జీడిపిక్కల బస్తాకు రూ.16వేలు కనీస మద్దతు ధర ప్రకటించి రైతులకు న్యాయం చేయాలని రైతాంగ సమస్యల సాధన కమిటీ కోరింది. ఈ మేరకు గురువారం సాయంత్రం పలాస ఎమ్మెల్యే గౌతు శిరీషను కలుసుకొని వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సాధన కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఉద్దానం ప్రాంతంలో జీడి పంటపైనే ఆధారపడి రైతులు బతుకుతున్నారని తెలిపారు. మద్దతు ధర లేకపోవడంతో పెట్టుబడులు కూడా రావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో రూ.9వేలు ధర ఉన్నపుడు రూ.వెయ్యి ప్రభుత్వం నుంచి ఇప్పిస్తామని చెప్పి ముఖం చాటేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నేరుగా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని, వంశధార కాలువను ఉద్దానం గ్రామాల మీదుగా ఇచ్ఛాపురం వరకూ పొడిగించాలని, రుణమాఫీ చేసి కొత్త రుణాలు ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. అంతకు ముందు శిరీషకు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో అధ్యక్షుడు ఎం.మాధవరావు, కార్యదర్శి జి.చలపతిరావు, కోశాధికారి ఎం.ధర్మారావు, సింహాద్రి, గున్నయ్య, తవిటయ్య, దుర్యోధన, వీరాస్వామి పాల్గొన్నారు.