ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పూరీ జగన్నాథ రథయాత్రలో తొక్కిసలాట.. వందలమందికి గాయాలు, ఒకరు మృతి

national |  Suryaa Desk  | Published : Sun, Jul 07, 2024, 10:04 PM

ఉత్తర్‌ప్రదేశ్‌ హథ్రాస్ తొక్కిసలాట ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటన మరిచిపోకముందే తాజాగా మరో తొక్కిసలాట ఘటన చోటు చేసుకుంది. ఒడిశాలోని పూరీ జగన్నాథ రథయాత్రలో ఈ దుర్ఘటన జరిగింది. రథయాత్రకు లక్షలాది మంది జనం తరలివచ్చారు. ఈ క్రమంలోనే రథం లాగేందుకు ప్రయత్నిస్తుండగా.. తొక్కిసలాట జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. ఈ తొక్కిసలాట ఘటనలో ఇప్పటివరకు ఒకరు చనిపోగా.. వందల మంది గాయాలపాలయ్యారు.


రథయాత్రలో భాగంగా రథాన్ని లాగుతుండగా తోపులాట జరగడంతో ఓ భక్తుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనలో దాదాపు 300 మందికిపైగా గాయాలపాలైనట్లు తెలుస్తోంది. వెంటనే అధికారులు, పోలీసులు స్పందించి.. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు పూరీ రాజు గజపతి దివ్యసింగ్‌దేవ్‌ రథాలపై బంగారు చీపురుతో రథాల ముందు ఊడ్చడం పూర్తి చేశారు.


సాయంత్రం 4 గంటలకు రథాలకు సారథులు, అశ్వాలు అమర్చి తాళ్లు కట్టారు. ఆ తర్వాత బలభద్రుని తాళధ్వజ రథం ముందుకు కదిలింది. ఈ క్రమంలోనే రథం లాగేందుకు భక్తులు ఎగబడటంతో వారి మధ్య తోపులాట జరిగింది. రథాలలో చెక్క గుర్రాలను ఉంచి.. భక్తులకు రథాలను సరైన మార్గంలో లాగేందుకు సేవాదారులు మార్గనిర్దేశం చేశారు. ఆ సమయంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము మూడు రథాలకు ప్రదక్షిణ చేసి.. దేవతలకు నమస్కరించారు.


ప్రతీ సంవత్సరం ఆషాఢమాసంలోని శుక్లపక్షం ద్వితీయ తిథిన పూరీ జగన్నాథ రథ యాత్ర ప్రారంభం అవుతుంది. ఈ క్రమంలోనే ఆదివారం ఉదయం ద్వితీయ తిధి 4.26 గంటలకు ప్రారంభమైన ఈ రథయాత్ర.. సోమవారం ఉదయం 4.59 గంటలకు ముగియనుంది. పూరీ ఆలయ ఆధ్వర్యంలో జరిగే ఉత్సవాలన్నింటిలోకల్లా ఈ పూరీ జగన్నాథ రథయాత్ర ప్రత్యేకమైంది. ఇక ఈ పూరీ జగన్నాథ రథయాత్రకు దేశంలోనే అత్యంత ప్రాధాన్యం ఉంటుంది. ఈ రథయాత్ర.. ప్రతీ సంవత్సరం జూన్ లేదా జూలై నెలల్లో నిర్వహిస్తారు. ఈ రథయాత్రలో శ్రీకృష్ణుడు, బలరాముడు, సుభద్ర విగ్రహాలను పూరీ నగర వీధుల్లో ఊరేగింపుగా తీసుకెళ్తారు. ఈ రథం దాదాపు 45 అడుగుల ఎత్తు.. 35 చదరపు అడుగుల వైశాల్యం కలిగి ఉంటుంది. ఈ రథానికి 7 అడుగుల వ్యాసం కలిగిన 16 చక్రాలు ఉంటాయి. దాదాపు 4 వేల మంది భక్తులు ఈ రథాన్ని లాగుతారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com