ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రిచ్ దొంగ.. రూ.కోటి విలువైన ఫ్లాట్, లగ్జరీ కారు.. విమానాల్లో తిరుగుతూ దొంగతనాలు

national |  Suryaa Desk  | Published : Sun, Jul 07, 2024, 08:05 PM

ప్రస్తుతం చాలా మంది దొంగలు లగ్జరీ లైఫ్ కోసం దొంగతనాలు చేస్తూ ఉన్నారు. సూటు, బూటు వేసుకుని.. హై ఫై లైవ్ అనుభవిస్తూ.. సైలెంట్‌గా దోచేస్తున్నారు. ఖరీదైన బంగ్లాలో నివసిస్తూ.. లగ్జరీ కార్లలో ప్రయాణిస్తూ.. లక్షలకు లక్షలు దోచేస్తూ పోలీసులకు చిక్కకుండా తప్పించుకుంటూ ఉంటారు. అయితే తాజాగా పోలీసులకు చిక్కిన ఓ దొంగ గురించి విని ఆశ్చర్యపోయారు. అతడికి ఉన్న ఆస్తులు, లైఫ్ స్టైల్ చూసి అవాక్కయ్యారు. ఎందుకంటే ముంబై నగరంలో రూ. కోటి విలువ చేసే ఫ్లాట్ ఆ దొంగ సొంతమని గుర్తించారు. అంతేకాకుండా ఆడీ కంపెనీకి చెందిన లగ్జరీ కారులో తిరుగుతున్నట్లు వెల్లడైంది. ఇక దేశంలోని వివిధ రాష్ట్రాలకు విమానాల్లో వెళ్లి దొంగతనాలు చేస్తున్నట్లు తేల్చారు. అయితే ఓ ఇంట్లో రూ. లక్ష దొంగతనం చేసి పారిపోగా.. కేసు నమోదు చేసి గాలించిన పోలీసులకు ఎట్టకేలకు దొరకడంతో ఈ విషయాలన్నీ వెలుగులోకి వచ్చాయి.


గుజరాత్‌కు చెందిన రోహిత్ కానుభాయ్ సోలంకి అనే వ్యక్తిని దొంగతనం కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. అతడ్ని విచారించగా బయటికి వచ్చిన విషయాలు విని పోలీసులకే కళ్లు బైర్లు కమ్మాయి. దేశంలోని పలు రాష్ట్రాల్లో జరిగిన 19 దొంగతనాలు రోహిత్‌ నిందితుడిగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇందులో తెలంగాణాలో రెండు, ఆంధ్రప్రదేశ్‌లో రెండు దొంగతనం కేసులు కూడా ఉన్నట్లు చెప్పారు. ఇక అతడి దొంగతనాల చిట్టా గురించి ఆరా తీయగా.. చాంతాడంత లిస్ట్ ఉన్నట్లు గుర్తించారు. ఇక అతడి ఆస్తులు, లివింగ్ స్టైల్ చూసి.. పోలీసులే షాక్ అయ్యారు.


రోహిత్‌కు ముంబైలో కోటి రూపాయలకు పైగా విలువచేసే ఒక ఫ్లాట్, ఆడీ కారు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. దేశంలోని వివిధ నగరాలకు విమానాల్లో వెళ్లి.. అక్కడ ఉన్న లగ్జరీ హోటళ్లలో బస చేస్తాడని తెలిపారు. పగలు అంతా ఆయా ప్రాంతాల్లో పూర్తిగా రెక్కీ నిర్వహించి.. రాత్రి పూట రోహిత్ దొంగతనాలకు పాల్పడుతూ ఉంటాడని గుర్తించారు. ముంబైలోని డ్యాన్స్‌ బార్లు, నైట్‌ క్లబ్‌లకు అలవాటుపడిన రోహిత్‌.. డబ్బుల కోసం ఇలా దొంగతనాలు చేస్తాడని పోలీసుల విచారణలో వెల్లడైంది. దొంగతనాలే కాకుండా రోహిత్ డ్రగ్స్‌ కూడా తీసుకుంటాడని పోలీసులు చెప్పారు.


ఇక వీటితోపాటు ఓ మహిళను కూడా మోసం చేసినట్లు గుజరాత్ పోలీసుల విచారణలో తేలింది. ఓ ముస్లిం మహిళను పెళ్లి చేసుకునేందుకు.. రోహిత్ తన పేరు అర్హన్‌గా మార్చుకున్నాడని పోలీసులు చెప్పారు. అయితే కొన్నేళ్ల నుంచి దర్జాగా హై ఫై దొంగతనాలకు పాల్పడుతున్న రోహిత్‌.. గుజరాత్‌లోని ఓ ఇంట్లో రూ.లక్ష చోరీ చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న గుజరాత్‌ పోలీసులకు ఎట్టకేలకు చిక్కాడు. ఇక నెలకు రోహిత్ ఖర్చు రూ.1.50 లక్షలకు పైనే ఉంటుందని పోలీసులు వెల్లడించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com