ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత్‌తో పెట్టుకుంటే అంతే.. మాల్దీవులకు ప్రపంచ బ్యాంకు హెచ్చరిక

national |  Suryaa Desk  | Published : Fri, Jun 14, 2024, 10:10 PM

తన స్థాయికి మించిన ఖర్చుచేస్తోన్న మాల్దీవులు తీవ్ర ఆర్ధిక సంక్షోభం ముప్పు దిశగా సాగుతోందని ప్రపంచ బ్యాంకు హెచ్చరించింది. ప్రస్తుతం 512 మిలియన్ డాలర్లుగా ఉన్న మాల్దీవుల వార్షిక రుణ సేవల అవసరాలు 2026 నాటికి 1.07 బిలియన్ డాలర్లకు చేరుతాయని ప్రపంచ బ్యాంక్ కంట్రీ డైరెక్టర్ (మాల్దీవులు, నేపాల్, శ్రీలంక) ఫారిస్ హెచ్ హడాద్-జెర్వోస్ హెచ్చరిక జారీ చేశారు. మాల్దీవులు ఆర్దికపరంగా తీవ్ర ఒడిదొడుకులను ఎదుర్కొంటోందని ఆయన ట్విట్టర్ (ఎక్స్)‌లో తెలిపారు. దేశ బహిరంగ రుణాల వాటా జీడీపీలో దాదాపు 110 శాతం మేర ఉందని మాల్దీవుల ఆర్దిక మంత్రిత్వ శాఖ ఇటీవల ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ క్రమంలో ప్రపంచ బ్యాంకు హెచ్చరికలు రావడం గమనార్హం. మాల్దీవుల ఆదాయానికి ప్రధాన వనరు పర్యాటకం. కోవిడ్-19 లాక్‌డౌన్ కారణంగా పర్యాట రంగం కుదేలయ్యింది. గతేడాది నుంచి క్రమంగా కోలుకుంటోంది.


 ‘జూన్ 1న విడుదలైన మాల్దీవుల ఆర్దిక మంత్రిత్వ శాఖ మొదటి త్రైమాసిక రుణాల బులిటెన్ ప్రకారం.. బహిరంగ రుణాలు 8.2 బిలియన్లకు చేరుకున్నాయి. అంటే ఇది ఆ దేశ జీడీపీలో 110 శాతం.. 2023 చివరికి 8.09 బిలియన్ డాలర్లుగా ఉన్న ఈ రుణాలు 2024 మొదటి త్రైమాసికంలో 90.8 మిలియన్లకు చేరినట్టు మంత్రిత్వ శాఖ నివేదించింది’ అని ప్రపంచ బ్యాంకు కంట్రీ డైరెక్టర్ ట్వీట్ చేశారు. ‘దశాబ్దాలుగా మాల్దీవుల తన ఆదాయానికి మించి ఖర్చు చేస్తోంది.. వేగంగా వ్యయం పెరగడం, సబ్సిడీలు లోటును పెంచాయి.. ఇది తీవ్ర ఆర్థిక సంక్షోభానికి, అధిక రుణ భారానికి దారితీసింది’ అని అన్నారు. మాల్దీవులు 2024, 2025లో 512 మిలియన డాలర్ల వార్షిక రుణాలను చెల్లించాల్సి ఉంటుందని, ఇది 2026 నాటికి 1.07 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని తెలిపారు. ‘మాల్దీవులు అధిక రుణ ముప్పు, ఆర్ధిక సవాళ్లను ఎదుర్కొంటుంది.. ఇది సంక్షోభానికి దారితీసుంది’ అని ఆయన హెచ్చరించారు. సంక్షోభాన్ని నివారించడానికి పలు ఆర్ధిక సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం ఉందని ఆయన నొక్కిచెప్పారు.


ప్రభుత్వ రంగ సంస్థల బలహీనతలను పరిష్కరించడం, ఆరోగ్య సంరక్షణ కోసం ఖర్చులను మెరుగుపరచడం, ప్రభుత్వ పెట్టుబడులను క్రమబద్ధీకరించడం లాంటి పనులు చేయాల్సి ఉంటుందని వివరించారు. ‘దేశ ఆర్ధిక వ్యవస్థకు కీలకమైన పర్యాటక రంగం ఆదాయం గతేడాది చివరి నుంచి తగ్గిపోయింది’ అని ఆయన తెలిపారు. ప్రధాని మోదీ లక్షద్వీప్ పర్యటనపై మాల్దీవులు మంత్రులు సోషల్ మీడియాలో చేసిన అనుచిత వ్యాఖ్యలు ఆ దేశ పర్యాటకానికి తీవ్ర నష్టం కలిగించాయి. మాల్దీవులకు బాయ్‌కాట్ చేయాలని భారతీయులు పిలుపునివ్వడంతో అక్కడకు వెళ్లే పర్యాటకుల సంఖ్య భారీగా పడిపోయింది.


గతేడాది భారత్‌ నుంచి 2,09,198 మంది పర్యాటకులు మాల్దీవులను సందర్శించగా.. ఆ ద్వీపదేశ పర్యాటక మార్కెట్‌లో 11 శాతం వాటాతో భారత్ అగ్రస్థానంలో నిలిచింది. రష్యా రెండో స్థానంలో.. చైనా మూడో స్థానంలో కొనసాగాయి. కానీ, మోదీపై అనుచిత వ్యాఖ్యల అనంతరం జరిగిన పరిణామాలతో ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన వివాదం మొదలయ్యాయి. దీంతో భారతీయ పర్యాటకుల ఐదో స్థానంలో నిలిచారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com