ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎట్టకేలకు బయటికొచ్చిన ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్.. మీడియాపై ఫైర్.. పరారీలో తల్లిదండ్రులు

national |  Suryaa Desk  | Published : Mon, Jul 15, 2024, 10:52 PM

మహారాష్ట్ర ట్రైన్ ఐఏఎస్ పూజా ఖేద్కర్ వివాదం రోజురోజుకూ మరింత ముదురుతోంది. తీగ లాగితే డొంకంతా కదిలినట్లు.. కారుకు బీకన్ లైట్లు ఏర్పాటు చేసుకుని.. వీఐపీ మర్యాదలు కావాలని డిమాండ్ చేస్తూ వెలుగులోకి వచ్చిన ఈ విషయం కాస్తా.. ఇప్పుడు ఆమె కుటుంబం మొత్తాన్ని బయటికి లాగింది. పూజా ఖేద్కర్ తల్లి మనోరమ ఖేద్కర్.. తుపాకీతో రైతును బెదిరించిన వీడియో వైరల్ కావడం.. తండ్రి దిలీప్ ఖేడ్కర్ అక్రమ ఆస్తులు కూడబెట్టినట్లు ఆరోపణలు రావడంతో ఆ కుటుంబం ఇప్పుడు మీడియాలో హైలైట్ అవుతోంది. ఈ క్రమంలోనే ఈ వివాదం తెరపైకి వచ్చిన తర్వాత ఎట్టకేలకు పూజా ఖేద్కర్ మీడియా ముందుకు వచ్చారు. మరోవైపు.. ఆమె తల్లిదండ్రులు ఇద్దరూ పరారీలో ఉండటం గమనార్హం.


మహారాష్ట్రలో ట్రైనీ ఐఏఎస్‌ పూజా ఖేద్కర్‌పై వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. ఆమె ఎంబీబీఎస్‌లో చేరేందుకు నకిలీ ధృవపత్రాలు సమర్పించినట్లు ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఆమె తొలిసారి స్పందించారు. ఈ ఆరోపణల గురించి నిపుణుల కమిటీ ముందే తాను ప్రస్తావిస్తానని తేల్చి చెప్పారు. ప్రస్తుతం ఈ ఘటనపై మీడియా విచారణ జరుగుతోందని.. ప్రజలంతా అది గమనిస్తున్నారని ఫైర్ అయ్యారు. అన్ని ఆరోపణలు, విషయాలను నిపుణుల కమిటీ ముందు వాంగ్మూలం ఇస్తానని పూజా ఖేద్కర్ వెల్లడించారు. కమిటీ తీసుకునే తుది నిర్ణయానికి కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఏ విచారణ జరుగుతుందో ఇప్పుడే చెప్పలేనని.. ఆ వివరాలన్నింటినీ తర్వాత వెల్లడిస్తానని తేల్చి చెప్పారు.


నేరం రుజువయ్యే వరకు అందరూ నిర్దోషులేనని పేర్కొన్న పూజా ఖేద్కర్.. తనను మీడియాలో విచారణ చేసి దోషిగా చూపిస్తున్నారని.. అది తప్పు అని మీడియా ముందు వాపోయారు. తప్పుడు ధృవీకరణ పత్రాలు సమర్పించి.. ఆమె పూజా ఖేడ్కర్‌ ఎంబీబీఎస్‌లో చేరినట్లు తాజాగా ఆరోపణలు వెల్లువెత్తాయి. ఓబీసీ నాన్‌ క్రిమిలేయర్‌ సర్టిఫికేట్‌తో పూణేలోని ఓ మెడికల్‌ కాలేజీలో ఆమె అడ్మిషన్‌ పొందారు. ఈ విషయాన్ని సదరు మెడికల్‌ కాలేజీ కూడా ధృవీకరించింది.


మరోవైపు.. పూజా ఖేద్కర్‌ తల్లిదండ్రుల కోసం పూణే పోలీసులు గాలింపు చేపట్టారు. భూ వివాదం వ్యవహారంలో పూజా ఖేద్కర్ ఆమె తల్లి మనోరమ ఖేద్కర్ కొందరు రైతులను తుపాకీతో బెదిరించిన వీడియో ఇటీవల వైరల్‌గా మారిన నేపథ్యంలో ఆమె, ఆమె భర్త దిలీప్ ఖేద్కర్‌లపై పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఈ క్రమంలోనే సోమవారం ఉదయం బానేర్‌ ప్రాంతంలో వారి ఇంటికి వెళ్లగా.. లోపలి తలుపులు లాక్‌ చేసి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో పూణే సహా ఇతర ప్రాంతాల్లో గాలిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com