ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చంద్రబాబు విజ్ఞప్తికి కేంద్రం అంగీకారం.. ఏపీకి ఆ ఐఏఎస్‌ కేటాయింపు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jun 23, 2024, 04:16 PM

 కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీ.. తనకు కావాల్సిన వాటిని సాధించుకుంటోంది. ఈ క్రమంలోనే కేంద్ర సర్వీసుల్లో ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారిని రాష్ట్రానికి పంపించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన విజ్ఞప్తికి కేంద్రం ఓకే చెప్పింది. చంద్రబాబు అడిగిన సీనియర్ ఐఏఎస్ అధికారిని ఏపీకి పంపించేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. కేంద్రంలో విధులు నిర్వర్తిస్తున్న మరికొందరు ఐఏఎస్ అధికారులు కూడా త్వరలోనే రాష్ట్రానికి రానున్నట్లు తెలుస్తోంది.


సీనియర్ ఐఏఎస్ అధికారి పీయూష్ కుమార్ ఆంధ్రప్రదేశ్‌కు తిరిగి వచ్చారు. పీయూష్ కుమార్‌ను కేంద్ర సర్వీసుల నుంచి రీలివ్ చేస్తూ కేంద్ర సిబ్బంది మరియు వ్యవహారాల శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్రంలో పనిచేస్తున్న ఏపీ కేడర్ అధికారులను రాష్ట్రానికి పంపాలని ఇటీవలే డీవోపీటీకి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. ప్రస్తుతం కేంద్రంలో కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ శాఖ అదనపు సెక్రటరీగా పీయూష్ కుమార్ విధులు నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఆర్థిక శాఖ బాధ్యతలను పీయూష్‌ కుమార్‌కు అప్పగించే అవకాశాలు ఉన్నాయి. పీయూష్ కుమార్ మాత్రమే కాకుండా త్వరలో కేంద్రంలో పనిచేస్తున్న మరికొందరు సీనియర్ ఐఏఎస్‌లను కూడా ఏపీకి తిరిగి తీసుకువచ్చేందుకు చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు.


ఇక ఆంధ్రప్రదేశ్‌లో భారీగా కలెక్టర్లను బదిలీలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. 26 జిల్లాలకు గానూ 13 జిల్లాల కలెక్టర్లను ట్రాన్స్‌ఫర్ చేసింది. ఇప్పటివరకు 7 జిల్లాలకు కలెక్టర్లుగా ఉన్న వారిని జీఏడీకి రిపోర్టు చేయాలని ఆదేశించింది. జీఏడీకి రిపోర్టు చేయాలని ఆదేశించిన వారిలో గుంటూరు కలెక్టర్‌ వేణుగోపాల్‌ రెడ్డి, విశాఖ కలెక్టర్ మల్లికార్జు్న్, అల్లూరి జిల్లా కలెక్టర్‌ విజయ్ సునీతా, కాకినాడ జిల్లా కలెక్టర్ జే. నివాస్‌, ఏలూరు కలెక్టర్‌ ప్రసన్న వెంకటేశ్‌, తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌ మాధవిలత, ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ ఢిల్లీ రావు ఉన్నారు.


ఇక విశాఖ కలెక్టర్‌గా విశాఖ జేసీకి అదనపు బాధ్యతలు అప్పగించారు. గుంటూరు కలెక్టర్‌గా ఎస్.నాగలక్ష్మి.. అల్లూరి జిల్లా కలెక్టర్‌గా ఏఎస్ దినేష్‌ కుమార్‌.. కాకినాడ కలెక్టర్‌గా షన్‌మోహన్‌.. ఏలూరు కలెక్టర్‌గా వెట్రి సెల్వీ.. తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్‌గా పి.ప్రశాంతి.. విజయనగరం కలెక్టర్‌గా బీఆర్‌ అంబేద్కర్‌.. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్‌గా నాగరాణి.. చిత్తూరు జిల్లా కలెక్టర్‌గా సుమీత్‌కుమార్‌.. ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌గా సుజన నియమితులయ్యారు. ప్రకాశం జిల్లా కలెక్టర్‌గా తమీమ్ హన్సారియా.. కర్నూల్ జిల్లా కలెక్టర్‌గా రంజిత్ భాష.. బాపట్ల జేసీకి కలెక్టర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com