ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహిళలకు ఫ్రీ బస్సుపై మంత్రి కీలక అప్డేట్.. అక్కడ నుంచే పథకం ప్రారంభం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jun 30, 2024, 07:40 PM

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో టీడీపీ ఇచ్చిన ‘సూపర్ సిక్స్’ హామీల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఒకటి. ముఖ్యమంత్రిగా పించన్ల పెంపుపై చంద్రబాబు నాయుడు తొలి సంతకం, మెగా డీఎస్పీపై రెండో సంతకం, ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దుపై మూడో సంతకం చేసిన విషయం తెలిసిందే. ఏప్రిల్ నుంచి పెన్షన్లు రూ.4 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకోగా... జులై 1 నుంచి పెంచి మొత్తాన్ని కలిసి అందజేస్తున్నారు. ఇక, ఏపీలో ఉచిత బస్సు పథకం ఎప్పుడు ప్రారంభమవుతుందా? అని మహిళలు ఎదురుచూస్తున్నారు.


ఈ నేపథ్యంలో ఫ్రీ బస్సు పథకంపై రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభిస్తామని, మహిళలకు తీపి కబురు చెబుతామని అన్నారు. సాగర నగరం విశాఖ నుంచే ఈ పథకం ప్రారంభమవుతుందని మంత్రి రామ్‌ప్రసాద్‌ రెడ్డి తెలిపారు.


ప్రస్తుతం ఈ పథకం అమలవుతోన్న తమిళనాడు, తెలంగాణ, కర్ణాటకల్లో పర్యటించి అధ్యయనం చేస్తామని చెప్పారు. ఈ సందర్భంగా ఆర్టీసీ విలీనం విషయంలో గత ప్రభుత్వంపై మంత్రి విమర్శలు గుప్పించారు. మాజీ సీఎం వైఎస్ జగన్.. ఆర్టీసీని ప్రభుత్వంలో పూర్తిగా విలీనం చేయలేదని ఆరోపించారు. సిబ్బంది, ఉద్యోగులకు ఇబ్బంది లేకుండా రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ)ని ప్రక్షాళన చేస్తామని ఆయన ఉద్ఘాటించారు. త్వరలోనే ఎలక్ట్రిక్‌ బస్సులు నడుపుతామని రామ్‌ప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు.


మాజీ మంత్రి పెద్దిరెడ్డిపై కూడా ఆయన విరుచుకుపడ్డారు. రాయలసీమలో జగన్ తర్వాత అక్రమార్జన పెద్దిరెడ్డి కుటుంబానిదేనని ఆరోపణలు చేశారు. ‘రాయలసీమలో పెద్దిరెడ్డి కుటుంబ మాఫియా గురించి అందరికీ తెలుసు. జగన్‌ తర్వాత అక్రమార్జనలో ఆయనదే రికార్డు.. 1985-90 మధ్య పెద్దిరెడ్డిది ఓ సామాన్య కుటుంబం.. ఇప్పుడు మాత్రం రూ.వేల కోట్ల కూడబెట్టారు.. వైఎస్ఆర్సీపీకి ఆయన కుటుంబం రూ.వేల కోట్లు సమకూర్చింది.. రాష్ట్రంలోని గనులు, ఖనిజాలన్నీ పెద్దిరెడ్డే తవ్వేశారు.. 10వేల ఎకరాలు దోచేశారు. పెద్దిరెడ్డి కుటుంబం చేసిన అక్రమాలన్నీ ఆధారాలతో సహా బయటపెడతాం’ అని మంత్రి రాంప్రసాద్‌రెడ్డి పేర్కొన్నారు.


చేసిన పాపాలకు జైలుకు వెళ్లకుండా తప్పించుకోలేడని హెచ్చరించారు. పెద్దిరెడ్డి విముక్త రాయలసీమే ప్రజలకు గొప్ప వరమని, హత్యలు దోపిడీలు దాడులు లేకుండా సీమ ప్రజలు సంతోషంగా బతుకుతారని ఇటీవల మంత్రి వ్యాఖ్యానించారు. ప్రాజెక్టుల పేరుతో ప్రజా ధనాన్ని లూటీ చేశారని రాంప్రసాద్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com