పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలులో నిర్వహించిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు పవన్ పింఛన్లను పంపిణీ చేశారు. అనంతరం డిప్యూటీ సీఎం మాట్లాడుతూ... గెలిచాక పెన్షన్లు రద్దు చేస్తామని వైసీపీ ప్రచారం చేసిందని.. కానీ తాము గెలిచాక పెంచి ఇచ్చామని చెప్పుకొచ్చారు. పిఠాపురంలో తాగునీటి సమస్య తీర్చాలన్నారు. పెన్షన్లు ఇంకా అందని వారికి అందేలా చూస్తామని స్పష్టం చేశారు. నియోజకవర్గాల్లో పంచాయతీలను ఎంచుకుని పారిశుధ్యం, తాగునీటి సమస్య తీర్చుతామన్నారు. పనిచేసి నియోజకవర్గంలో విజయయాత్ర చేస్తానన్నారు. ప్రజల మన్ననలు పొందాక తనకు తాను ఎమ్మెల్యే గా ప్రకటించుకుంటానని వెల్లడించారు. పిఠాపురం నియోజకవర్గాన్ని దేశంలోనే మోడల్గా తీర్చిదిద్దుతామన్నారు. చంద్రబాబు అపార అనుభవం వలనే ఈరోజు పెన్షన్లు ఇవ్వగలిగామని చెప్పుకొచ్చారు. గత ప్రభుత్వ అరాచకాలు సరిదిద్ది రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లగలిగేది చంద్రబాబే అని అన్నారు.