ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సంక్షేమ హాస్టళ్లపై ప్రత్యేక శ్రద్ధ వహించండి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jun 18, 2024, 05:27 PM

ఈ విద్యా సంవత్సరంలో సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థుల ప్రవేశాల సంఖ్య పెంపునకు చర్యలు తీసుకోవాలని ఆశాఖ అధికారులను రాష్ట్ర సాంఘిక సంక్షేమ, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమం, సచివాలయాల శాఖ మంత్రి డాక్టర్‌ డోలా శ్రీబాలవీరాంజనేయ స్వామి ఆదేశించారు. వచ్చే నెల 1న సచివాలయ సిబ్బంది ద్వారా ఇంటింటికీ పింఛన్ల పంపిణీకి చర్యలు తీసుకోవాలని సూచించారు. మంత్రిగా ప్రమాణస్వీకారం అనంతరం స్వగ్రామమైన నాయుడుపాలేనికి చేరుకుని తన నివాసంలో ఉన్న ఆయన్ను సోమవారం పలు శాఖల అధికారులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయా శాఖల కార్యక్రమాలను అడిగి తెలుసుకున్న మంత్రి డాక్టర్‌ స్వామి.. తన శాఖలకు సంబంధించిన అంశాలపై సమీక్ష చేశారు. సాంఘిక సంక్షేమశాఖ డిప్యూటీ డైరెక్టర్‌ లక్ష్మానాయక్‌, ఒంగోలు, కొండపి ఏఎ్‌సడబ్ల్యూవోలు లింగయ్య, దానయ్య, జిల్లా గ్రామ, వార్డు సచివాలయాల పర్యవేక్షణాధికారి ఉషారాణి, దివ్యాంగుల సంక్షేమశాఖ ఏడీ అర్చన, ఆ శాఖల అధికారులు పలువురు పాల్గొన్నారు. తొలుత జిల్లాలో పదో తరగతి లోపు 61, మరో 20 కాలేజీ హాస్టళ్లు సాంఘిక సంక్షేమశాఖలో ఉండగా గత ఏడాది సుమారు 5,700 మంది విద్యార్థులు ఉన్నట్లు డీడీ లక్ష్మానాయక్‌ మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఆయా హస్టళ్లలో సౌకర్యాలు, ఇతర అంశాలను వివరించారు. వాటిపై మంత్రి డాక్టర్‌ స్వామి స్పందిస్తూ.. పేద విద్యార్థులకు విద్యను అందించే సంక్షేమ హాస్టళ్లలో ఎక్కువ మంది విద్యార్థులు చేరేలా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే ప్రభుత్వం నిర్దేశించిన మెనూ అమలు, కనీస సౌకర్యాల మెరుగు, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. అద్దె భవనాల్లో సమస్యలు అధికంగా ఉంటున్న దృష్ట్యా భవన యజమానులతో మాట్లాడి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో సచివాలయ వ్యవస్థపై నోడల్‌ అధికారి ఉషారాణి మంత్రికి వివరించారు. వచ్చేనెల 1నుంచి పింఛన్‌ మొత్తాన్ని ప్రభుత్వం రూ.3వేల నుంచి రూ.4వేలకు పెంచుతున్నదని మంత్రి ఆ సందర్భంగా తెలిపారు. జూలై 1న బకాయిలు రూ.3వేలు కలిపి ఒక్కొక్కరికి రూ.7వేలు ఇవ్వనున్నట్లు చెప్పారు. సచివాలయ సిబ్బందికి బాధ్యతలు అప్పగించి, విధుల్లో ఉన్న వలంటీర్లను సమన్వయం చేసుకొని ఆ మొత్తాలను లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి ఇచ్చేలా ప్రణాళిక రూపొందించాని మంత్రి ఆదేశించారు. అలాగే దివ్యాంగుల శాఖ పరిధిలోని అంశాలను ఆ శాఖ ఏడీ ఆర్చనను అడిగి తెలుసుకొని పలు సూచనలు చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com