ఏపీ ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించటంపై చంద్రబాబు దృష్టిపెట్టినట్లు ట్వీట్ చేశారు. వారితో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఉన్నానంటూ సజ్జన్ జిందాల్ ట్వీట్ చేశారు.


మరోవైపు సజ్జన్ జిందాల్ ఏపీకి కొత్తేమీ కాదు. వైసీపీ ప్రభుత్వం హయాంలో కడపలో స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి సజ్జన్ జిందాల్‌కు చెందిన జేఎస్‌డబ్ల్యూ కంపెనీ ముందుకు వచ్చింది. ఈ కంపెనీ ఆధ్వర్యంలోనే కడప స్టీల్ ప్లాంట్ నిర్మిస్తామని 2019లో అప్పటి సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు. వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లి, పెదనందలూరు గ్రామాల్లో భూములు కూడా కేటాయించారు. ఆ తర్వాత 2023లో కడప స్టీల్ ప్లాంట్‌కు భూమి పూజ కూడా జరిగింది. అయితే స్టీల్ ప్లాంట్ నిర్మాణం దిశగా అడుగులు పడలేదు. ఈ నేపథ్యంలో జేఎస్‌డబ్ల్యూ ఛైర్మన్ సజ్జన్ జిందాల్ చంద్రబాబుతో భేటీ కావటంతో కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణం దిశగా అడుగులు పడతాయేమో చూడాలి మరి.


మరోవైపు ఇప్పటికే ఏపీలో బీపీసీఎల్ రిఫైనరీ ఏర్పాటు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న చంద్రబాబు.. ఇటీవలే బీపీసీఎల్ ఛైర్మన్‌తోనూ భేటీ అయ్యారు. మూడు నెలల్లోగా రిఫైనరీ ఏర్పాటుపై పూర్తి స్థాయి ప్రణాళికతో రావాలని కోరారు. ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తే మచిలీపట్నంలో బీపీసీఎల్ రిఫైనరీ ఏర్పాటు అవుతోంది. ఈ క్రమంలోనే సజ్జన్ జిందాల్‌ జేఎస్‌డబ్ల్యూకు సైతం సహకారం అందిస్తే ఇటు రాయలసీమలోని కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ నిర్మాణం జరిగే అవకాశం ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com